ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా కష్టకాలంలోనూ 15 శాతం వృద్ధి సాధించాం: వీఎస్ఈజెడ్ కమిషనర్

విశాఖ ప్రత్యేక అర్ధిక మండలిలో... లాక్​డౌన్ సడలింపుల తర్వాత కొవిడ్ నిబంధలను పాటిస్తూ పూర్తి స్దాయిలో ఉత్పత్తిని అందుకుంది. ఐటీ రంగాలకు చెందిన పరిశ్రమల్లో దాదాపు 75 శాతం వర్క్‌ ఫ్రంహోం అమలు జరుగుతోంది. ఫార్మా పరిశ్రమల్లో షిఫ్టుల విధానంలో 33 శాతం నుంచి 50 శాతం సిబ్బందితో ఉత్పత్తి చేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలోనే దాదాపు 16500 కోట్ల రూపాయల ఎగుమతులు చేసి ఈ ప్రత్యేక ఆర్ధిక మండలి 15 శాతం వృద్దిని నమోదు చేసి రికార్డు సృష్టించిందని... విశాఖ ప్రత్యేక ఆర్ధిక మండలి అభివృద్ది కమిషనర్ ఆవుల రామ్మోహన్ రెడ్డి ఈటీవీ భారత్​కు వివరించారు.

By

Published : Jun 28, 2020, 6:52 AM IST

కరోనా కష్టకాలంలో 15 శాతం వృద్ధి సాధించాం
కరోనా కష్టకాలంలో 15 శాతం వృద్ధి సాధించాం

ప్రశ్న. లాక్ డౌన్ ఐదు తర్వాత విశాఖ ప్రత్యేక అర్ధిక మండలిలో ఎన్ని సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయి. కొవిడ్ నిబంధనలను ఏ రకంగా అమలు చేస్తున్నారు..?

జవాబు:ఈ ప్రత్యేక ఆర్ధిక మండలి మూడు రాష్ట్రాలలో విస్తరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, ఛత్తీస్​ఘడ్ రాష్ట్రాలలో ఉంది. లాక్ డౌన్ విధించిన మరుసటి రోజు నుంచి 386 యూనిట్లు పని చేస్తున్నాయి. మీరు ఆశ్చర్యపోవచ్చు. 510 యూనిట్లలో 386ఎలా పని చేస్తున్నాయంటే... అందులో 355 యూనిట్లు ఐటీవి. అవన్నీ కూడా వర్క్ ఫ్రం హోం చేస్తున్నాయి. ఈరోజు చూస్తే కూడా లాక్ డౌన్ 5.0 ముగింపుకి చేరుకున్న సమయంలోనూ 501 పని చేస్తున్నాయి. రోస్టర్ పద్ధతిలో మ్యాన్ పవర్ తగ్గించి కొన్ని చోట్ల ఫార్మాలో 50 శాతం కన్నా తక్కువ పెట్టి, కొన్ని చోట్ల 30 శాతం పెట్టి కార్మికులను కంట్రోల్ చేస్తూ యథావిథిగా కార్యక్రమాలను సాగిస్తున్నాము. ఏప్రిల్ ఒకటి నుంచి జూన్ 23 వరకు ఎగుమతులు చూస్తే.. 16,897 కోట్లు... కిందటి ఏడాది కంటే 15 శాతం అధిక వృద్ధిని సాధించాం. దేశంలో ఏ ప్రత్యేక ఆర్ధిక మండలి ఇంత అభివృద్ది రేటును సాధించలేదన్నది కచ్చితంగా చెప్పగలను. లాక్​​డౌన్ ప్రభావం కొంత పడి ఉండొచ్చు కాని15 శాతం వృద్ధిని నమోదు చేయడం సామాన్యం కాదు.

ప్రశ్న: ఈ వృద్ది ఎలా సాధ్యమైంది..?

