బంగాళాఖాతంలో అరుదుగా ఉన్న ఆలివ్ రిడ్లే తాబేళ్ల పరిరక్షణకై.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం కట్టాయి. అందులో భాగంగానే తాబేళ్ల ప్రత్యుత్పత్తి సమయంలో వాటిని పరిరక్షించి తాబేలు పిల్లలను సురక్షితంగా విశాఖ సముద్రంలో వదిలి పెడుతున్నారు. సాధారణంగా ఒడ్డున గుడ్లను పొదిగిన తాబేళ్లు తిరిగి సముద్రంలోకి వెళ్లిపోతాయి. కానీ తాబేలు పిల్లలు సముద్రంలోకి వెళ్లేటప్పుడు.. పక్షులు, ఇతర జీవుల నుంచి వాటి ప్రాణాలకు ముప్పు కలుగుతుంది. అందుకే వాటిని పరిరక్షించే బాధ్యతను స్వచ్ఛంద సంస్థలు, అటవీశాఖ తీసుకున్నాయి. అలా పరిరక్షించిన తాబేళ్లను సముద్రంలోకి విడిచిపెడతారు.
విశాఖ సాగర తీరంలో పరిరక్షించిన తాబేళ్ల పిల్లలను అటవీ శాఖ అధికారులు సముద్రంలోకి విడిచిపెట్టారు. వందలాది ఆలివ్ రిడ్లే తాబేళ్లను సాగర జలాల్లోకి వదిలారు. తీర ప్రాంతాల్లో సముద్ర తాబేళ్ల గుడ్లను సంరక్షిస్తున్న అటవీ శాఖ.. పిల్లలను సాగరంలోకి విడిచిపెడుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. రాష్ట్ర అటవీశాఖ ముఖ్య పర్యవేక్షకులు ప్రతీప్ కుమార్ పాల్గొని... తాబేలు పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టారు. దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న తీరప్రాంతాల్లో ఈ ప్రక్రియను చేసినట్లైతే.. తాబేళ్లను కాపాడినవారవుతామని తెలిపారు.