ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ పోలీసు సిబ్బందిలో.. "మహేష్" ఫీవర్!

విశాఖ పోలీసులకు "మహేష్" ఫీవర్ పట్టుకుంది. అవినీతి పరుల గుండెల్లో దడ కలుగుతోంది. కాసులకు కక్కుర్తి పడే వారిలో వణుకు పుడుతోంది. చేతివాటం ప్రదర్శించాలంటేనే... భయమేస్తోంది. విశాఖ నగర పోలీసు కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా ఎప్పుడు, ఎటునుంచి వచ్చి వేటు వేస్తారోననే ఆందోళన.. కంటికి నిద్ర లేకుండా చేస్తోంది.

By

Published : Jun 14, 2019, 7:02 AM IST

పోలీసు శాఖలో "మహేష్" ఫీవర్!

పోలీసు శాఖలో "మహేష్" ఫీవర్!

విధి నిర్వహణలో అవినీతికి పాల్పడిన పోలీసు సిబ్బందిపై నగర పోలీసు కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా వేటు వేస్తున్నారు. అలాంటి వారిని ఎట్టి పరిస్ధితుల్లో ఉపేక్షించేది లేదని ఆయన చెబుతున్నారు. వేలకు వేలు ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ కాసులకు కక్కుర్తి పడితే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు.

చీటింగ్ కేసులో...

విశాఖ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్​లో ఓ చీటింగ్ కేసు నమోదైంది. నిందితుడిపై అక్రమ కేసులు బనాయిస్తామని బెదిరించి రూ.30 వేలు డిమాండ్ చేశారు. వేధింపులు తట్టుకోలేని బాధితుడు ఆనంద్ మొదటి విడతగా రూ.15 వేలు ముట్టజెప్పాడు. అయినా కానిస్టేబుళ్లు మరో 15 వేలు తీసుకురావాలని ఒత్తిడి తెచ్చాడు. విసిగిపోయిన బాధితుడు అనిశా అధికారులను ఆశ్రయించాడు. పోలీస్ స్టేషన్లోనే హెడ్ కానిస్టేబుల్ బంగారు నాయుడుకు రూ.15 వేలు ఇవ్వగా తీసుకుని రైటర్ శ్రీనివాసరావు వద్ద ఉంచాడు. అనిశా అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి హెడ్ కానిస్టేబుల్, రైటర్​లపై సీపీ సస్పెన్షన్ వేటు వేశారు. ఆ స్టేషన్ సీఐ జెర్రిపోతుల శ్రీనివాసరావును క్రమశిక్షణ చర్యల్లో భాగంగా విఆర్​కు బదిలీ చేశారు.

నడిరోడ్డుపైనే...

విశాఖ నాలుగో పట్టణ క్రైం విభాగంలో హోంగార్డు మధుకుమార్, కానిస్టేబుల్‌ మహేశ్వరావు విధులు నిర్వహిస్తున్నారు. స్టేషన్‌ పరిధిలోని జాతీయ రహదారిపై శనివారం రాత్రి విధులు నిర్వహించారు. ఓ ద్విచక్ర వాహనాన్ని ఆపి... పత్రాలు చూపమన్నారు. తమది కడప జిల్లా అని, నగరంలో బంధువుల ఇంటికి వచ్చానని, జేబులో డబ్బులు కూడా లేవని వాహనదారుడు వాపోయాడు. అయినా వారు వినిపించుకోలేదు. చివరికి బాధితుడి ఫోన్‌పే అకౌంట్ ద్వారా హోంగార్డు చరవాణి నంబర్​కు రూ.400 జమ చేయించుకున్నారు. ఈ ఘటనపై బాధితుడు డయల్‌ 100కి ఫిర్యాదు చేశాడు. నగర శాంతి భద్రతల డీసీపీ-1 రవీంద్రనాథ్ బాబు, తూర్పు ఏసీపీలు విచారణ చేపట్టి తుది నివేదికను సీపీ మహేశ్‌చంద్ర లడ్డాకు అందజేశారు. ఆయన కానిస్టేబుల్​ను సస్పెండ్ చేసి, హోంగార్డును విధుల నుంచి తొలగించారు.

ప్రజాసేవ చేస్తామని ప్రమాణం చేసి... ప్రతినెలా వేలకువేలు వేతనం తీసుకుంటూ... ప్రజలను పీడించే పోలీసులపై ఉక్కుపాదం మోపుతున్న మహేష్ చంద్ర లడ్డాకు విశాఖ ప్రజలు జేజేలు పలుకుతున్నారు.

ఇదీ చదవండీ: 2000 కోట్లు.... ఏడు గోపురాలు... 55 అడుగులు

ABOUT THE AUTHOR

...view details