జవాబు: లాక్​డౌన్ మొత్తం మేం కార్యాలయంలోనే ఉండి కొత్త మందుల తయారీకి ప్రతిపాదనలు ఇస్తే వెంటనే ఆన్​లైన్​లో మంజూరు చేసేవాళ్లం. వీడియో కాన్ఫరెన్స్​ల ద్వారా సందేహాలను నివృత్తి చేసేవాళ్లం. ఎవరికీ సమస్య లేకుండా చేశాం. బ్రాండిక్స్ అప్పెరల్స్ తయారీ సంస్ధ, వాళ్ల ఉత్పత్తులు అమెరికాకు పోలేవు. ఫాల్స్ ఫ్లష్ అని కాకినాడలో ఉంది. వారు బొమ్మలు తయారు చేస్తారు. అవి అమెరికాకు వెళ్లాలి. ఈసమయంలో రవాణా చేయలేరుకదా!. ఆ సమయంలో వారు ఫేస్ మాస్కులు తయారీకి మమ్మల్ని అనుమతి అడిగారు. ఆన్​లైన్​లోనే 12 యూనిట్లలో మూడు కోట్లకు పైగా ఫేస్ మాస్క్ లు తయారీకీ అనుమతించాం. 90 లక్షలకు పైగా పీపీఈ కిట్లు తయారీకి అనుమతించాం. హైడ్రాక్సీ క్లోరో క్విన్, రెమిడీసివర్ సహా కొత్త డ్రగ్స్ ఏవైతే డీజీసీఐ అనుమతి ఇచ్చారో వాటన్నింటిని వెంటనే క్లియర్ చేశాం. రవాణా సమయంలో ఏమైనా సమస్యలు వస్తే సంబంధిత విభాగాలతో మాట్లాడి వెంటనే క్లియర్ చేయడం వల్లనే ఈ వృద్ధి సాధ్యపడిందని భావిస్తున్నా.

ప్రశ్న: కొత్త డ్రగ్​లు ఎన్నింటికి ఎస్ఈజెడ్​లో తయారీకి అనుమతించారు..?

జవాబు: ఎపీ యూనిట్ అప్రూవల్ కమిటీ మీటింగ్​లో ఐదు కంపెనీలకు ఈ కొత్త డ్రగ్​ల తయారీకి అనుమతించాం. పైడి భీమవరంలో రెడ్డి లాబ్స్ రెమిడీసివర్, నక్కపల్లి హెటీరో లాబ్స్ వాళ్లు కూడా ఇదే డ్రగ్ కోసం అనుమతి అడిగారు. మైలాన్ వారు అడిగారు. దివీస్ వాళ్లు అడిగారు. కొందరు హైడ్రాక్సీ క్లోరోక్విన్ అడిగారు. కొంతమంది రెమిడీసీవర్ అడిగారు. కరోనాకి సంబంధించి వైద్యానికి అవసరమవుతాయని డ్రగ్ కంట్రోలర్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకుని వస్తే వెంటనే ఉత్పత్తికి అనుమతించాం.

ప్రశ్న: పెండింగ్ ఏమైనా ఉన్నాయా..?

జవాబు: మా దగ్గర ఏ పెండెన్సీ లేదు.

ప్రశ్న: ఫేస్ షీల్డ్స్ తయారీకి అనుమతించారు కదా..? ఇది ఏరకంగా ఉపయోగం...?

జవాబు: సినర్సీజ్ అనే సంస్ధ వందశాతం ఎక్స్​పోర్ట్ ఓరియెంటెడ్ యూనిట్. వీఎస్ఈజెడ్ ప్రాంగణంలోనే ఉంది. వారి వద్ద దాదాపు 1500 మంది కార్మికులు ఉన్నారు. వీరు జనరల్ మోటర్స్​కి ఎల్లాయ్ వీల్స్ తయారు చేసేవారు. ఎగుమతులు ఆగిపోయాయి. వాహన రంగం బాగా దెబ్బతినడంతో 15 శాతం మాత్రమే ఈ ఉత్పత్తి జరుగుతోంది. వారు ప్రత్యామ్నాయ ఉత్పత్తికి అనుమతి కొరారు. ఫేస్ షీల్డ్​ను నాణ్యమైన విధంగా తయారు చేశారు. పాలికార్బోనేట్ షీట్​తో తయారుచేశారు. శానిటైజ్ చేసి మళ్లీమళ్లీ వినియోగించుకోవచ్చు. ప్రధానంగా కరోనా బాధితులకు వైద్యం చేసే వైద్య సిబ్బంది, నర్సింగ్ సిబ్బందికి బాగా ఉపయుక్తం. 60 లక్షల ఫేస్ షీల్డ్స్ తయారీకి అనుమతిచ్చాము. మాస్క్​లు కూడా మూడు లక్షల తయారీకి అనుమతించాం. వారింకా చాలా పరికరాలు చేయాలని అంటున్నారు. వాటి ప్రతిపాదనలు రాగానే అనుమతి ఇస్తాం. టన్నల్ శానిటైజర్లు, యువీ బాక్స్​ల తయారీ, అటో శానిటైజర్ డిస్పెన్సర్లు, లిక్విడ్ వంటి వాటికి కూడా అనుమతి కొరితే ఇస్తాం.

