ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 12, 2020, 11:01 AM IST

ETV Bharat / state

స్పీడ్ తగ్గించండి.. లేకుంటే 'ఎఫ్ఐఆర్' పడుద్ది!

విశాఖ నగర పోలీసు కమిషనరేట్‌కు ప్రధాన సవాలుగా మారిన రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు మరో ఆలోచన చేశారు. కేవలం అపరాధ రుసుం వసూలు చేసి వదిలేయకుండా.. వారిపై ఎఫ్‌.ఐ.ఆర్‌.లు కూడా నమోదు చేసే ప్రక్రియను కూడా ప్రారంభించారు. ఎన్నిసార్లు చెప్పినా మారకపోవడంతో.. ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Police_On_Bike_Rash_Rides
Police_On_Bike_Rash_Rides

విశాఖ నగరంలో లక్షలాదిగా ఉన్న వాహనదారుల్లో ఎందరో పెద్దఎత్తున ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇష్టారాజ్యంగా వాహనాన్ని నడుపుతూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపేవారిని, రేసింగ్‌లకు పాల్పడేవారిని, మైనర్‌ డ్రైవర్లను, వారి తల్లిదండ్రులను పోలీసు కమిషనరేట్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ చేస్తున్నా.. అపరాధరుసుం వసూలు చేస్తున్నా.. కొందరిని జైళ్లకు పంపుతున్నా.. అత్యధికుల్లో మార్పు రావడంలేదు. ఇకపై కొన్నాళ్లపాటు తీవ్రమైన వాహన ఉల్లంఘనలను పాల్పడేవారిపై నేరుగా ఎఫ్‌ఐఆర్‌ల నమోదుకు నిర్ణయించారు. ఇలాంటి కేసుల్లో తీర్పులు కూడా చాలా వేగంగానే వచ్చే అవకాశం ఉంది.

ట్రాఫిక్‌ నిబంధనలు మీరితే ఇక్కట్లే.. జైలు శిక్షకు అవకాశం

వాహనాలు కూడా పోలీసుల ఆధీనంలోనే..

ఎఫ్‌.ఐ.ఆర్‌. దాఖలు చేస్తే వాహనదారుల వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. కొన్ని రోజులపాటు అది పోలీసుస్టేషన్లోనే ఉంటుంది. కేసు పురోగతిని బట్టి విడుదల చేసే అంశంపై పోలీసులు నిర్ణయం తీసుకుంటారు. కొన్నిరోజులపాటు వాహనం అందుబాటులో లేకపోతే తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న ఉద్దేశంతోనైనా పలువురు వాహనం నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటారని పోలీసులు భావిస్తున్నారు.

పోలీసులకు భారమే అయినా....

ట్రాఫిక్‌ ఉల్లంఘనదారులపై విధించే అపరాధరుసుంలు ఎక్కువగానే ఉంటున్నాయి. చాలా మంది వాహనదారులు ఆయా రుసుంలు చెల్లించేసి ...మళ్లీ అదే పంథా అనుసరిస్తున్నారు. అపరాధరుసుంకు వెరవకుండా తమకు నచ్చినట్లు అంతులేని వేగంతో, అత్యంత ప్రమాదకరంగా వాహనాలను నడుపుతున్నారు. ఎఫ్‌.ఐ.ఆర్‌. దాఖలు చేస్తే పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేయాలి. కొన్ని సాక్ష్యాల్ని కూడా సేకరించాలి. అందుకోసం విస్తృత కసరత్తుతోపాటు ప్రతి కేసుకూ పోలీసులు చాలా సమయం వెచ్చించాల్సి ఉంటుంది. వాస్తవానికి ఎఫ్‌.ఐ.ఆర్‌.నమోదు చేసే విధానంతో పోలీసులపై పని ఒత్తిడి గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నప్పటికీ వాహనదారుల్లో మార్పు తీసుకురావడానికి అంతకు మించిన ప్రత్యామ్నాయం లేదని భావిస్తున్నారు.

ఇప్పటికే 250 మందిపై కేసులు..

ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన సుమారు 250 మంది వాహనదారులపై ఇప్పటికే కేసులు నమోదు చేశారు. వారి వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

ట్రాఫిక్‌ నిబంధనలపై చైతన్యం

నగరంలో ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించేవారి నుంచి కొన్ని రోజులుగా అపరాధ రుసుం వసూలు చేయడం లేదు. ఈ రుసుంలు భారీగా పెరిగిన నేపథ్యంలో వాహనదారులను అప్రమత్తం చేసే కార్యక్రమాలను కూడా ట్రాఫిక్‌ పోలీసులు ప్రారంభించారు. తప్పిదాలకు భారీ ముల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. చైతన్య కార్యక్రమాలు పూర్తైన అనంతరం జనవరి నెల నుంచి ట్రాఫిక్‌ ఉల్లంఘనదారులపై భారీగా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.

నిబంధనలు ఉల్లంఘిస్తే శిక్ష తప్పదు

నగరంలో కొందరు వాహనదారులు అత్యంత ప్రమాదకరంగా వాహనాల్ని నడుపుతున్నారు. ఫలితంగా ఇతరుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయి. అత్యంత నిర్లక్ష్యంగా, మితిమీరిన వేగంతో నడిపేవారిపై ఎఫ్‌.ఐ.ఆర్‌.దాఖలు చేసే ప్రక్రియ ప్రారంభించాం. కేసు తీవ్రతను బట్టి జైలు శిక్ష కూడా ఉంటుందని గుర్తుంచుకోవాలి. - ఐశ్వర్య రస్తోగి, డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌, విశాఖ సిటీ

ఇదీ చదవండి:

2022 చివరిలోగా 2.69 లక్షల టిడ్కో ఇళ్లు : సీఎం జగన్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details