ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అసంపూర్తిగా వంతెనలు.. నదులు, గెడ్డలు దాటాలంటే అవస్థలు

ఆ ఒడ్ఢు. ఈ ఒడ్ఢు. నడి మధ్య నది అడ్ఢు... అనుదినం అటు నుంచి ఇటు వచ్చిపోవాలి. అందుకోసం ప్రాణాలను పణంగా పెట్టాలి.. లేదా రోజూ దూరాభారం భరించాలి. ఈ కష్టాలు గట్టెక్కించే వారధి కళ్లముందే ఉంది...కాకుంటే అసంపూర్తిగా.. అవసరానికి ఉపయోగపడకుండా.. ఉంది.

By

Published : Nov 9, 2020, 11:58 AM IST

Incomplete bridges
Incomplete bridges

నదీ పరీవాహక గ్రామాల మధ్య రాకపోకలకు వీలుగా నిర్మించతలపెట్టిన వంతెనలు ఏళ్ల తరబడి అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. నిధులు కొరత, భూసేకరణ సమస్యలను సాకుగా చూపి వారధి నిర్మాణాల్లో తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఫలితంగా గ్రామాల మధ్య రవాణా దూరం తగ్గడం లేదు..ప్రమాదకరంగా నదులు దాటాల్సి వస్తోంది. అత్యవసర సమయాల్లో దూరాభారం ప్రయాణించాల్సి రావడంతో ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోతుంది. ఆర్‌అండ్‌బీ పరిధిలో చేపట్టిన పలు వంతెనల నిర్మాణాలు తుదిదశకు వచ్చి నిలిచిపోయాయి. ఇటీవల వర్షాలకు ఆయా వంతెనలకు ప్రత్యామ్నయంగా వేసిన కల్వర్టులు కోతకు గురవ్వడంతో సమీప గ్రామస్థులు రాకపోకలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

నాబార్డ్‌ ఆర్‌ఐడీఎఫ్‌-19 నిధులతో రహదారులు భవనాలశాఖ నిర్మించిన వంతెనలన్నీ అసంపూర్తిగా మిగిలిపోయాయి. నాబార్డ్‌ నిధులు వినియోగించేటప్పుడు నిర్ణీత కాలంలోనే వాటిని ఖర్చుచేయాలి.. చాలకుంటే అదనపు నిధులను మంజూరు చేస్తారు. అలా కాకుండా నచ్చినప్పుడు ఖర్చు చేద్దామంటే ఆ నిధులు మురిగిపోయే ప్రమాదంతో పాటు అవసరమైన అదనపు నిధులు వచ్చే పరిస్థితి ఉండదు. జిల్లాలో ఈ నిధులతో చేపట్టిన పనుల విషయంలో అదే జరిగింది. సకాలంలో పనులు పూర్తి చేయలేకపోయారు. మళ్లీ పనులు మొదలుపెట్టడానికి ఆర్‌ఐడీఎఫ్‌-19 ట్రెంచ్‌ పూర్తయిపోయింది. దీంతో నిధులు లేక నాలుగేళ్లుగా వంతెనల పనులు పడకేశాయి. పంచాయతీరాజ్‌శాఖ చేపట్టిన ఒక్క బ్రిడ్జి కూడా అసంపూర్తిగానే వదిలేశారు. దీంతో స్థానికులు ఎప్పటిలానే అవస్థల ప్రయాణం కొనసాగిస్తున్నారు.

  • పినకోట.. నిత్యం తంటా

ఎక్కడ: దేవరాపల్లి నుంచి పినకోటకు వెళ్లే మార్గంలో శారద నదిపై

ఎప్పుడు : నాలుగేళ్ల క్రితం

నిర్మాణ వ్యయం: రూ. 4.8 కోట్ల అంచనా విలువతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం వంతెన అంతా పూర్తయినా అప్రోచ్‌ రోడ్డు నిర్మాణం కాలేదు.

సమస్య: ఈ రహదారి నిర్మాణం, భూసేకరణకు సుమారు రూ. 2 కోట్లు అవసరం అవుతుంది. వీటికోసం ప్రతిపాదనలు పెట్టారు. ఈ వంతెనకు ప్రత్యామ్నాయంగా నిర్మించిన కల్వర్టు కొట్టుకుపోయింది. దీంతో గిరిజన గ్రామాల నుంచి దేవరాపల్లి వైపు రావడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు ర.భ.శా, ఐటీడీఏ అధికారులతో మాట్లాడి వంతెనపై రాకపోకలకు వీలుగా నిర్మాణాలను పూర్తిచేయాలని ఆదేశించడంతో ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

  • కలిగొట్ల.. కష్టం తీరట్లా!

