ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 12, 2022, 9:36 AM IST

ETV Bharat / state

VMRDA: వీఎంఆర్‌డీఏ నిర్లక్ష్యం ఖరీదు రూ.157 కోట్లు...

VMRDA: విశాఖ మహా ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ఏళ్లుగా చేసిన జాప్యానికి, పాలనా వ్యవహారాల్లో నిర్లక్ష్యానికి ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి ఎదురైంది. ‘యాంబియన్స్‌ ప్రాజెక్ట్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ సంస్థకు వీఎంఆర్‌డీఏ ఏకంగా రూ.157.55 కోట్లు చెల్లించాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా రూ.40 కోట్లు చెల్లించడం గమనార్హం.

VMRDA
VMRDA

VMRDA: విశాఖ మహా ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ఏళ్లుగా చేసిన జాప్యానికి, పాలనా వ్యవహారాల్లో నిర్లక్ష్యానికి ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి ఎదురైంది. ‘యాంబియన్స్‌ ప్రాజెక్ట్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ సంస్థకు వీఎంఆర్‌డీఏ ఏకంగా రూ.157.55 కోట్లు చెల్లించాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇంత మొత్తం ఒకేసారి చెల్లించే పరిస్థితి లేకపోవడంతో మూడు దశల్లో చెల్లించేలా ఆ సంస్థతో వీఎంఆర్‌డీఏ ఒప్పందం కుదుర్చుకుంది. తొలివిడతగా రూ.40 కోట్లు తాజాగా చెల్లించడం గమనార్హం. ఈ దస్త్రాన్ని త్వరితగతిన పరిష్కరించే క్రమంలో అధికార పార్టీ ముఖ్య నేత ఒకరి ఒత్తిళ్లు ఉన్నాయన్న ప్రచారం సాగుతోంది.

2007లో స్థలం కొనుగోలు

వీఎంఆర్‌డీఏ వుడాగా ఉన్నప్పుడు ‘భూనిధి’ కింద ఖాళీ స్థలాల విక్రయానికి 2007లో బహిరంగ వేలం ప్రకటన ఇచ్చింది. మధురవాడలో లేఅవుట్‌ సర్వే నంబరు 421లోని బిట్‌-1 ప్లాట్‌ 44.25 ఎకరాలను ‘యాంబియన్స్‌ ప్రాజెక్ట్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ సంస్థ ఎకరా రూ.2.14 కోట్ల చొప్పున సుమారు రూ.94.69 కోట్ల అధిక ధరకు పాడుకుంది. మొదటి విడత సొమ్మును చెల్లించింది. తాము కొన్న స్థలంలో ఆక్రమణలు, అనధికార నిర్మాణాలు ఉన్నాయని.. వాటిని తొలగించి అప్పగిస్తేనే తదుపరి మొత్తం చెల్లిస్తామంది. తదనంతర పరిణామాలతో రూ.76 కోట్లను వీఎంఆర్‌డీఏకు మూడు విడతల్లో సంస్థ చెల్లించింది. ఆక్రమణలు తొలగించకపోవడంతో ఆ స్థలాన్ని వెనక్కి ఇచ్చేస్తామని అప్పటి వరకు చెల్లించిన డబ్బుకు 12 శాతం వడ్డీ కలిపి తిరిగివ్వాలని కలెక్టరుకు సంస్థ లేఖ రాసింది. అలా వీలుకాకపోతే సమీకృత టౌన్‌షిప్‌, విలాసవంతమైన భవన నిర్మాణాలకు అనువైన అంతే స్థలాన్ని హౌసింగ్‌ బోర్డు, పర్యాటకశాఖకు చెందినదయినా తమకు కేటాయించాలని కోరారు. దీనిపైనా అధికారులు ఏ విధమైన నిర్ణయం వెల్లడించలేదు. ఫలితంగా 12 శాతం వడ్డీతో మొత్తం రూ.267.64 కోట్లు చెల్లించాలని సంస్థ ప్రతినిధులు కోరారు. ఈ పరిణామాలన్నింటినీ వీఎంఆర్‌డీఏ 2019లో ప్రభుత్వానికి తెలియజేసింది.

అసలు కన్నా వడ్డీ ఎక్కువ

ఈ అంశంపై ఇటీవల చాలా వేగంగా దస్త్రాలు కదిలాయి. వడ్డీ ఎంత నిర్ణయించాలనే దానిపై అధికారులు కసరత్తు చేశారు. 8 శాతం వడ్డీతో ఎంతవుతుందో నిర్ణయించారు. అసలు రూ.76.18 కోట్లకు.. 2007 నుంచి 2022 జనవరి 24 వరకు వడ్డీ రూ.81.37 కోట్లుగా నిర్ణయించారు. మొత్తంగా రూ.157.55 కోట్లు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వీఎంఆర్‌డీఏకు అంత మొత్తం చెల్లించడం కొంత కష్టమే.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details