విశాఖ జిల్లా చీడికాడ మండలం కోనాం మధ్య తరహా జలాశయం నుంచి నీరు వృథాగా పోతుండడంతో రోజురోజుకూ నీటిమట్టం తగ్గుతోంది. సరాసరిన రోజుకు 40 క్యూసెక్కులు చొప్పున జలాశయం నుంచి జారిపోతోందని అంచనా. ఈ పరిణామంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. భవిష్యత్తులో రబీ సాగుకు, వేసవికాలంలో తాగునీటికి ఇబ్బందులు తప్పవని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని నెలల క్రితం విస్తారంగా కురిసిన వర్షాలకు.. జలాశయంలో సమృద్ధిగా నీటి నిల్వలు పెరిగి, గరిష్ఠ స్థాయికి చేరాయి. ప్రస్తుతం స్పిల్ వే గేట్ల నుంచి బొడ్డేరు నదిలోకి అధిక మొత్తంలో నీరు వృథాగా పోతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 101.25 మీటర్లు కాగా.. ఇప్పుడు 98.8 మీటర్లకు పడిపోయింది. జలవనరుల శాఖ అధికారులు స్పందించి.. నీటి వృథాను అరికట్టాలని రైతులు, ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.