Jada Shravankumar fire On YCP govt: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై జైభీమ్ పార్టీ వ్యవస్ధాపకులు జడ శ్రావణ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని రూ.పది లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. తాను మాత్రం అత్యంత సంపన్న సీఎంగా దేశంలో నిలిచాడని జైభీమ్ పార్టీ వ్యవస్థాపకుడు జడ శ్రావణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేసిన మోసాలను గడప-గడపకూ దగా ప్రభుత్వం పుస్తక రూపంలో ప్రజల ముందు ఉంచుతానన్నారు. రాష్ట్రంలో పోలీసుల ప్రవర్తన ఎంతో మందిని మానసికంగా కుంగదీసి వారిని ఆత్మహత్యలు చేసుకునేట్టటు చేసిందన్నారు. దాదాపు 1500 వరకు ఈ తరహా వాస్తవ ఘటనలతో.. పుస్తకాన్ని రూపొందించినట్టు ఆయన వివరించారు.
ఈ సందర్భంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జడ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ..'' గత ప్రభుత్వంలో వ్యక్తుల మధ్య గొడవలు జరగడం చూశాము. అందులో చుండూరు, కారంచేడు సంఘటనల్లో రెండు కులాల మధ్య గొడవలు జరిగాయి. ఆ ఘటనల్లో రెండు కులాల వాళ్లు ఒకరిని ఒకరు చంపుకున్నారు. కానీ, గత ప్రభుత్వంలో జరిగిన దుర్మార్గాలకి, ఈ ప్రభుత్వ పాలనలో జరుగుతున్న దుర్మార్గాలకీ చాలా వ్యత్యాసం ఉంది. ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలే. ఏ విధంగా ఆ హత్యలు జరిగాయో నేను రాస్తున్న పుస్తకంలో స్పష్టంగా వివరించాను. వ్యక్తులు చనిపోవడానికి జగన్ రెడ్డి, హూంశాఖ మంత్రి, డీజీపీ కారణం కాకపోవచ్చు. కానీ, చనిపోయినటువంటి వ్యక్తుల వాంగూల్మాన్ని దాంట్లో పెట్టకుండా రిమాండ్ రిపోర్ట్ ఫైల్ చేసి, బాధితులు చనిపోయిన తర్వాత నిందితులను పారిపోయేలా చేసిన ప్రభుత్వాన్ని ఏమనాలి..?' అని ఆయన అన్నారు.