ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మావోయిస్టు హెచ్చరికలతో మన్యం వాసుల ఆందోళన

పంచాయతీ ఎన్నికలు జరగనుండటంతో విశాఖ మన్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముంచంగిపుట్టు మండలం బూసిపుట్టు సర్పంచి అభ్యర్థి పోటీ నుంచి తప్పుకోవాలని ఆమె భర్తను.. మావోయిస్టులు కొట్టి హెచ్చరించారు. మావోల హెచ్చరికతో.. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచిని పదవి నుంచి తప్పుకోవాలని గిరిజనులు ఆందోళన చేపట్టారు.

Concern of many residents with Maoist warnings
మావోయిస్టు హెచ్చరికలతో మన్యం వాసుల ఆందోళన

By

Published : Feb 16, 2021, 11:41 AM IST

పంచాయతీ ఎన్నికల సమయం కావటంతో విశాఖ మన్యంలో టెన్షన్​ వాతావరణం ఏర్పడింది. ఎన్నికలను బహిష్కరించాలంటూ రెండు వారాలుగా మావోయిస్టులు పిలుపునిస్తున్నారు. తాజాగా ముంచంగిపుట్టు మండలం బూసిపుట్టు సర్పంచి అభ్యర్థి భర్తను అపహరించుకుపోయారు. తీవ్రంగా కొట్టి, పోటీ నుంచి వైదొలగాలని హెచ్చరించి వదిలిపెట్టారు. ఈ ఘటనపై పోలీసు నిఘా వర్గాలు ఆరా తీస్తున్నారు. దీంతో ఒక్క‌సారిగా మ‌న్యంలో స‌ర్పంచి అభ్య‌ర్థుల‌లో ఆందోళన మొద‌లైంది. ఎప్పుడు ఏమి జ‌రుగుతుందోన‌నే భ‌యం వారిని వెంటాడుతుంది.

పంచాయతీ ఏకగ్రీవాలు

ఏజెన్సీలో ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల, గూడెం కొత్త‌వీధి, చింతపల్లి మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లో మావోయిస్టుల హెచ్చరికలతో స్థానిక సంస్థలకు పోలింగ్‌ జరగకపోవడం లేదా ఏకగ్రీవం కావడం సాధారణం. ఈసారి ఎన్నికల్లో కూడా పోటీ చేయవద్దంటూ మావోయిస్టులు ముందుస్తుగానే ప్రకటనలు, హెచ్చరికలు జారీచేశారు. దీంతో పెదబయలు మండలం గిన్నెలకోట పంచాయతీలో ఒక్కరూ కూడా నామినేషన్‌ దాఖలు చేయలేదు. పెదబయలు మండలం ఇంజెరి, జీకే వీధి మండలం మొండిగెడ్డ, ధారకొండ, అమ్మవారి ధారకొండ పంచాయతీల్లోనూ సర్పంచ్‌ స్థానాలకు ఒక్కొక్కరే నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఈ పంచాయతీల పాలక వర్గాలు ఏకగ్రీవం అయ్యాయి.

అప్రమత్తమైన పోలీసులు

పెదబయలు మండలం ఇంజెరి పంచాయతీ సర్పంచిగా రాములమ్మ ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఆమె తన పదవికి రాజీనామా చేయాలని వివిధ గ్రామాల ప్రజలు పంచాయతీ కేంద్రంలో ఆందోళన చేపట్టారు. ఈ పరిణామాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మరో 24 గంటల్లో పోలింగ్‌ జరగనుండడంతో ఏం జరుగుతుందోనని ఏజెన్సీవాసులు భయపడుతున్నారు. దీంతో అభ్య‌ర్థులు సుర‌క్షిత ప్రాంతాల‌కు వెల్లాల‌ని, మాజీ ప్ర‌జాప్ర‌తినిధులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పోలీసులు నోటీసులు అంద‌జేశారు. మ‌రో ప‌క్క ఒడిశాకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో పోలీసులు గాలింపు చ‌ర్య‌ల‌ను ఉధృతం చేశారు.

ఒకరోజు ముందే పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బంది

గూడెంకొత్తవీధి మండల కేంద్రానికి సుదూరంలో, మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో గల పంచాయతీలకు పోలింగ్‌ సిబ్బంది, సామగ్రిని ఒకరోజు ముందే తరలించారు. వాస్తవంగా పోలింగ్‌ జరగడానికి ముందురోజు ఆయా కేంద్రాలకు సిబ్బందిని తరలిస్తుంటారు. కానీ మండలంలోని సీలేరు, ధారకొండ, గుమ్మిరేవులు, దుప్పులవాడ, జర్రెల, వంచుల, మొండిగెడ్డ పంచాయతీలకు నిన్న రాత్రి ఎన్నికల సిబ్బందిని, సామగ్రిని ప్రత్యేక వాహనాల్లో తరలించారు.

ఇదీ చదవండి:నేటితో ముగియనున్న నాలుగో విడత ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ

ABOUT THE AUTHOR

...view details