Mla Velagapudi Met Vishaka Collector: విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఓట్ల గల్లంతుపై భారీగా ఫిర్యాదుల పర్వం ప్రారంభమైంది. పత్రికల్లో వార్తలు రావడంతో ఓట్లు మాయమైన ప్రజలు కలెక్టరేట్కు పోటెత్తారు. వార్డులు, బూతుల వారీగా.. తొలగించిన ఓట్లను మళ్లీ తిరిగి నమోదు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఓట్ల తొలగింపునకు కారకులైన వాలంటీర్లతో పాటు, సిబ్బందిని సస్పెండ్ చేయాలని తెలుగుదేశం డిమాండ్ చేసింది. ఇష్టానుసారంగా ఓట్లు తొలగించారని.. స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు జాబితా నుంచి.. ఓటు ఎప్పుడు తొలగించారో కూడా తమకు తెలియదన్నారు. దశాబ్దాలుగా ఒకే చిరునామాలో ఉన్న ఓట్లు సైతం పోయాయని మండిపడ్డారు. ఒక్క తూర్పు నియోజక వర్గంలో దాదాపు 40 వేల ఓట్లు తొలగించారని టీడీపీ నేతలు మండిపడ్డారు. ఓటర్లతో కలిసి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
కలెక్టర్కు ఫిర్యాదు చేసిన వెలగపూడి: విశాఖ తూర్పు నియోజకవర్గంలో వార్డులు, బూతులవారీగా ఓట్ల గల్లంతుపై .. విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఓట్ల తొలగింపునకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా పాలనాధికారిని కోరారు. అనంతరం ఆయన విశాఖ కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. అధికారులు ఇంటింటికి వెళ్లి పరిశీలించకుండా ఇష్టానుసారంగా ఓట్లు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఓటర్ జాబితా నుంచి ఓటర్లను తొలగించినప్పుడు కనీసం ఎందుకు తొలగిస్తున్నారనే విషయాన్ని కూడా చెప్పలేదన్నారు.
"నా పేరు రామలక్ష్మి. మాది 15వ వార్డు కొత్త వెంకాజీ పాలెం. నా ఓటు పోయిందని తెలిసింది. ఎందుకు పోయిందో కారణమెంటో మాకు ఏ సమాచారం లేదు. మా ఇంటికి ఎవరు వచ్చి సర్వే చేయటం వంటి ఏమి చేయలేదు. నేను ఎప్పటికి ఇంటి దగ్గరే ఉంటాను." -రామలక్ష్మి, ఓటు కోల్పోయిన మహిళ