ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చాలా మంది ప్లాస్మా కావాలని పోస్టులు పెడుతున్నారు. ప్రాథమిక దశలో ప్లాస్మా థెరపీ మంచి ఫలితాలిస్తుందని పలువురు వైద్యులు సిఫార్సు చేయడంతో దీనికి తీవ్రమైన డిమాండు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాలో పలువురు కొవిడ్ బాధిత కుటుంబ సభ్యులు వైద్యుల లేఖలతో నగరంలోని రక్తం నిల్వ కేంద్రాలను సంప్రదిస్తున్నా నిల్వలు ఉండటం లేదు. నిత్యం సుమారు వంద మంది ప్లాస్మా కావాలని అడుగుతున్నట్లు సమాచారం. కనీసం పది యూనిట్లు కూడా అందుబాటులో లేని పరిస్థితి. ఒక్క ఎన్టీఆర్ రక్త నిధికే రోజుకు 30 మంది వరకు వస్తున్నారు. ఈ కేంద్రంలో ఏప్రిల్ నెలలో ఏడు, మేలో ఇప్పటి వరకు అయిదు యూనిట్లే సిద్ధం చేశారంటే కొరత ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్ఛు అవగాహన లేక చాలా మంది ప్లాస్మా దానం చేసేందుకు ముందుకురావడం లేదు. కొవిడ్ నుంచి కోలుకున్న బాధితులు 28 రోజుల్లోగా, వ్యాక్సిన్ వేసుకున్న వ్యక్తులు 14 రోజుల తరువాత ప్లాస్మా దానం చేయొచ్చని ఎన్బీటీసీ (నేషనల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కౌన్సిల్) మార్గదర్శకాలు ఉన్నాయి.
కొవిడ్ఆసుపత్రులుగా మారడంతో..: నగరంలోని అత్యధిక ఆసుపత్రులు కొవిడ్-19 చికిత్స కేంద్రాలుగా మారాయి. దాదాపు ఎవరూ సాధారణ వైద్యం, శస్త్రచికిత్సలు చేయడం లేదు. గర్భిణిలు, క్యాన్సర్ రోగులు, కొన్ని అత్యవసర శస్త్ర చికిత్సలకు మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో రక్తం అవసరమవుతోంది. రక్తం అవసరమని ఘోషా, హోమీజేబాబా క్యాన్సర్ ఆసుపత్రి, మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆసుపత్రుల నుంచి పలువురు రక్తనిధి కేంద్రాలకు వస్తున్నారు.