ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

RESEARCH ON SEED DEVELOPMENT: దిగుబడినిచ్చే వంగడాల ఉత్పత్తి దిశగా యువ శాస్త్రవేత్త పరిశోధనలు - యువ శాస్త్రవేత్త పాపారావు పరిశోధనలు

RESEARCH ON SEED DEVELOPMENT: ఆ కుర్రాడు వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే సాగించాడు. అందరిలా టెక్‌ కొలువు అంటూ వెంపర్లాడకుండా.. తల్లితండ్రులు నమ్ముకున్న వ్యవసాయ రంగం వైపు కదిలాడు. ఆ రంగంలో విప్లవాత్మక మార్పులకు నడుం బిగించాడు. ఐసీఎంఆర్ లో శాస్త్రవేత్తగా ఉద్యోగం సాధించి... తన పరిశోధనలతో ఏపీ అకాడమీ ఆఫ్ సైన్స్ నుంచి యువ శాస్త్రవేత్త అవార్డు సొంతం చేసుకున్నాడు. అతడే...విజయనగరం జిల్లాకు చెందిన పాపారావు.

RESEARCH ON SEED DEVELOPMENT
RESEARCH ON SEED DEVELOPMENT

By

Published : Jan 27, 2022, 8:07 PM IST

RESEARCH ON SEED DEVELOPMENT: పుస్తకాన్ని దీర్ఘంగా పరిశీలిస్తున్న ఈ యువకుడు.. పాపారావు. చదువుతున్న పుస్తకం.. వ్యవసాయ పరిశోధనల గురించి. ఈ వయసు వారు సాఫ్ట్‌వేర్‌ కొలువులంటూ కార్పొరేట్‌ బాట పడుతుంటే.. తను మాత్రం పొలం బాట పట్టాడు. రైతుల కష్టాల్ని దగ్గురుండి చూసిన అనుభవంతో.. వారి ఆదాయం రెట్టింపు చేయాలనే ఉన్నతమైన లక్ష్యంతో నూతన వంగడాల తయారీకి కృషి చేస్తున్నాడు.

పాపారావు స్వస్థలం.. విజయనగరం జిల్లా మక్కువ మండలం చప్పబుచ్చింపేట. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఇతడికి.. పొలం కష్టాలేంటోతెలుసు. ఈ యువకుడి విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే సాగింది. ఉన్నత విద్య ప్రఖ్యాత యూనివర్సిటీల్లో చదవాలనుకున్నాడు. అందుకు అనుగుణంగా కష్టపడి.. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో సీటు దక్కించుకున్నాడు. పీజీలో ప్లాంట్ బయోటెక్నాలజీ కోర్సులో చేరాడు.

తన ప్రతిభతో... ప్రొఫెసర్లతో పాటు వ్యవసాయ రంగ నిపుణుల మన్ననలు పొందాడు పాపారావు. అంతటితో సంతృప్తి చెందక వ్యవసాయ విద్యలో మరింత ప్రావీణ్యం సాధించాలని., పరిశోధనల బాట పట్టాడు. అగ్రికల్చరల్ సైంటిస్టు రిక్రుట్మెంట్ బోర్డు నిర్వహించే జాతీయస్థాయి అర్హత పరీక్షలో మెరుగైన ర్యాంకు సాధించి.. దిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్- ఐసీఎంఆర్ లో సీటు సంపాదించాడు. పరిశోధనల్లో భాగంగా.. ఇండో జపాన్ సంయుక్త బృందంతో కలిసి పని చేసిన పాపారావు.. తన ప్రతిభతో ఐసీఎంఆర్ లోనే శాస్త్రవేత్తగా ఉద్యోగం సాధించాడు. మేటి వ్యవసాయ పరిశోధనలతో ఏపీ అకాడమీ ఆఫ్ సైన్స్ నుంచి యువ శాస్త్రవేత్త అవార్డును సొంతం చేసుకున్నాడు.

గుజరాత్ జునాగఢ్‌లో ఐసీఎంఆర్ శాస్త్రవేత్తగా విధులు నిర్వర్తిస్తున్న ఈ యువతేజం.. అక్కడ ఎక్కువగా పండే.. వేరుశనగ పంటపై పరిశోధనలు చేపట్టాడు. అలాగే.. రాయలసీమ వంటి ప్రాంతాల్లో వర్షాభావం, నీటి ఎద్దడిని తట్టుకుని.. అధిక దిగుబడినిచ్చే వంగడాల ఉత్పత్తి దిశగా పరిశోధనలు చేస్తున్నట్లు పాపారావు చెబుతున్నాడు. పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో సాగు భూమి విస్తీర్ణం రోజురోజుకు కుచించుకు పోతోంది. ఈ క్రమంలో.. అందుబాటులో ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమిలోనే అవసరం మేరకు ఆహార పంటల ఉత్పత్తి సాధించటం శాస్త్రవేత్తల ముందున్న అతిపెద్ద సవాల్‌ అంటున్నాడు..పాపారావు.

వ్యవసాయ పరిశోధన పుస్తక రచనలోనూ పాపారావు పాలుపంచుకుంటున్నాడు. హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం ప్రచురించిన "వాతావరణ మార్పులు-సవాళ్లు-వాటి పరిష్కార మార్గాలు" పుస్తక రచనలో ముఖ్య పాత్ర పోషించి మన్ననలు అందుకుంటున్నాడు. భవిష్యత్‌లో వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలు చాలా ఉంటాయి. వీటిని అందిపుచ్చుకునే దిశగా యువత అడుగులు వేయాలని సూచిస్తున్నాడు... ఈ యువ వ్యవసాయ శాస్త్రవేత్త.

దిగుబడినిచ్చే వంగడాల ఉత్పత్తి దిశగా యువ శాస్త్రవేత్త పాపారావు పరిశోధనలు

ఇదీ చదవండి:ఆరుగాలం శ్రమించి పండిస్తే.. అమ్ముకునే మార్గం లేకపాయే..

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ABOUT THE AUTHOR

...view details