Bus Accident: అప్పటి దాకా సజావుగా సాగిన ప్రయాణం... మరికొద్దిసేపట్లో చేరుకోనున్న గమ్యం... అంతలోనే బస్సు అదుపు తప్పి వంతెన పైనుంచి రెయిలింగ్ ఢీకొడుతూ వాగులోకి దూసుకుపోయింది... ఏం జరుగుతోందో తెలిసేలోపే కొందరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు వంతెన దగ్గర బుధవారం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆప్తులను కోల్పోయిన వారి వేదన, గాయాలు మిగిల్చిన ఆవేదన, కాపాడండి... అనే ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. జల్లేరు వాగు రక్తపు మడుగులా మారింది.
వేలేరుపాడు నుంచి భద్రాచలం మీదుగా జంగారెడ్డిగూడెం వస్తున్న ఆర్టీసీ బస్సులో 49 మంది ప్రయాణికులున్నారు. ఉదయం 11.45 గంటలకు బస్సు గమ్య స్థానానికి చేరుకోవాల్సి ఉండగా 12.00 గంటలకు ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో అక్కడికక్కడే 9 మంది చనిపోగా ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 9 మంది పశ్చిమగోదావరి జిల్లావాసులు కాగా... ఒకరిది తూర్పుగోదావరి జిల్లా. 25 మందికి గాయాలయ్యాయి. స్థానికులు, పరిసర ప్రాంతాల్లో పని చేస్తున్న వారు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. యువకులు జల్లేరులో దిగి సహాయక చర్యలు చేపట్టారు. సమీపంలోని పడవల ద్వారా బస్సు వద్దకు చేరుకుని కొందరిని రక్షించారు. మృతదేహాలను వెలికి తీశారు.
క్షతగాత్రులను ఒడ్డుకు చేర్చారు. స్థానిక పోలీసులు, వైద్యారోగ్య శాఖ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది మూడు క్రేన్ల సహాయంతో బస్సును బయటకు తీశారు. ఇందుకు 3 గంటలు పట్టగా... అంతసేపూ 4 కిలోమీటర్ల మేర ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ రాహుల్దేవ్ శర్మ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. జంగారెడ్డిగూడెం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.
ఘటన స్థలంలో మృతదేహాలు
మృతుల వివరాలివీ..
మృతుల్లో ఏడుగురు మహిళలు, ముగ్గురు పురుషులున్నారు. ఆడమిల్లి జాన్మోజెస్ (52), ఎం.లక్ష్మి(40), పొడపాటి దుర్గమ్మ(55), ఉండ్రాజవరపు సరోజిని (56), బడుగు సత్యవతి(58), శ్రీరాముల బుల్లెమ్మ(45), కేతా వరలక్ష్మి(62), బస్సు డ్రైవర్ సాలుమూరి చిన్నారావు(46), పాలడుగుల మహాలక్ష్మి(45), తూర్పుగోదావరి జిల్లా కడియానికి చెందిన సోమరాజు(55) మృతుల్లో ఉన్నారు.
మృతుల కుటుంబాలకు ప్రధాని సంతాపం
మృతుల కుటుంబాలకు ప్రధాన మంత్రి మోదీ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పీఎం సహాయనిధి నుంచి రూ.2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
సీఎం తీవ్ర దిగ్భ్రాంతి, 5 లక్షల పరిహారం
సీఎం జగన్ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, తెదేపా అధినేత చంద్రబాబు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
ఆర్టీసీ నుంచి రూ.2.50 లక్షల చొప్పున పరిహారం