నర్సీపట్నంలో తెదేపా నేత అయ్యన్న ఇంటిగోడ కూల్చివేతపై ఆర్డీవో గోవిందరాజు స్పందించారు. నీటిపారుదలశాఖ కాలువ స్థలం ఆక్రమించారని ఫిర్యాదు వచ్చిందని.., ఈ క్రమంలో ఆక్రమణపై అయ్యన్న కుమారుడికి నోటీసు ఇచ్చామని తెలిపారు. కాగా.. ప్రభుత్వ సర్వేయర్లతో జాయింట్ సర్వే చేయాలని అయ్యన్న కుమారులు కోరారని చెప్పారు. జాయింట్ సర్వే విషయం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని ఆర్డీవో తెలిపారు. ఒకవేళ తాము ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించామని తేలితే.. తామే తొలగిస్తామని అయ్యన్న కుటుంబ సభ్యులు చెప్పారని ఆర్డీవో వెల్లడించారు. నీటిపారుదలశాఖ ఇచ్చిందన్న ఎన్వోసీ.. 276 సర్వే నెంబర్కు కాదని ఆర్డీవో తెలిపారు.
ఇదీ జరిగింది: అయ్యన్న పాత్రుడు పంటకాలువ ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టారంటూ.. శనివారం అర్ధరాత్రి జేసీబీలతో ఇంటి గోడను మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. రెండు సెంట్ల భూమి ఆక్రమించి నిర్మాణం చేపట్టారంటూ మున్సిపల్ సిబ్బంది నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల రెండో తేదీతో ఉన్న నోటీసును ఇప్పుడు ఇచ్చి.. వెంటనే గోడ తొలగించడంపై అయ్యన్నపాత్రుడి కుటుంబసభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు.
అయ్యన్నపాత్రుడి ఇంటి చుట్టుపక్కల అర్ధరాత్రి నుంచే.. విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపేశారు. అయ్యన్నపాత్రుడి వద్ద పనిచేసేవారు, నిత్యావసరాలు తీసుకొచ్చే వారిని కూడా.. పోలీసులు ఇంట్లోకి అనుమతించలేదు. అలాగే.. అయ్యన్నపాత్రుడి ఇంటికి వెళ్లే రెండు మార్గాలనూ పోలీసులు మూసివేశారు. మీడియాను ఆ పరిసరాల్లోకి రానీయకుండా చర్యలు చేపట్టారు. నర్సీపట్నం ఏఎస్పీ పర్యవేక్షణలోనే పోలీసుల బలగాలు మోహరించారు.