ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఐదేళ్ల క్రితం భూమిపూజ.. ఇంకా పూర్తికాని గొంతేరు బ్రిడ్జి - Kottapalem latest news

Stalled Construction Of Gontheru Bridge: ఐదేళ్ల క్రితం భూమిపూజ చేసిన ఓ వంతెన నిర్మాణం ఇప్పటికీ పూర్తవ్వలేదు. బ్రిడ్జి పనులు నిలిచిపోవటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలంలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..

Stalled Construction Of Gontheru Bridge
నాలుగేళ్లుగా నిలిచిపోయిన గొంతేరు వంతెన నిర్మాణం

By

Published : Apr 6, 2023, 12:33 PM IST

నాలుగేళ్లుగా పూర్తికాని గొంతేరు బ్రిడ్జి నిర్మాణం

Stalled Construction Of Gontheru Bridge: ఆ కాలువపై వంతెన కోసం సుమారు ఐదేళ్ల క్రితం భూమిపూజ చేసినా.. ఇప్పటికీ నిర్మాణం ఓ కొలిక్కి రాలేదు. ప్రభుత్వం మారిన అనంతరం రివర్స్ టెండరింగ్ పేరిట బ్రిడ్జి పనులు కాస్తా అటకెక్కాయి. వైసీపీ ప్రజాప్రతినిధులు మరోసారి భూమిపూజ చేసి పనులు ప్రారంభించినా.. వంతెన నిర్మాణం మాత్రం వేగవంతం కాలేదు. ఆ ప్రాంత ప్రజల, రైతుల దశాబ్దాల నిరీక్షణ.. కలగానే మిగిలిపోతోంది.

పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం కొత్తపాలెం పరిధిలో గొంతేరు డ్రెయిన్‌పై చేపట్టిన వంతెన నిర్మాణం పనులు నాలుగేళ్లుగా ముందుకు సాగడం లేదు. 2018లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం.. వంతెన, అనుసంధాన రహదారుల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. అప్పటి మంత్రి నారా లోకేశ్‌.. బ్రిడ్జి నిర్మాణానికి శిలాఫలకం ఆవిష్కరించి భూమిపూజ చేశారు. కేంద్రం 16.50 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. కాగా.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. రివర్స్ టెండర్‌ విధానం అమలుచేయడంతో.. పనులు ఆగిపోయాయి. 2020లో వంతెన నిర్మాణానికి.. స్థానిక ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు.. మరోసారి భూమిపూజ చేశారు. మూడేళ్లు గడుస్తున్నా.. పనుల్లో మాత్రం కదలిక లేదు.

మొగల్తూరు మండలంలోని కొత్తపాలెం, శేరేపాలెంతో పాటు ఇతర గ్రామాలకు చెందిన రైతులకు.. ఈ గొంతేరు డ్రెయిన్‌ అవతల 2 వేల ఎకరాల భూములున్నాయి. నిత్యం రైతులు.. పొలం పనులు, పశుగ్రాసం, చేపల పెంపకం వంటి పనుల కోసం డ్రెయిన్‌ అవతలికి వెళ్లాల్సిందే. డ్రైయిన్ దాటేందుకు రేకు పడవల్ని ఉపయోగిస్తుండగా.. వర్షాకాలంలో ఉద్ధృత ప్రవాహాన్ని దాటి అవతలి గట్టుకు చేరుకోవడం ప్రమాదకరంగా మారింది. వంతెన పూర్తైతే.. కష్టాలు తీరతాయని రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే అది ఇప్పట్లో సాకారమయ్యేలా కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

"ఈ బ్రిడ్జి శంకుస్థాపన నాలుగైదు సంవత్సరాల క్రిందట అయింది. వంతెన నిర్మాణం పనులు పూర్తయితే రైతులకు, ప్రయాణికులకు అందరికీ ఉపకారంగా ఉంటుంది. కేంద్రం నిధులన్నారు.. అవన్నారు.. ఇవన్నారు.. అంతేకానీ బ్రిడ్జి పనులు మాత్రం నిలిచిపోయాయి. బ్రిడ్జి నిర్మాణం పూర్తవ్వక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. వంతెన పనులు తొందరగా పూర్తయితే అందరం సుఖపడతాం." - చిన్ని ఆంజనేయులు, కొత్తపాలెం

వంతెన నిర్మాణ ప్రాంతం నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో కంసాలబేతపూడి వరకు నిర్మించే రహదారికి కొంత మేర భూమి సేకరించాల్సి ఉంది. ఇప్పటి వరకూ ఆ ప్రక్రియ పూర్తికాలేదు. భూసేకరణ జరగకపోతే.. అనుసంధాన రహదారి ప్రశ్నార్థకమేనన్న మాటలు వినిపిస్తున్నాయి. కాగా.. వంతెన నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని.. ప్రజలు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details