ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా వేళ అన్ని రంగాల ప్రజా సహకారం.. గ్రీన్​జోన్​లో విజయనగరం జిల్లా

కరోనా.. కరోనా.. గతేడాది నుంచి దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే మాట. రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్నా జిల్లాలో మాత్రం ఆ ఊసే లేదు. సరిహద్దులు మూసివేత.. వాహనాల రాకపోకలపై కఠిన ఆంక్షలు.. నిర్ణీత సమయాల్లోనే బయటకొచ్చి నిత్యావసరాల కొనుగోలుకు అనుమతి.. పోలీసుల పర్యవేక్షణ ఇలా అనేక చర్యలు చేపట్టడంతో రెండు నెలలు విజయనగరం గ్రీన్‌ జోన్‌లో ఉందంటే అది అన్ని వర్గాల సహకారంతోనే సాధ్యమైంది. అంత అప్రమత్తంగా ఉన్నా మహమ్మారి జిల్లాలో అడుగెట్టి నేటికి సరిగ్గా ఏడాది అయింది. ఆ రోజు నుంచి విలయతాండవం చేస్తోంది. ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది. ప్రస్తుతం అందరం నాటి స్ఫూర్తితో మరోసారి గ్రీన్‌జోన్‌లో జిల్లాను నిలబెట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.

By

Published : May 6, 2021, 12:38 PM IST

కరోనా వేళ అన్ని రంగాల ప్రజా సహకారం.. గ్రీన్​జోన్​లో విజయనగరం జిల్లా
కరోనా వేళ అన్ని రంగాల ప్రజా సహకారం.. గ్రీన్​జోన్​లో విజయనగరం జిల్లా

గతేడాది సరిగ్గా ఇదే రోజు అంటే మే ఆరో తేదీ. బలిజిపేట మండలం చిలకలపల్లికి చెందిన ఓ మహిళ కరోనా బారిన పడటం కలకలం రేపింది. అదే తొలి కేసు. అక్కడి నుంచి కేసుల సంఖ్య వందలు.. వేలకు చేరి ప్రస్తుతం వీటి సంఖ్య 54,819. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ నెల 4వ తేదీ వరకు 12,159 కేసులు నమోదు కాగా 79 మంది చనిపోయారంటే కరోనా రెండో దశ ఉద్ధృతిని అర్థం చేసుకోవచ్ఛు ఏడాది కాలంలో నమోదైన కేసుల్లో 22.67 శాతం ఈ 34 రోజుల్లోనై నమోదు కావడం గమనార్హం.

ఉద్యోగులు సైతం వైరస్‌ బారిన..

వివిధ శాఖల్లో పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులు కొవిడ్‌ బారిన పడ్డారు. కొందరు మృతి చెందారు. ఈ ఏడాది కాలంలో వైద్య, ఆరోగ్య శాఖ వైద్యులు, సిబ్బంది సుమారు 352 మంది వైరస్‌ బారిన పడగా.. పది మంది వరకు మృతి చెందారు. విద్యాశాఖలో ఈ రెండు నెలల్లో సుమారు 70 మంది ఉపాధ్యాయులకు వైరస్‌ సోకగా.. 20 మంది వరకు చనిపోయారు. విజయనగరం నగరపాలక సంస్థలో 18 మంది, సచివాలయ కార్యదర్శులు 37 మంది, వాణిజ్య పన్నుల శాఖలో 12 మంది, పశుసంవర్ధక శాఖలో 26, వ్యవసాయ శాఖలో 23 మంది, జిల్లావ్యాప్తంగా 50 మంది వరకు రెవెన్యూ సిబ్బంది, పోలీసులు 98 మంది కొవిడ్‌ బారిన పడ్డారు.

పట్టణాల్లోనే అధికం..

జిల్లాలో 53 వేలకు పైగా కేసులు నమోదు కాగా.. ఒక్క విజయనగరంలోనే 17878 మంది వైరస్‌ బారిన పడ్డారు. పార్వతీపురంలో 3438, సాలూరులో 3475, బొబ్బిలిలో 3447 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా భోగాపురం మండలంలో 359 మంది కొవిడ్‌కు చిక్కారు. పట్టణాల్లో రద్దీ ఎక్కువగా ఉండటం.. పని లేకున్నా బయటకు రావడమే ఇందుకు కారణం.

మృతుల్లో వృద్ధులే ఎక్కువ..

కొవిడ్‌తో చనిపోతున్న వారిలో వృద్ధులే ఎక్కువ. వైరస్‌ బారిన పడుతున్న వారిలో యువత ఎక్కువగా ఉంటున్నా వెంటనే కోలుకుంటున్నారు. చాలామంది వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధులు, మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వాటితో బాధపడుతుంటారని, అలాంటి వారే ఎక్కువగా చనిపోతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 297 మంది మృతి చెందగా.. ఇందులో 60 ఏళ్ల పైబడిన వారు 141 మంది ఉన్నారు.

ధైర్యమే మందు..

చాలామంది కరోనా అనగానే భయపడిపోతున్నారు. మానసికంగా కుంగిపోతున్నారు. ఎక్కడో ఓ చోట మరణిస్తే ఆ వార్తలు విని ఏదో జరిగిపోతుందని జంకుతున్నారు. కరోనాకు అసలు మందు ధైర్యమే. భయం వీడి వైద్యుల సలహాలు పాటిస్తే సులువుగా బయటపడొచ్ఛు నాకు 75 ఏళ్లు, నా భార్య శాంతకుమారికి 72 ఏళ్లు. గతేడాది మా ఇద్దరికీ వైరస్‌ సోకింది. వైద్యుల సూచన మేరకు హోం ఐసోలేషన్‌లో ఉండి పౌష్టికాహారం తీసుకున్నాం. రోజు నాలుగు లీటర్ల గోరు వెచ్చని నీళ్లు తాగాం. మధుమేహం, రక్తపోటు ఉన్నా అన్ని జాగ్రత్తలు తీసుకుని మందులు వాడటంతో 14 రోజుల్లో పూర్తిగా కోలుకున్నాం. ధైర్యంగా ఉంటే సగం వ్యాధిని జయించినట్లే.

- విక్రమ సుదర్శనరావు, శాంతకుమారి, చిట్లువీధి, సాలూరు

భయం వీడితే విజయమే..

నేను వీఆర్వోని. గతేడాది కరోనా వచ్చింది. నాకు కొంచెం అవగాహన ఉండటంతో ధైర్యంగానే ఉన్నా. సామాజిక మాథ్యమాలకు దూరంగా ఉంటూ సంతోషంగా ఉండే ప్రయత్నం చేశా. వైద్యుల సూచనతో ఇంట్లోనే ఉంటూ మందులు వాడా. ఉడకబెట్టిన గుడ్లు, పౌష్టికాహారం తిని రోజుకు రెండు పుటలా ఆవిరి పట్టడంతో రెండు వారాల్లోనే కోలుకున్నా. వైరస్‌ సోకిన వారు ముందుగా భయం వీడితే సులువుగా బయటపడతారు. ప్రస్తుతం చాలామంది ఆందోళనతో ఆసుపత్రుల పాలవుతున్నారు.

- మొబినా మహమ్మద్‌, సాలూరు

ఇవీ చూడండి :'ఆంధ్రప్రదేశ్ రకం వైరస్​ బలహీనమైనదే'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details