ఆంధ్రప్రదేశ్

andhra pradesh

vmrda master plan: బృహత్తర గండం.. చక్రబంధంలో భీమిలి-భోగాపురం

By

Published : Jul 23, 2021, 5:38 AM IST

జలవనరులు, గ్రామాల మీదుగా విశాఖ అభివృద్ధి సంస్థ రూపొందించిన రోడ్ల ప్రతిపాదన స్థానికుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. వేల ప్లాట్లను కోల్పోనున్నామనే ఆవేదన యజమానుల్లో వ్యక్తమవుతోంది. విశాఖ, విజయనగరం జిల్లాల పరిధిలో రాబోయే 20 ఏళ్లకు ఈ అభివృద్ధి ప్రణాళిక ముసాయిదా సిద్ధం చేశారు. అయితే... భీమిలి, భోగాపురం మండలాల్లో ప్రతిపాదించిన రహదారులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు మండలాలు విశాఖ, విజయనగరం జిల్లాల్లో పక్కపక్కనే ఉన్నాయి. ఇక్కడ చాలా గ్రామాలు, చెరువులు, సాగు భూములు, అనుమతిచ్చిన లేఅవుట్ల మీదుగా రహదారులను ప్రతిపాదించడంపై విస్మయం వ్యక్తమవుతోంది.

people suffering with vmrda plan
people suffering with vmrda plan

విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) రూపొందించిన ‘బృహత్తర ప్రణాళిక (మాస్టర్‌ ప్లాన్‌)-2041’ స్థానికుల్లో కలవరం సృష్టిస్తోంది. తమ ఊళ్లు ఉంటాయో.. పోతాయో, తాము ప్లాట్లు కొన్న లే అవుట్లు అలాగే ఉంటాయా.. వాటిమీదుగా రోడ్లు, వంతెనలు వస్తాయా అన్న ఆందోళన ఈ ప్రాంత ప్రజల్లో వ్యక్తమవుతోంది. విశాఖ, విజయనగరం జిల్లాల పరిధిలో రాబోయే 20 ఏళ్లకు ఈ అభివృద్ధి ప్రణాళిక ముసాయిదా సిద్ధం చేశారు. అయితే... భీమిలి, భోగాపురం మండలాల్లో ప్రతిపాదించిన రహదారులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు మండలాలు విశాఖ, విజయనగరం జిల్లాల్లో పక్కపక్కనే ఉన్నాయి. ఇక్కడ చాలా గ్రామాలు, చెరువులు, సాగు భూములు, అనుమతిచ్చిన లేఅవుట్ల మీదుగా రహదారులను ప్రతిపాదించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఫలితంగా వేలమంది నష్టపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఈ నెల 31లోగా అభ్యంతరాలు తెలియజేయవచ్చని చెప్పడంతో ఇప్పటికే పలువురు తమ ఆవేదన తెలియజేశారు.

ఇంకా చాలామందికి పూర్తిగా విషయం తెలియక ముందుకు రావడం లేదు. ఈ ముసాయిదా ఆమోదం పొందితే... ఆ ప్రాంతాలు మాస్టర్‌ప్లాన్‌లో ఉండటం వల్ల కొనుగోలుదారులు ఆసక్తి చూపరు. బ్యాంకులో తాకట్టుపెట్టి రుణం తీసుకోవడమూ కష్టమే. అసలు పరిహారం అంశాన్ని ముసాయిదాలో ప్రస్తావించకపోవడంతో.. ఒకవేళ తాము భూములు, ఇళ్లు కోల్పోవాల్సి వస్తే తమ పరిస్థితేంటన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

గ్రామాలకు.. గ్రామాలే మాయం..

విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో 45 గ్రామాలు ఉన్నాయి. వీఎంఆర్‌డీఏ నూతన ప్రణాళికతో సగానికిపైగా గ్రామాలు ప్రభావితం అవుతాయి. ఈ మండలంలో ప్రతి ఒకటి, ఒకటిన్నర కిలోమీటర్ల దూరానికి వంద, రెండొందల అడుగుల రోడ్డును ప్రతిపాదించారు. దీంతో చాలా గ్రామాల్లోని ఇళ్లకు నష్టం కలగనుంది. కొన్ని చిన్న గ్రామాలను పూర్తిగా ఖాళీచేయాల్సి వస్తుంది. భీమిలి మండలంలో నిడిగట్టు, కాపులుప్పాడ, తాళ్లవలస, సంగివలస, చిట్టివలస; భోగాపురం మండలంలో నాతవలస, యాతపేట, అక్కివరం, చాకివలస, ముంజేరు, దళ్లిపేట,గూడెపువలస, గంగువానిపాలెం, సబ్బన్నపేట, జగ్గయపేట, భోగాపురం తూర్పు, పడమర వైపు, సవిరవిల్లి, రాజపులోవ, పోలుపల్లి, అమనాంతో పాటు చాలా గ్రామాల మీదుగా రహదారులను ప్రతిపాదించారు.

చెరువుల మీదుగా..

