విశాఖ మన్యం, అరకులోయకు కార్తిక మాసంలో పర్యటకుల రద్దీ దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ తగిన ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక ప్యాకేజీలతో వినూత్న విధానానికి నాంది పలికింది. ఆధ్యాత్మిక, విహార యాత్రలకు బస్సులను సిద్ధం చేసి ప్రయాణికులకు అందుబాటు ధరలో ఉండేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు.
ఎక్కడ నుంచి ఎక్కడికి?
విశాఖ నుంచి మంచు అందాలు చూసే లంబసింగి ప్యాకేజీలో శనివారం, ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు బయలుదేరి ఉదయం నాలుగు గంటలకు లంబసింగి చేరేలా ఒక ప్యాకేజి సిద్ధం చేశారు. టికెట్ ధర పెద్దలకు రూ.525, పిల్లలకు రూ.400గా నిర్ణయించారు. పంచారామాలు అమరావతి, ద్రాక్షారామం, సామర్లకోట, పాలకొల్లు, భీమవరంలకు ప్రత్యేక బస్సులు కేటాయించారు. ఈ బస్సులు ప్రతి ఆదివారం సాయంత్రం విశాఖ నుంచి బయలుదేరి అన్ని ప్రదేశాలను దర్శించి సోమవారం సాయంత్రానికి విశాఖ చేరుకునేలా ప్రణాళిక వేసినట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ దానం తెలిపారు. నాలుగు వారాలకు కలిపి సుమారు 100 బస్సులను సిద్ధం చేసినట్లు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.