ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సాఫ్ట్​వేర్ కొలువును వదిలి.. చిత్రకళలో సత్తా చాటుతోన్న యువతి - vishakha latest news

విదేశాల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. లక్షల్లో వేతనం. ఎంతోమంది యువత కలలుగనే జీవితమది. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. ఉద్యోగంలో సంతృప్తి దొరక్క, అభిరుచికి సమయం కేటాయించలేక సతమతమవుతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎంతోమంది ఉంటారు. ఈ ఉద్యోగాలతో కలిగే ఒత్తిడి అధిగమించేందుకు ఇతర వ్యాపకాలకు సమయం వెచ్చించేవారు కొందరైతే... ఉద్యోగాలకే స్వస్తి పలికేవారు కొందరు. రైతులు, కళాకారులు, వ్యాపారవేత్తలుగా మారిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు నిత్యం తారసపడుతూనే ఉంటారు. అలా...కళ కోసం ఉద్యోగం వదిలి, అవార్డులు సాధించేంతలా ఆ కళపై పట్టు సాధించింది విశాఖకు చెందిన సంగీత.

painting
painting

By

Published : Jun 27, 2021, 1:51 PM IST

సాఫ్ట్​వేర్ కొలువును వదిలి.. చిత్రకళలో సత్తా చాటుతోన్న యువతి

తను గీసిన చిత్రాలన్నింటినీ ముచ్చటగా చూసుకుంటున్న ఈ యువతి పేరు సంగీత. ఉద్యోగరీత్యా విశాఖలో స్థిరపడిన కుటుంబం ఆమెది. ఇంజనీరింగ్ తర్వాత సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరింది. వివాహానంతరం..భర్త ఆదిశేషుతో కలిసి బెంగళూరుకు వెళ్లినా.. విదేశాల్లో ఉద్యోగావకాశం రావడంతో.. భారత్‌ను వదిలి విమానం ఎక్కింది. అయినా... జీవితంలో ఏదో కోల్పోతున్నానన్న అసంతృప్తి సంగీతను వేధించడం ప్రారంభమైంది.

కంప్యూటర్ ముందు కూర్చుని పని చేయడం యాంత్రికంగా అనిపించేది సంగీతకు. అంతకు ముందే పెయింటింగ్‌లో ప్రవేశముండడంతో... స్థానికంగా జరిగే ప్రదర్శనలకు హాజరయేది. ఆర్ట్ మ్యూజియంలను సందర్శించేది. అలా తనకు ఇష్టమైన పెయింటింగ్‌కు దూరం కావడమే తనలోని అసంతృప్తికి కారణమని గుర్తించింది సంగీత.

ఉద్యోగానికి రాజీనామా చేసి.. ఫైన్ ఆర్ట్స్​లో చేరి..

చిత్రకళ పట్ల తనకున్న అభిరుచికి పూర్తి స్థాయిలో మెరుగులు దిద్దుకోవాలని సంగీత నిర్ణయించుకుంది. కుటుంబసభ్యుల సహకారంతో ఉద్యోగానికి రాజీనామా చేసి, సొంతూరికి తిరిగి వచ్చింది. ఆ నిర్ణయం ఆమె జీవితాన్ని మలుపుతిప్పింది. ఆత్మసంతృప్తికి మించిన ఆనందం లేదని తెలుసుకునేలా చేసింది. విశాఖకు తిరిగివచ్చిన సంగీత.. చిత్రకళపై పూర్తిస్థాయిలో పట్టు సంపాదించేందుకు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఫైన్‌ఆర్ట్స్ విభాగంలో నాలుగేళ్ల బీఎఫ్ఏ కోర్సులో చేరింది. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతోంది.

గతేడాది దేశంలో నెలకొన్న పరిస్థితులు సంగీత ఆలోచనలకు పదునుపెట్టాయి. దేశమంతా ఇంటిపట్టునే సురక్షితంగా ఉంటే.. వారందరి రక్షణ కోసం ముందుండి పనిచేసిన ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు తన కళ ద్వారా కృతజ్ఞతలు చెప్పాలనుకుంది. వాటర్ కలర్స్ వినియోగించి, వారి కోసం 12 అద్భుతమైన కళాఖండాలు గీసింది. అవి తనకు ఎంతో సంతృప్తినిచ్చాయని చెప్తోంది సంగీత.

సీబీఎస్​ఈ పాఠ్యపుస్తకాల్లో చోటు..

సంగీత గీసిన చిత్రాలు.. సీబీఎస్​ఈ 9, 10వ తరగతి పాఠ్యపుస్తకాల్లో చోటు దక్కించుకున్నాయి. బాంబే ఆర్ట్ సొసైటీ.. ఏటా ఓ మ్యాగజైన్ విడుదల చేస్తుంది. దేశవ్యాప్తంగా సామాజిక అంశాలపై కళ ద్వారా అవగాహన కల్పించే మేటి కళాఖండాలను ఎంపిక చేసి, ప్రచురిస్తుంది. ఆ మ్యాగజైన్‌లోనూ ఈ ఏడాది సంగీత గీసిన చిత్రాలకు స్థానం దక్కింది. భారత్‌కు తిరిగివచ్చిన తర్వాత.. పూర్తి సమయం కళ కోసమే కేటాయిస్తోంది సంగీత. ఓ కళాఖండం ముందు నిలబడి, ఆంతర్యం ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలం వీక్షకుడికి కలిగేలా గీసినప్పుడే చిత్రకారిణిగా విజయం సాధించినట్లని చెప్తోంది. తన చిత్రాలను ఎన్నో ప్రదర్శనల్లో ప్రదర్శించింది. మరెన్నో పోటీల్లో పాల్గొని, గెలుపొందింది సంగీత.

జాతీయస్థాయిలో బహుమతులు...

ప్రతీ కళాఖండం.. కళాకారుడి మనసుకు, ఆలోచనలకు ప్రతిబింబం అని చెప్తోంది సంగీత. పెయింటింగ్స్‌ని సైతం కంపోజ్ చేయడం ద్వారా తక్కువ సమయంలో గుర్తింపు తెచ్చుకోవచ్చని సూచిస్తోంది. ప్రస్తుత టెక్ యుగంలో.. కంప్యూటర్‌ ద్వారా వేసే డిజిటల్ పెయింటింగ్‌కు ఆదరణ పెరుగుతున్నా.. చేత్తో ఓ చిత్రం గీస్తే వచ్చే సంతృప్తే వేరని చెప్తోంది. జాతీయస్థాయి చిత్రలేఖనం పోటీల్లో రెండేళ్లుగా బహుమతులు సాధిస్తోంది సంగీత. ఈ ఏడాది ప్రథమ బహుమతి గెలుచుకుంది.

ఇదీ చదవండి:

నేడు రాష్ట్రీయ తెలుగు సమాఖ్య వార్షికోత్సవం.. ముఖ్యఅతిథిగా ఉపరాష్ట్రపతి

ABOUT THE AUTHOR

...view details