ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'పవన్‌ను చూసి రెచ్చిపోతున్నారు'

By

Published : Feb 26, 2021, 3:36 PM IST

Updated : Feb 27, 2021, 10:48 AM IST

పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో దళితులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని.. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వారిని అరెస్టు చేయకుంటే వైకాపా ఆధ్వర్యంలో దళితులకు మద్దతుగా చలో మత్స్యపురి కార్యక్రమాన్ని చేపడతామని స్పష్టం చేశారు. జనసేన నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ను చూసుకుని రెచ్చిపోతున్నారంటూ విమర్శించారు.

mla grandhi
భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

జనసేన నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ను చూసుకుని రెచ్చిపోతున్నారంటూ భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం మత్స్యపురిలో గురువారం రాత్రి జనసేన, వైకాపా వర్గాల ఘర్షణతో ఉద్రిక్తత నెలకొన్న క్రమంలో ఆయన భీమవరంలో మాట్లాడారు.

‘పవన్‌ కల్యాణ్‌ సినిమాల్లో రకరకాల వేషాలు వేస్తారు. వాటిని నమ్మే స్థితిలో ప్రజలు లేరు. ఎన్నికలకు ముందు, తర్వాత కూడా మేమెంత ఓర్పుగా ఉన్నామో ప్రజలు చూశారు. పార్టీ నాయకుడి తీరును బట్టే కార్యకర్తలు ఉంటారనడానికి జనసైనికుల తీరే నిదర్శనం. మత్స్యపురిలో దళిత మహిళను సజీవదహనం చేయాలని, దళితుల ఇళ్లను తగలబెట్టాలని చూశారు. పరిస్థితిని సమీక్షించేందుకు వెళ్తే నాపైనా దాడికి ప్రయత్నించారు. వైకాపా నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం. పోలీసుల తీరూ జనసేనకు మద్దతిస్తున్నట్లుగా ఉంది’ . -భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

గురువారం రాత్రి మత్స్సపురిలో ఉద్రిక్తత గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే అక్కడకు వెళ్లారు. దాడులు చేసినవారిని 24 గంటల్లోగా అరెస్టు చేయకపోతే చలో మత్స్యపురి నిర్వహిస్తాం అన్నారు.

మత్స్యపురిలో ఏం జరిగింది?

మత్స్యపురి సర్పంచిగా తమ పార్టీ మద్దతుతో కారేపల్లి శాంతిప్రియ గెలుపొందారంటూ జనసేన నాయకులు గురువారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. వారు బాణసంచా కాల్చడంతో నిప్పురవ్వలు ఒక తాటాకు ఇంటిపై పడి మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న దివ్యాంగురాలిపై కూడా నిప్పురవ్వలు పడ్డాయి. వెంటనే జనసేన కార్యకర్తలు ఆర్పివేశారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసేందుకు వెళ్లగా జనసేన, వైకాపా మద్దతుదారుల మధ్య వివాదం చెలరేగింది. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌, వైకాపా నాయకులు వచ్చి కార్యకర్తలకు మద్దతుగా నిలిచారు. ఎమ్మెల్యే వెంట వచ్చిన వారు తమ కార్యకర్తల, వార్డు సభ్యుల ఇళ్లు, వాహనాలపై దాడి చేశారని జనసేన నాయకులు ఆరోపించారు. పోలీసులు గ్రామంలో 144 సెక్షన్‌ విధించారు. దళితుల ఇళ్లకు నిప్పుపెట్టిన జనసేన కార్యకర్తలు, నాయకులపై కేసులు నమోదు చేయాలంటూ వైకాపా, దళిత నాయకులు మత్స్యపురిలో శుక్రవారం దీక్ష చేశారు. నరసాపురం-భీమవరం రహదారిపై బైఠాయించారు.

ఇదీ చదవండి:

మత్స్యపురిలో జనసేన, వైకాపా శ్రేణుల మధ్య ఘర్షణ

Last Updated : Feb 27, 2021, 10:48 AM IST

ABOUT THE AUTHOR

...view details