మొదటి అర్ధసంవత్సర ఆస్తి పన్ను వసూళ్లులో పశ్చిమగోదావరి జిల్లాలోని పురపాలికలు లక్ష్యాన్ని అధిగమించాయి. ఆర్థిక సంవత్సరం మొత్తానికి 68 కోట్ల 60 లక్షల రూపాయలు వసూలు చేయాల్సి ఉండగా... మొదటి అర్ధ సంవత్సరంలో 36 కోట్ల 82 లక్షల రూపాయలు, 60 శాతంపైగా వసూలు చేసి లక్ష్యం సాధించాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ వసూళ్లు 20 శాతం అధికంగా ఉన్నాయి.
జిల్లాలో 8 పురపాలక సంఘాలు ఒక నగరపాలక సంస్థ ఉంది. వీటిలో ప్రతి సంవత్సరం ఆరు నెలలకు ఒకసారి ఆస్తిపన్ను వసూలు చేస్తారు. ఏప్రిల్ మొదటి తేదీ నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు మొదటి అర్ధ సంవత్సరంగాను, అక్టోబర్ మొదటి తేదీ నుంచి మార్చి నెలాఖరు వరకు రెండో అర్ధ సంవత్సరంగాను లెక్కిస్తారు. ఆస్తి పన్ను వసూలుకు సంబంధించి మొత్తం సంవత్సరానికి లెక్కించి అర్ధ సంవత్సరం లక్ష్యం నిర్దేశించుకుంటారు.