ప్రశ్న: ఉన్న యూనిట్లు కొత్త ఉత్పత్తులు చేయాలంటే ఏ నిబంధనలు పాటిస్తారు..?

జవాబు: ఎస్ఈజెడ్​లో వాళ్లు చేస్తున్న పని, ఉత్పత్తి ద్వారా భారతదేశానికి విదేశీ మారక ద్రవ్యం రావాలి. వాటికి సంబంధిత ప్రతిపాదనలు పరిశీలించి అనుమతులు ఇస్తున్నాం.

ప్రశ్న: కార్మికులను 33 శాతంతో పని చేయాలన్న నిబంధన ఉంది కదా. ఇది ఆర్ధిక మండలి యూనిట్లపై ఎటువంటి ప్రభావం చూపుతోంది..?

జవాబు: ప్రత్యేక అర్ధిక మండలిలో ఎటువంటి సమస్య లేదు. ఉన్న కార్మికులను మూడు షిప్టులలో సర్దుతున్నారు. ఫార్మాలో 50 శాతానికి పైగానే ఒక షిప్టులో పని చేస్తున్నారు. డిస్టెన్సింగ్ పాటిస్తే 50 శాతానికి మించి కూడా కార్మికులను అనుమతిస్తున్నారు. వీఎస్ఈజెడ్​లో 2,87,000 మంది ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తున్నారు. 3,83,000 మంది మొత్తం ఉద్యోగులు ఉన్నారు. 90 వేల మంది యూనిట్లలో ఉన్నారు. వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు కూడా పూర్తి స్ధాయిలో కొవిడ్-19 నిబంధలను పాటిస్తున్నారు. మా యూనిట్లలో ఎక్కడా కరోనా సీరియస్ కేసులు నమోదు కాకపోవడం ఒక మంచి పరిణామం.

ప్రశ్: కొవిడ్-19 నిబంధనల అమలు ఏ తీరుగా ఉంది..?

జవాబు: ప్రతి యూనిట్​లోనూ కస్టమ్స్ అధికార్ల బృందం ఉంది. ప్రతిరోజూ కార్మికుల హాజరు, శానిటైజేషన్ ప్రక్రియలను పరిశీలిస్తారు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా మంత్రిత్వ శాఖకు పంపుతున్నాం. ప్రతినిత్యం రిపోర్టులు ఇస్తున్నాం.

ప్రశ్న: లాక్​డౌన్ 6.0కు వెళ్లే ఆలోచనలో ప్రభుత్వాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈదశలో కొత్త యూనిట్లకు అనుమతిస్తారా..?

జవాబు:ఎస్ఈజెడ్​లో కొత్త ప్రతిపాదనలు లేవు. ఎక్స్​పోర్టు ప్రాసెసింగ్ జోన్​లో మాత్రం మూడు యూనిట్లకు ప్రతిపాదనలు వచ్చాయి. వాటికి అనుమతించాం.

ప్రశ్న: హైడ్రాక్సీ క్లోరో క్విన్ ఏయే దేశాలకు పంపారు..?

జవాబు: కోటి టాబ్లెట్​లు అత్యుతాపురంలోని లారెల్స్ ల్యాబ్​లో తయారయ్యాయి. ఇవి అమెరికా, సౌతాఫ్రికా, యూరోపియన్ దేశాలకు పంపారు. మందులన్నీ విమానాల ద్వారా వెళ్లాయి. బల్క్ డ్రగ్ నిల్వలు తగినన్ని ఉన్నాయి. ఇంకా టాబ్లెట్​లు చెయ్యడానికి సరిపడా ముడి పదార్దాలు ఉన్నాయి. డిమాండ్​ను బట్టి ఉత్పత్తి చేస్తారు.

ప్రశ్న: రానున్న 2020-21 ఆర్ధిక సంవత్సరంలో ఎంత వృద్ధిని ఆశిస్తున్నారు..?

జవాబు: లాక్​డౌన్ సమయంలోనే 15 శాతం వృద్ధిని నమోదు చేయగలిగాం. 2020-21 మొత్తం ఆర్ధిక సంవత్సరానికి 20 శాతం వరకు వృద్ధి ఉంటుందని అంచనావేస్తున్నాం.

ABOUT THE AUTHOR

...view details