ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రహదారుల విస్తరణ.. అడుగు ముందుకు పడని దుస్థితి..! - Municipal Corporation Elections Latest news

చేప చేప ఎందుకు ఎండలేదు... అన్న చందంగా మారింది విజయనగరంలోని రహదారుల విస్తరణ పనులు ప్రారంభించి ఆరేళ్లు గడిచిపోయింది. అడుగు ముందుకు పడని పరిస్థితి. నిధుల సమస్య ఉందా అంటే అదీ లేదు. నిధులున్నా పనులు ముందుకు సాగని దైన్యం. ఇప్పటివరకు ఒక ప్రభుత్వం మారింది. మరికొన్ని రోజుల్లో కార్పొరేషన్ హోదాలో తొలి మేయర్ పాలనా పగ్గాలు చేపట్టనున్నారు. ప్రధాన రహదారుల విస్తరణ పనులు మాత్రం.. ముందుకు సాగలేదు. రహదారుల అభివృద్ధి సంగతేలా ఉన్నా.. నగర ప్రజలు పలు సమస్యలతో సతమతమవుతున్నారు.

Municipal Corporation Elections In Vizianagaram
రహదారుల విస్తరణ.. అడుగు ముందుకు పడని దుస్థితి..!

By

Published : Mar 2, 2021, 7:51 PM IST

Updated : Mar 2, 2021, 9:46 PM IST

కార్పొరేషన్ స్థాయిని అందుకున్న విజయనగరం అత్యంత వేగంగా విస్తరిస్తోంది. విద్య, వాణిజ్యపరంగానే కాకుండా పారిశ్రామికంగానూ ముందడుగు వేస్తోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా.. నగరంలోని రహదారులను విస్తరించాలని పాలకులు నిర్ణయించారు. ఈ మేరకు విజయనగరంలో 2015లో 14 రహదారుల విస్తరణకు అప్పటి పురపాలకులు శ్రీకారం చుట్టారు. ఆరేళ్ల క్రితం చేపట్టిన ఈ పనుల్లో ఇప్పటివరకు నాలుగు రహదారుల విస్తరణ పనులు మాత్రమే పూర్తయ్యాయి.

రహదారుల విస్తరణ.. అడుగు ముందుకు పడని దుస్థితి..!

కోర్టు కేసులు, భవన యజమానుల అభ్యంతరాలు తదితర కారణాలతో మిగిలిన రహదారుల పనులు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అంబటి సత్రం, డీసీసీబీ బ్యాంకు నుంచి ఐస్ ఫ్యాక్టరీ వరకూ రహదారి, దాసన్నపేట రైతు బజారు నుంచి కొత్తపేట నీళ్లట్యాంకు, గంటస్తంభం నుంచి పాతబస్టాండు రహదారుల్లో భవనాల కూల్చివేతకు మాత్రమే పనులు పరిమితమయ్యాయి. భవన యజమానులు, స్థానికులే కాదు.. ప్రయాణికులు, వాహనదారులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు.

రహదారుల విస్తరణ విషయంలో నిబంధనల ప్రకారం.. తొలుత మార్కింగ్ ఇచ్చిన మేరకు కట్టడాలు తొలగించాలి. అవి పూర్తయ్యాక విద్యుత్తు స్తంభాలు తొలగించాలి. అనంతరం మురుగునీటి కాలువల్ని నిర్మించాలి. వాటి తర్వాత తాగునీటి పైపులైన్లు వేయాలి. ఇవన్నీ జరిగాక బీటీరోడ్డు పనులు చేపట్టాలి. ఆయా శాఖల మధ్య సమన్వయం లోపించింది. దశల వారీగా కాకుండా ఇష్టారాజ్యంగా పనులు చేపట్టడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆరేళ్లుగా పనులు సాగుతుండటంతో నరకం చూస్తున్నామని స్థానికులు వాపోతున్నారు. వర్షాకాలంలో అడపాదడపా కురుస్తున్న వర్షాలకూ రోడ్డు బురదమయంగా మారటంతో నడవడానికీ ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రధానంగా అంబటి సత్రం, దాసన్నపేట రైతు బజారు రోడ్లు గోతుల మయంగా మారాయి. ఈ దారులు నెల్లిమర్ల, శ్రీకాకుళం వెళ్లే రహదారులతో కలుస్తాయి. నిత్యం వేలాది వాహనాలు పయనిస్తుంటాయి. నగరంలోని ప్రధాన ప్రభుత్వ వైద్యశాల మాతా-శిశు ఆసుపత్రితో పాటు.. మిమ్స్ వైద్య కళాశాలకు పోయేందుకు ఇవే ప్రధాన మార్గాలు. విస్తరణ పనుల నిలిచిపోయి రహదారి అస్తవ్యస్తంగా, గుంతల మయంగా మారి ఇబ్బందులకు గురవుతున్నామని వాహనదారులు వాపోతున్నారు.

విజయనగరానికి ప్రస్తుతం కార్పొరేషన్ హోదాలో తొలి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొలువుతీరనున్న నూతన పాలకవర్గమైన రహదారుల విస్తీర్ణ అసంపూర్తి పనులపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. విజయనగరం అభివృద్ధి కోసం చేపట్టే రోడ్ల విస్తరణను తప్పు పట్టలేం. స్థానికులు, ప్రయాణికుల ఇబ్బందులపై కనీస ఆలోచనే చేయకపోవటం విచారకరం. ఇప్పటికైన సత్వర చర్యలు తీసుకుని... అంసపూర్తిగా నిలిచిపోయిన పనులను పూర్తి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

ఇదీ చదవండీ... ఆంధ్రా ప్యారిస్​లో ఆసక్తిగా పురపోరు..!

Last Updated : Mar 2, 2021, 9:46 PM IST

ABOUT THE AUTHOR

...view details