ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

paddy farmers problems: పక్కనే నీళ్లు.. పొలాలకు రావాలంటే మోటర్లు పెట్టాల్సిందే!

పశ్చిమగోదావరి డెల్టాలో వరిసాగు రోజురోజుకు కష్టతరమవుతోంది. ఆధునీకీకరణకు నోచుకోని కాలువలు.. రైతులకు అదనపు పెట్టుబడిని తెచ్చిపెడుతున్నాయి. పక్కనే నీరున్నా.. పొలానికి మాత్రం అందని దుస్థితి. ఈ క్రమంలో వేసిన పంటను రక్షించుకోవడానికి రైతులు.. డీజిల్ ఇంజన్లపై ఆధారపడుతున్నారు. తద్వారా వేలాది రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. జిల్లాలో వేలాది మంది రైతులు.. సాగునీరు సవ్యంగా అందక.. డీజిల్ ఇంజన్​ మోటర్లపై అధికపెట్టుబడి పెట్టి నష్టపోతున్నారు.

By

Published : Sep 10, 2021, 9:22 PM IST

Paddy Former Struggle at west Godavari delta
పశ్చిమగోదావరి డెల్టాలో రైతుల కష్టాలు

పశ్చిమగోదావరి జిల్లాలో సమృద్ధిగా గోదావరి సాగునీరు అందుబాటులో ఉంది. ఏటా రోజువారిగా లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతోంది. రైతు వరి సాగుకు మాత్రం నీరు అందడం లేదు. డెల్టాలో వేల కిలోమీటర్లు విస్తరించిన సాగునీటి కాలువలు అధునీకరణకు నోచుకోకపోవడం వల్ల.. ఈ దుస్థితి నెలకొంది. ఫలితంగా నీటిని పొలానికి తీసుకెళ్లడానికి రైతులు(Paddy Former Struggle) డీజిల్ ఇంజన్లపై ఆధారపడ్డారు. గతంలో రబీ పంట సాగుకు మాత్రమే డీజిల్ ఇంజన్లు వినియోగించేవారు. ప్రస్తుతం ఖరీప్ సాగుకు సైతం ఈ ఇంజన్లు వినియోగిస్తున్నారు. డెల్టాలోని శివారు పొలాల రైతులు పరిస్థతి మరీ దారుణం.

పశ్చిమగోదావరి డెల్టాలో రోజురోజుకు కష్టతరమవుతున్న వరిసాగు

డీజిల్​ ఇంజన్లతో వరిసాగు..

పశ్చిమగోదావరి డెల్టాలో ఏలూరు, జీవీ, నరసాపురం, ఉండి, అత్తిలి కాలువలకు ప్రధాన కాలువల ద్వారా నీటి సరఫరా సాగుతోంది. అయితే రెండేళ్లుగా పూడిక తీయకపోవడంతో ఈ కాలువలు అధ్వానంగా తయారయ్యాయి. వాటిల్లో నీరు ముందుకుసాగే పరిస్థితి లేదు. దీనికితోడు నాచు, గుర్రపుడెక్కా, కలుపుమొక్కలు నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. కాలువల్లో నీరు సమృద్ధిగా ఉంటేనే తూములకు నీరు అందుతుంది. కాలువలల్లో నీటి మట్టం పడిపోవడంతో తూముల ద్వారా వరి పొలాలకు నీటి సరఫరా సవ్యంగా సాగడం లేదు. దీంతో రైతులు డీజిల్ ఇంజన్లపై ఆధారపడి పంట సాగు చేస్తున్నారు. నీరు అందక పలువురి రైతుల పొలాలు ఎండిపోయాయి.

ఈ నేపథ్యంలో రైతులు ముందుగానే కాలువలకు డీజిల్ ఇంజన్లు(diesel engines) అమర్చుకుంటున్నారు. అయితే ఈ మోటర్ల వినియోగం రైతులకు భారమైంది. పంట పెట్టుబడులకు తోడు డీజిల్​ కోసం అదనంగా వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ఒక ఎకరా పొలం తడవడానికి రెండు నుంచి మూడు లీటర్ల డీజిల్​ ఖర్చువుతోంది. ఇలా పంట కొతకొచ్చే సరికే సుమారు రూ. 4ం వేలు వరకు అదనంగా అదనపు భారమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు కాలువ కింద గుండుగొలను నుంచి సుమారు 35వేల ఎకరాల్లో రైతులు డీజిల్​ ఇంజన్లపై ఆధారపడ్డారు. అత్తిలి కాలువ కింద.. 40వేల ఎకరాల్లో.. ఉండి, ఆకివీడు కాలువ కింద సుమారు 30వేల ఎకరాల్లో ఈ ఇంజన్ల సాయంతో వరి పంటను కాపాడుకొంటున్నారు.

దశాబ్దాలుగా మరమ్మతులకు నోచుకోట్లేదు..

కాలువల ఆధునీకీకరణ చేపట్టకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తుతోంది. డెల్టాలో కాలువల ఆధునీకరణకు దశాబ్దాలుగా సాగుతూనే ఉంది. వందల కోట్ల రూపాయలు మరమ్మతులకు ఖర్చుపెట్టారు. అయినా ఇప్పటికీ కాలువల పరిస్థితి అధ్వానంగా ఉందని రైతులు అంటున్నారు. ఏలూరు కాలువ కింద నారుమడులకు సైతం నీటిని డీజిల్ ఇంజన్ల ద్వారానే సరఫరా చేశారు. దెందులూరు, ఏలూరు, ఉంగుటూరు, భీమడోలు పరిసర ప్రాంతాల్లో 40వేల ఎకరాల్లో వరి పొలాలు బీటలు బారాయి. వర్షాల రాకతో కొన్ని చోట్ల రైతులకు ఊరట లభించింది.

సమృద్ధిగా నీరున్నా.. కష్టాలు తప్పట్లేదు...

ఖరీఫ్​లో నాలుగున్నర లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. రబీలో సుమారు మూడున్నర లక్షల ఎకరాల్లో సాగు చేస్తారు. ఖరీఫ్​లోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక రబీలో పరిస్థితి ఎలా ఉంటుదోనన్న భయాందోళనలు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గోదావరిలో సమృద్ధిగా నీరున్నా.. తమకు సాగునీటి కష్టాలు తప్పడం లేదని రైతులు అంటున్నారు. డెల్టాలో కాలువల ఆధునీకరణ చేపట్టి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి..river pollution: కాలుష్యం కోరల్లో తుంగభద్ర, కుందూ నదులు

ABOUT THE AUTHOR

...view details