విజయనగరం జిల్లా గరివిడి మండలం కొండ లక్ష్మీపురానికి చెందిన పతివాడ లక్ష్మీనారాయణ పేరు చెబితే.. సమీప ప్రాంతాల్లో గుర్తు పట్టని వారు ఉండరు. అలా అని ఆయన శ్రీమంతుడు కాదు.. రాజకీయ నాయకుడు కాదు.. సెలెబ్రిటీ కాదు. ఆయన ఓ ఆటో డ్రైవర్ మాత్రమే. అయినా.. కొండ లక్ష్మీపురంతో పాటు.. చుట్టు పక్కల గ్రామాల్లో చాలా మందికి లక్ష్మీనారాయణ.. ఆపద్బాంధవుడిగా సేవలు చేస్తున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్నవారికి.. తన వంతు సాయం అందిస్తున్నాడు.
ఒకప్పుడు లక్ష్మీనారాయణ తిండి లేక పస్తులున్నాడు. పది తర్వాత చదువును వదిలి విశాఖలోని ప్రింటింగ్ ప్రెస్లో అటెండరుగా చేరాడు. నెలల పాటు జీతాలు రాని పరిస్థితుల్లో పస్తులతో గడిపాడు. ఎక్కడైనా అన్నదానం జరిగుతోందని తెలిస్తే.. వెళ్లి 2 పూటలకు సరిపడా తిని ఆకలి తీర్చుకునేవాడు. ఆయన కష్టాన్ని చూసిన ప్రెస్ లోని ఓ మహిళా స్వీపర్.. తన ఇంటికి తీసుకెళ్లి చద్దన్నం పెట్టారు. ఆమె పస్తులుండి తన కడుపు నింపిందన్న విషయం తెలుసుకున్న లక్ష్మీనారాయణ.. చలించిపోయాడు. తోటివారికి తన వంతుగా ఏదైనా చేయాలని ఆనాడే నిర్ణయం తీసుకుని.. అమల్లో పెట్టాడు.
విశాఖ నుంటి తిరిగి ఇంటికి చేరుకున్న లక్ష్మీనారాయణ.. కొన్నాళ్లు వ్యవసాయం చేశాడు. కుదురుకున్నాక.. సేవా కార్యక్రమాలు ప్రారంభించాడు. ఆటో కొని.. 108 అని రాయించి.. తన ఫోన్ నంబరును అందరికీ కనిపించేలా పెట్టాడు. గ్రామంలో ఎవరు ఏ సమయంలో అనారోగ్యంతో ఫోన్ చేసినా.. వెంటనే వెళ్లడం.. ఆసుపత్రికి తీసుకెళ్లి అవసరమైతే సొంత ఖర్చుతో వైద్యం చేయించడం మొదలుపెట్టాడు. గ్రామంలో మంచినీటి కొరత తీర్చేందుకు తన తల్లిదండ్రుల పేరుతో ట్యాంకర్ కట్టించాడు. ఉచితంగా నీటి పంపిణీ చేస్తున్నాడు. ఏటా.. సంక్రాంతికి పేదలను బట్టలు పెడుతున్నాడు.