భోగాపురం మండలంలో ప్రతిపాదించిన రహదారులు చాలాచోట్ల చెరువులు, గెడ్డలు, వాగుల మీదుగా వెళ్తున్నాయి. దీంతో అధిక సంఖ్యలో జలవనరులు దెబ్బతినే ప్రమాదం ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చెరువుల్లో నిర్మాణాలు చేపట్టకూడదు. అయినా రహదారులను ప్రతిపాదించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ మండలంలో సబ్బన్నపేటలో రెండు చెరువులు, రామచంద్రాపురంలో ఒకటి, భోగాపురం వద్ద మూడు చెరువుల మీదుగా రోడ్లు ప్రతిపాదించారు. విశాఖపట్నం-విజయనగరం జిల్లాల నడుమ గోస్తనీ నది సముద్రంలో కలిసే లోపున్న దాదాపు ఎనిమిది కి.మీ. దూరంలో పది రోడ్లు వెళ్లేలా ప్రతిపాదించారు! అక్కివరం వద్ద బుగద బంద, మునగపేట, గూడెపువలస, కవులవాడ చెరువులు ప్రభావం కానున్నాయి. పాతపాలెం చెరువు మీద నాలుగు రోడ్లు, చిట్టివలస వద్ద నది మీదుగా 200 అడుగుల రోడ్డును ప్రతిపాదించారు. ఈ రోడ్లన్నీ పెద్దవే కావడంతో ఆయా జలవనరులు దెబ్బతినే అవకాశం కనిపిస్తోంది.

వేల ప్లాట్లకు నష్టం..

భోగాపురం మండలంలో ప్రతిపాదిత రోడ్ల వల్ల వీఎంఆర్‌డీఏ అనుమతించిన ప్రతి లేఅవుట్‌ ప్రభావితం అవుతోంది. ఈ మండలంలోనే ఐదువేల ఎకరాల్లో సుమారు 200 లేఅవుట్లు ఉన్నాయి. ఒక్కో లేఅవుట్‌ను 5-50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేసి ప్లాట్లు అభివృద్ధి చేశారు. వీటన్నింటిలో సుమారు 60 వేల ప్లాట్లు ఉంటే, రోడ్ల వల్ల 30 వేలకుపైగా ప్లాట్లు పోతాయి. కొన్ని లేఅవుట్ల లోపల నుంచి మూడు, నాలుగు రోడ్లు వెళ్తున్నాయి. రాజపులోవ కూడలి నుంచి నాతవలస టోల్‌గేట్‌ వరకు జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న లేఅవుట్లన్నీ ప్రభావితం అవుతాయి.

మూడో ప్రణాళిక ఇలా...

విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) గతంలో వుడా (విశాఖ నగరాభివృద్ధి సంస్థ)గా ఉండేది. ఇప్పటివరకు రెండు మాస్టర్‌ప్లాన్లు (బృహత్తర ప్రణాళిక) అమలు చేశారు. ఒకటి 1989 నుంచి 2001 వరకూ, రెండోది 2006 నుంచి 2021 వరకూ. 2021 నుంచి 2041 వరకూ మూడోది అమలు చేయాలన్నది ప్రస్తుత ప్రణాళిక. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని... ఆయా ప్రాంతాలను ఎలా అభివృద్ధి చేయాలన్న కార్యాచరణ దీనిలో పేర్కొన్నారు.

మొదటి రెండు ప్రణాళికల్లో వీఎంఆర్‌డీఏ పరిధి 1,721 చదరపు కిలోమీటర్లకే పరిమితం కాగా.. ప్రస్తుతం 4,873.38 చ.కి.మీ.లకు పెరిగింది. ఇందులో విశాఖ, విజయనగరం జిల్లాలకు చెందిన 35 మండలాలు ఉన్నాయి. విశాఖ, విజయనగరం కార్పొరేషన్లు, ఒక మున్సిపాల్టీ (ఎలమంచిలి), ఒక నగర పంచాయతీ (నెల్లిమర్ల) దీని పరిధిలో చేరాయి.

అన్ని ఇళ్లకూ ముప్పే

విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో ధనాలపేట చిన్న గ్రామం. జాతీయ రహదారికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సుమారు 50 కుటుంబాలున్న ఈ ఊరు మీదుగా మాస్టర్‌ప్లాన్‌ రోడ్డు ప్రతిపాదించారు. ఫలితంగా దాదాపు అన్ని ఇళ్లూ కోల్పోయే పరిస్థితికనిపిస్తోంది. దీంతో గ్రామాన్నే ఖాళీ చేయాల్సి రావొచ్చు.

ఒక చెరువు...రెండు రోడ్లు

విజయనగరం జిల్లా భోగాపురంలోని కొమ్ముగొల్లపేట గ్రామానికి ఆనుకొని రాయి చెరువు ఉంది. వీఎంఆర్‌డీఏ రూపొందించిన ప్రణాళికలో రెండు రోడ్లు దీని మీదుగా వెళ్తున్నాయి. ఈ చెరువు దాదాపు 1200 ఎకరాల్లో ఉంది. దీని కింద దాదాపు రెండు వేల ఎకరాల ఆయకట్టు ఉంది.

ఇదీ చదవండి:YSR kapunestham: కాపు నేస్తం నిధులు విడుదల.. లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.490.86 కోట్లు

ABOUT THE AUTHOR

...view details