ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 21, 2020, 8:03 AM IST

ETV Bharat / state

'రైతులకు సున్నా వడ్డీ వర్తింపు ఇంత తక్కువగానా?'

విజయనగరం జిల్లాలో సున్నా వడ్డీ వర్తింపు తక్కువగా ఉందని వ్యవసాయ శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. రుణాలు చెల్లించినప్పటికీ అనేక మంది రైతుల పేర్లు జాబితాలో చేర్చలేదన్నారు.

agriculture commissioner  vijayanagaram visit
విజయనగరంలో వ్యవసాయ శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ పర్యటన

రైతులకు మేలు కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించిందని, దీనిపై వారికి అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ సిబ్బందికి చెప్పారు. విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా కమిషనర్ బొండపల్లి, గజపతినగరం, బొబ్బిలి, రామభద్రపురం, మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. విజయనగరం జిల్లాలో సున్నా వడ్డీ వర్తింపు తక్కువగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. 2019 ఖరీఫ్‌లో లక్ష రూపాయలు రుణం తీసుకుని ఆగస్టు 2020లోగా తిరిగి చెల్లించిన రైతులంతా ఈ పథకం కిందకు వస్తారని వివరించారు. రుణాలు చెల్లించినప్పటికీ అనేక మంది రైతుల పేర్లు జాబితాలో చేర్చలేదని, వ్యవసాయ అధికారులు బ్యాంకర్లతో కలసి ఈ నెల 27లోగా వారందరికీ వడ్డీ మాఫీ జరిగేలా చూడాలని ఆదేశించారు.

శుక్రవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో కలెక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌తో కలసి సున్నా వడ్డీ, ఈ-పంట, ధాన్యం సేకరణ, పెట్టుబడి రాయితీ తదితర అంశాలపై కమిషనర్‌ సమీక్షించారు. అంతకుముందు జిల్లాలో పర్యటించారు. రైతుకు మద్దతు ధర లభించేలా ధాన్యం సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గత ఖరీఫ్‌లో సేకరించిన ధాన్యానికి డబ్బులు ఇవ్వలేదని ఫిర్యాదులు అందగా.. కారణాలపై ఆరా తీశారు. మొక్కజొన్న సేకరణలో నాణ్యత ప్రమాణాలను ముందే చెప్పాలని, గోదాముకు వెళ్లాక వెనక్కి పంపకూడదని సూచించారు. ప్రతి గ్రామంలో ఎరువులు, రసాయనాలు, విత్తనాలు నిల్వ చేసుకునేందుకు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్‌ డాక్టర్‌ జీసీ కిశోర్‌కుమార్‌, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకురాలు ఎం.ఆశాదేవి, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు శ్రీనివాస్‌, మార్కెటింగ్‌ సహాయ సంచాలకులు శ్యామ్‌కుమార్‌, ఏవోలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details