Unfinished Parks: పాలకొల్లులోని నారా చంద్రబాబునాయుడు ఉద్యానవనంలో పట్టణవాసులు సాయంత్రం పూట సరదాగా కుటుంబంతో గడిపేందుకు తెలుగుదేశం హయాంలో నిర్మాణం ప్రారంభించారు. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ పార్కులో వాకింగ్ ట్రాక్, పిల్లలు ఆడుకునే జారుడు బల్లలు, ఉయ్యాలలు, వ్యాయామ పరికరాలు, వాటర్ ఫౌంటైన్.. ఇలా ఎన్నో వసతులు సమకూర్చారు. గ్రామీణ వాతావరణాన్ని తలపించే బొమ్మలతో పాటు వివిధ రకాల కళాఖండాలను సుందరంగా తీర్చిదిద్దారు.
కోట్ల రూపాయలు ఖర్చుచేసి నిర్మించిన ఈ ఉద్యానవనంలో.. చిన్న చిన్న పనులు పూర్తిచేస్తే ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ప్రభుత్వం మారాక ఈ పార్కును పట్టించుకోకపోవడంతో పార్కులో వాకింగ్ ట్రాక్ దెబ్బతింది. కూర్చునేందుకు ఏర్పాటు చేసిన కుర్చీలు విరిగిపోయాయి. పిల్లలు ఆడుకునే పరికరాలు సైతం పాడైపోయాయి. ఎంతో అందంగా తీర్చిదిద్దిన విగ్రహాలు రంగు వెలసి పోగా కొన్ని విరిగిపోయాయి. పనులు అసంపూర్తిగా ఉన్నాయనే కారణంతో పార్కులోకి ప్రజలను అనుమతించడం లేదు. దీంతో ఎప్పుడు చూసినా ఈ ఉద్యానవం గేటు మూతబడి కనిపిస్తోంది.
తెలుగుదేశం హయాంలో ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిగా ఉన్న నిమ్మల రామానాయుడు.. పట్టుదల, కృషితో అబ్దుల్ కలాం పార్కు, కైలాస వనాలను అభివృద్ధి చేశారు. పట్టణంలోని శంభుని చెరువు ప్రాంతాన్ని అందమైన ఆరోగ్య ఉద్యానవనంగా తీర్చిదిద్ది అబ్దుల్ కలాం హెల్త్ పార్క్ అని పేరు పెట్టారు. పట్టణ ప్రజలు ఇక్కడ ఉదయం, సాయంత్రం నడకతో పాటు వ్యాయామం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. చెరువు చుట్టూ నడక మార్గం, సేదతీరేందుకు కుర్చీలు ఉన్నాయి. చిన్నపాటి పనులు పూర్తి చేసి పార్కును అందుబాటులోకి తీసుకురావాల్సిన అధికారులు.. రోడ్డు మరమ్మతుల కారణంగా పార్కులోకి అనుమతి లేదంటూ బోర్డు పెట్టి ఇందులోకి ఎవరినీ రానివ్వడం లేదు. శ్మశానమా లేక ఉద్యానవనమా అనుకునేలా మహా నగరాలకు దీటుగా నిర్మించిన కైలాస వనం సైతం సర్వాంగ సుందరంగా తయారైంది.
పాలకొల్లు పట్టణ వాసుల కోసం గత ప్రభుత్వంలో.. ప్రజల కోసం ఎన్నో కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఈ నిర్మాణాలు.. చిన్నపాటి మరమ్మతులకు నోచుకోక వెలవెలబోతున్నాయి. ఏళ్ల తరబడి నిర్వహణ లేక వాటి శోభను కోల్పోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. ఈ పార్కుల్లో అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని పట్టణ వాసులు కోరుతున్నారు.