ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 25, 2020, 5:23 PM IST

ETV Bharat / state

అభిమానమంటే బ్యానర్లే కాదు.. ఇలా సేవ చేయడం కూడా!

సినీతారలు, ప్రముఖులు ఏం చేసినా.. తొందరగా ప్రజల్లోకి వెళ్తుంది. అందుకే... ఎటువంటి కార్యక్రమాలైన వారితోనే ప్రారంభిస్తుంటారు. అందుకు తాజా ఉదాహరణ ఇటీవల బాగా ప్రాచుర్యం పొందిన...గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌. పచ్చదనాన్ని పెంచడమే లక్ష్యంగా మెుదలైన ఈ కార్యక్రమం.. ప్రముఖుల నుంచి సామాన్యులకు వరకు చేరువైంది. ఆ స్ఫూర్తితోనే గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను ప్రతిష్ఠ్మాతికంగా తీసుకుని.. అందరికి చేరువ చేస్తున్నారు. విజయనగరానికి చెందిన వుయ్​ ఆర్​ ఫర్‌ యూ వెల్ఫేర్‌ అసోసియేషన్‌.

అభిమానమంటే బ్యానర్లే కాదు.. ఇలా సేవ చేయడం కూడా!
అభిమానమంటే బ్యానర్లే కాదు.. ఇలా సేవ చేయడం కూడా!

సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే లక్ష్యంతో ఏర్పడింది.. విజయనగరానికి చెందిన వుయ్​ ఆర్‌ ఫర్‌ యూ వెల్ఫేర్‌ అసోసియేషన్‌. అయితే ఈ సంస్థను నడుపుతోంది... ఉద్యోగాలు చేస్తున్న యువతో... డబ్బులు ఉన్న సంపన్నులో కాదు. డిగ్రీ, ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థులు. తల్లిదండ్రులు ఖర్చులకు ఇచ్చే మెుత్తంలో కొంత సమాజానికి కేటాయిస్తూ.. 2 ఏళ్ల కిందట ఈ సంస్థను ప్రారంభించారు.

కరోనా కాలంలోనూ.. సేవలు

ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా.... ఎందరో అనాథ పిల్లలకు, రోడ్డుపై కాలం వెళ్లదీసే వృద్ధులకు ఆహారం, దుస్తులు అందించారు.. అందిస్తున్నారు. పేద విద్యార్థులకు పుస్తకాలు, ఏకరూప దుస్తులు ఇస్తున్నారు. కరోనా కాలంలోనూ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. వలస కూలీలకు, నిరు పేదలకు ఆహారం, ఆర్థిక చేయూత అందించారు...వుయ్​ ఆర్‌ ఫర్‌ యూ వెల్ఫేర్‌ సంస్థ సభ్యులు.

అభిమానమంటే బ్యానర్లే కాదు.. ఇలా సేవ చేయడం కూడా!

సామాజిక మాధ్యమం వేదికగా..

కరోనా వైరస్‌ తీవ్రత అధికంగా ఉండటంతో మరిన్ని సేవా కార్యక్రమలు చేపట్టడానికి అడ్డంకిగా మారింది. వినూత్నంగా ఏదైనా కార్యక్రమం చేపట్టాలి అనుకుంటున్న తరుణంలో... గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కళ్లముందు మెదిలింది. కొందరు ప్రముఖులు మొక్కలు నాటి ఛాలెంజ్‌లు విసరడం.. వాటిని మరికొందరు స్వీకరించటం... ఈ యువ బృందాన్ని ఆకర్షించింది. నగరాల్లో, పట్టణాల్లో ఆదరణ దక్కించుకున్న ఈ కార్యక్రమాన్ని గ్రామీణ వాసులకు పరిచయం చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు ఇన్‌స్టాగ్రామ్‌ సామాజిక మాధ్యమాన్ని వేదికగా చేసుకున్నారు.

సవాల్ విసరడమే..

ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా... జిల్లా వాసులకే కాకుండా... రాష్ట్రంలో ప్రముఖ పట్టణాల్లోని స్నేహితులకు ఈ ఛాలెంజ్‌ను పరిచయం చేశారు. వుయ్​ ఆర్‌ ఫర్‌ యూ ఛాలెంజ్‌ను స్వీకరించిన వారు... ఒక మెుక్కను నాటాలి. ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేస్తూ...మరో ముగ్గురి స్నేహితులకు సవాల్‌ విసరాలి. అలా... ఇప్పటివరకు... ఈ ఛాలెంజ్‌ను వందలాది మంది స్వీకరించారు. మొక్కలు నాటడమే కాకుండా.... వాటి సంరక్షణ చర్యలు చేపట్టిన వారికి బహుమతులు కూడా అందిస్తోంది ఈ సంస్థ.

పచ్చదనం పెంపొందించే దిశగా 'వుయ్​ ఆర్ ఫర్ యూ వెల్పేర్ అసోసియేషన్' చేస్తున్న కృషిని పలువురు అభినందిస్తున్నారు. ఈ ఆలోచనను సమర్థవంతంగా ఆచరణలో పెడుతున్న యువ బృందానికి జిల్లావాసుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

30 మందికి పైగా సభ్యులు

ముగ్గురితో మెుదలైన వుయ్​ ఆర్‌ ఫర్‌ యూ వెల్‌ఫేర్‌ అసోసియేషన్​లో.. నేడు 30 మందికి పైగా సభ్యులు ఉన్నారు. ఇప్పటివరకు... వందకి పైగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఒకవైపు చదువుకుంటూనే... ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడతున్నందుకు వారి తల్లిదండ్రులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో సేవలను మరింత విస్తృతం చేయడమే తమ లక్ష్యమని చెబుతున్నారు... వీ ఆర్‌ ఫర్‌ యూ బృంద సభ్యులు.

మా హీరో... మా హీరో అంటూ బ్యానర్లు కట్టడం కంటే... ఇలాంటి సమాజహిత కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లేవారే నిజమైన అభిమానులు. పబ్‌ జీ, టిక్‌ టాక్‌లే కాదు... సామాజిక మాధ్యమాల ద్వారా... ఓ బృహత్తర కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చని నిరూపిస్తోంది...వుయ్​ ఆర్‌ ఫర్‌ యూ వెల్ఫేర్‌ సంస్థ.

ఇదీ చదవండి:

'జగనన్న తోడు' ప్రారంభం.. చిరు వ్యాపారుల ఖాతాల్లోకి రూ. 905 కోట్లు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details