రాజధాని ప్రకటన తర్వాత ఊహించని విధంగా విశాఖలో భూముల విలువ పెరిగిపోయింది. ఈ క్రమంలో కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. భవిష్యత్తులో వీఎంఆర్డీఏకు చెందిన భూముల ఆక్రమణకు గురికాకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విలువైన భూములన్నీ శివారు ప్రాంతాల్లో ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజానాన్ని వినియోగించనున్నారు. ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా మార్పులను సులభంగా గుర్తించేలా జీఐఎస్ (భౌగోళిక సమాచార విధానం)ను ఉపయోగించుకోనున్నారు. ఇప్పటికే వీఎంఆర్డీఏ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి సర్వే ప్రారంభించారు. కొన్నేళ్ల కిందట వీఎంఆర్డీఏకు ప్రభుత్వం పదివేలకుపైగా ఎకరాలు అప్పగించింది. వాటిల్లో చాలా వరకు వినియోగించుకోగా మూడు వేల ఎకరాలు ఖాళీగా ఉంది. వీటిలో ఎక్కువాగు మధురవాడ, శొంఠ్యాం, కాపులుప్పాడ, చిట్టివలస, కొమ్మాది, ఆనందపురం, గిడిజాల, యారాడ తదితర ప్రాంతాల్లో ఉన్నాయి.
ఏ మార్పు జరిగినా గుర్తించేలా!
వీఎంఆర్డీఏ పరిధిలోని భూములకు మొదట సర్వే నిర్వహించి జీపీఎస్ ట్రాకింగ్ తీసుకొని మండల సర్వేయర్ ఆమోదంతో వివరాలు వెబ్ల్యాండ్లో ఉంచనున్నారు. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో తమ భూమి ఎక్కడ ఎంతవరకు ఉందో సులభంగా గుర్తించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా భౌతికంగా గుర్తించేందుకు వీలుగా ప్రత్యేక హద్దు రాళ్లు ఏర్పాటు చేయించనున్నారు. మూడు అడుగుల కింద పైన నాలుగు అడుగులు కనిపించేలా వీటిని ఏర్పాటు చేయనున్నారు. వీటికి సంబంధించిన టెండర్లు ఇప్పటికే పిలిచారు.