విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో అరిలోవ ఎఫ్.ఆర్.యు. సెంటర్లో ఆశా వర్కర్లు నగదు తీసుకొని వ్యాక్సిన్ వేయిస్తున్నట్లు వస్తున్న ఫిర్యాదుపై.. జీవీఎంసీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి స్పందించారు. సెంటరు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్త పరుస్తూ తక్షణమే విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. డబ్బులు తీసుకొని వ్యాక్సిన్ వేస్తున్నట్లు విచారణలో తేలితే.. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జీవీఎంసీలోని అన్ని పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ, ఆరిలోవ, మల్కాపురం ఎఫ్.ఆర్.యు. సెంటర్లలోనూ వ్యాక్సిన్ వేస్తున్నట్లు చెప్పారు.
వ్యాక్సిన్ కొరకు ఎవ్వరూ ఎటువంటి డబ్బులు చెల్లించనవరసం లేదని.. ఎవరైనా నగదు డిమాండ్ చేస్తే వెంటనే టోల్ ఫ్రీ నెం. 1800 4250 0009 లేదా 0891-2869100 నెంబర్ కు తెలియజేయాలని కోరారు. ప్రజలు ఎటువంటి అపోహలకు పోకుండా 45 సంవత్సరాలు దాటిన ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని.. భౌతిక దూరం పాటించాలన్నారు. మాస్కులు ధరించి వ్యాక్సినేషన్ వేసే సిబ్బందికి సహకరించాలని మేయర్ ప్రజలకు సూచించారు.