విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించి శనివారానికి రెండేళ్లు పూర్తయింది. కానీ దాన్ని సాకారం చేసేందుకు నిధుల కేటాయింపులో గానీ, పనుల్లో గానీ అంగుళం కూడా పురోగతి లేదు. విశాఖ రైల్వేజోన్ని విభజన చట్టంలో కేంద్రం పొందుపరిచింది. 2019 ఫిబ్రవరి 27న రైల్వేజోన్పై ప్రకటన చేసింది. అక్కడితో సరి! దాన్ని పక్కన పడేసింది. కేంద్రం గట్టిగా తలచుకుంటే ఐదారు నెలల్లోనే జోన్ సాకారమయ్యేది.
11 నెలల్లోనే విశాఖ రైల్వేజోన్ ఏర్పాటవుతుందని 2019 మార్చి 8న వెల్లడించిన రైల్వేమంత్రి పీయూష్ గోయల్.. డీపీఆర్ ఇంకా రైల్వేబోర్డు పరిశీలనలోనే ఉందని ఇప్పుడు చెబుతున్నారు. రైల్వేజోన్ ఏర్పాటుకు నిర్దిష్ట కాలావధి ఏమీ లేదనీ అంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, విభజన చట్టంలోని అంశాలు, హామీల అమలుపై కేంద్రప్రభుత్వ వైఖరికి... ఈ విషయంలో జరుగుతున్న తాత్సారమే నిదర్శనం. గత రెండు కేంద్ర బడ్జెట్లలో విశాఖ రైల్వేజోన్కు కేటాయించిన నిధులు చూస్తుంటే.. మరో ఐదారేళ్లయినా విశాఖ రైల్వేజోన్ ఏర్పాటవుతుందా అన్న సందేహం కలుగుతోంది.
రాష్ట్ర ప్రజల మనోభావాలు పట్టవా?
విశాఖ రైల్వేజోన్ ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల డిమాండ్. 2003లో భువనేశ్వర్ కేంద్రంగా తూర్పుకోస్తా రైల్వేజోన్ ఏర్పాటైనప్పటి నుంచి ఉద్యోగాలు, కొత్త రైళ్ల కేటాయింపు, మౌలిక వసతుల అభివృద్ధిలో ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతూనే ఉంది. అప్పటినుంచి విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ కోసం ఉత్తరాంధ్ర ప్రజలు గళమెత్తుతూనే ఉన్నారు. ఎట్టకేలకు కేంద్రం విభజన చట్టంలో విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటుకు హామీ ఇచ్చింది.
తీరా జోన్పై అధికారిక ప్రకటన చేసేటప్పుడు... వాల్తేరు రైల్వే డివిజన్ను రద్దుచేసి, దాన్ని విజయవాడ డివిజన్లో కలిపేస్తున్నట్టు చెప్పింది. దానికి బదులు ఒడిశాలోని రాయగఢ్ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. అంటే ఒక చేత్తో రైల్వేజోన్ ఇస్తూ... మరో చేత్తో కొన్ని దశాబ్దాలుగా ఉన్న డివిజన్ను తీసేస్తుందన్న మాట! దానిపైనా ప్రజల్లో నిరసన పెల్లుబికింది. వాల్తేరు డివిజన్తో కూడిన రైల్వేజోన్ కావాలన్న డిమాండ్ స్థానిక ప్రజల నుంచి వ్యక్తమవుతోంది.
కానీ దాన్ని కేంద్రం పట్టించుకున్న దాఖలాల్లేవు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటుకు అవసరమైన భవనాల నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధికి రూ.200 కోట్లు ఖర్చవుతుందని అంచనా. 2020-21 కేంద్ర బడ్జెట్లో దీనికి కేటాయించింది రూ.3 కోట్లు. దాన్ని కూడా రాయగఢ్ డివిజన్ పనులకు వినియోగించారు. ఇక 2021-22 బడ్జెట్లో కేటాయించింది రూ.40 లక్షలే! రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, మనోభావాలపై కేంద్రప్రభుత్వ తీరు ఎలా ఉందో ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?
ఇంకెన్నాళ్లీ అన్యాయం?
* ప్రస్తుతం విశాఖ జిల్లాలోని తాడి వరకు దక్షిణ మధ్యరైల్వే పరిధిలో, ఆ తర్వాతి నుంచి తూర్పుకోస్తా రైల్వే పరిధిలో ఉంది. విశాఖ కేంద్రంగా ప్రత్యేక జోన్ ఏర్పాటైతే, శ్రీకాకుళం జిల్లాలో కుర్దా డివిజన్ పరిధిలో ఉన్న కొద్దిభాగం తప్ప... ఉత్తరాంధ్రలోని మిగతా ప్రాంతమంతా విశాఖ రైల్వేజోన్ పరిధిలోకి వస్తుంది.
* అటు హైదరాబాద్, ఇటు బెంగళూరు వెళ్లాలంటే ప్రస్తుతం విశాఖ నుంచి రైల్లో రిజర్వేషన్ దొరకడం కష్టం. మొదట్లో విశాఖ నుంచే నడిచిన విశాఖ ఎక్స్ప్రెస్, ప్రశాంతి, విశాఖ-చెన్నై వీక్లీ రైళ్లను చాన్నాళ్ల క్రితమే భువనేశ్వర్ వరకు పొడిగించారు. విజయవాడ-విశాఖ మధ్య నడిచే ప్యాసింజర్ను రాయగఢ్ వరకు పొడిగించారు. విశాఖ నుంచే రైళ్లే ప్రారంభమైతే మనకు కలిగే ప్రయోజనాల్ని కోల్పోవలసి వస్తోంది.