ఎక్కడ: దేవరాపల్లి మండలం కలిగొట్ల వద్ద శారద నదిపై

ఎప్పుడు: నాలుగేళ్ల క్రితం

నిర్మాణ వ్యయం: రూ. 6.95 కోట్లతో వంతెన నిర్మాణ పనులు మొదలుపెట్టారు. అందులో సుమారు రూ. 5 కోట్ల వరకు ఖర్చుచేశారు.

సమస్య: నదికి ఆవల అప్రోచ్‌ రోడ్డు నిర్మించలేదు. భూసేకరణ సమస్య తేలకపోవడంతో ఈ వంతన పనులు అక్కడితో నిలిచిపోయాయి. సుమారు 2.35 ఎకరాల భూమి అవసరం అవుతుంది. ఆ మేరకు భూమి అందుబాటులోకి వస్తే వంతెన వినియోగంలోకి వస్తుంది.

  • అంతా నిర్మించినా..

ఎక్కడ : నర్సీపట్నం నుంచి కోటవురట్ల వెళ్లే మార్గంలో వరాహా నదిపై

ఎప్పుడు: వడేళ్ల క్రితం

నిర్మాణ వ్యయం: రూ. 4.5 కోట్లతో వంతెన నిర్మాణం ప్రారంభించారు.

సమస్య: బ్రిడ్జి అంతా నిర్మించేశారు. అప్రోచ్‌ నిర్మాణం దగ్గరే ఆగిపోయారు. మరో రూ. 1.6 కోట్లు ఈ పనులకు అవసరమని ప్రతిపాదనలు పంపించారు.

  • అయిదేళ్లగా ఎదురుచూపులు

ఎక్కడ : కోటవురట్ల మండలం రామచంద్రపురం నుంచి పొందూరు వెళ్లే మార్గంలో వరాహా నదిపై

ఎప్పుడు : అయిదేళ్ల క్రితం

సమస్య : పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో రూ. 6 కోట్ల అంచనా విలువతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. నిధులైతే ఖర్చయిపోయాయి కాని వంతెన మాత్రం పిల్లర్ల స్థాయిలోనే నిలిచిపోయింది. మరోసారి అదనపు నిధులకు ప్రతిపాదనలు పెట్టారు. ఆ నిధులు వస్తేనే ఈ పనులు ముందుకు వెళతాయి.

  • ఎన్నాళ్లకో గవర‘వరం’

ఎక్కడ: చోడవరం మండలం గవరవరం వద్ద శారదా నదిపై

ఎప్పుడు: 2017లో

నిర్మాణ వ్యయం: రూ. 15 కోట్ల అంచనా విలువతో నిర్మాణం చేపట్టారు. రూ. 9 కోట్ల పనులకు టెండర్లు పిలిచి గుత్తేదారుకు అప్పగించారు. ఇందులో ఇప్పటి వరకు సుమారు రూ. 5 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.

సమస్య : ఇక్కడ వంతెన స్తంభాలు చాలా లోతుగా 20 నుంచి 22 మీటర్లలోతుకు వేయాల్సి రావడంతోనే పనులు జాప్యం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పనులు అసంపూర్తిగా ఉండడంతో ప్రత్యామ్నాయంగా ఓ కల్వర్టును నిర్మించారు. ఇటీవల వర్షాలకు ఆ కల్వర్టు కోతకు గురైంది. మరో రూ. 5 లక్షల అంచనా విలువతో ఆ కల్వర్టు మరమ్మతులకు ప్రతిపాదనలు పంపించారు.

పూర్తి చేయిస్తాం..

నిధుల సమస్య కారణంగా బ్రిడ్జిల నిర్మాణాలు నిలిచాయి. వాటి పరిస్థితిపై ప్రభుత్వానికి తెలియజేశాం. ఆర్‌ఐడీఎఫ్‌-19 ట్రెంచ్‌ ముగియడంతో వేరే నిధులు కేటాయించాలని కోరాం. ఇటీవలే వంతెనల పనులకు అవసరమైన నిధులిస్తాం పనులు చేయమన్నారు. గవరవరం దగ్గర పనులు పనులు మొదలుపెట్టించాం. దేవరాపల్లి-పినకోట వంతెన సమస్యను పరిష్కరిస్తాం. కలిగొట్ల వంతెనకు ఆవల భూసేకరణ కోసం కలెక్టర్‌కు రాశాం. త్వరలోనే అన్ని పనులు పూర్తిచేయిస్తాం. - వి.కేశవరావు, ఎస్‌ఈ, ఆర్‌అండ్‌బీ

ఇదీ చదవండి :

మెగాస్టార్​ చిరంజీవికి కరోనా పాజిటివ్​

ABOUT THE AUTHOR

...view details