ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేటి నుంచి విజయవాడ, విశాఖలో సిటీ బస్సు సర్వీసులు పునరుద్ధరణ - విజయవాడలో సిటీ బస్సుల తాజా వార్తలు

విజయవాడ, విశాఖపట్నం నగర వాసుల ప్రయాణ కష్టాలు ఎట్టకేలకు తీరనున్నాయి. ఆరునెలల తర్వాత ఆర్టీసీ సిటీ బస్సులు రోడ్డెక్కుతున్నాయి. కొవిడ్ నిబంధనల ప్రకారం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ నేటి నుంచి బస్సులను నడపాలని నిర్ణయించిన అధికారులు.. రద్దీని బట్టి సర్వీసులను క్రమంగా పెంచనున్నారు.

apsrtc city bus services
apsrtc city bus services

By

Published : Sep 19, 2020, 4:32 AM IST

కరోనా కారణంగా రాష్ట్రంలో మార్చి 22 నుంచి బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. మే 21 న ఆర్టీసీ బస్సు సర్వీసులను పునరుద్ధరించినప్పటికీ.. కరోనా కేసులు అధికంగా ఉన్న విజయవాడ, విశాఖ నగరాల్లో మాత్రం బస్సులను రోడ్డెక్కించలేదు. సిటీ బస్సులు నడిపితే కేసులు పెరుగుతాయన్న వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికతో సర్వీసులను ప్రారంభించలేదు. సోమవారం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నియామక పరీక్షలు జరుగుతున్నందున.. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా ఆర్టీసీ బస్సులను నడపాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతున్నాయని.. పరిస్థితి తీవ్రంగా లేదన్న ఆర్టీసీ అధికారులు.. విశాఖ, విజయవాడలో సిటీబస్సులు తిప్పేందుకు అనుమతి ఇవ్వాలని వైద్యఆరోగ్య శాఖను కోరారు. ఆ శాఖ సుముఖతతో పరిస్థితిని సమీక్షించి ప్రభుత్వం.. అనుమతి మంజూరు చేసింది. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ బస్సులు నడపాలని అధికారులను ఆదేశించింది.

విజయవాడ నగరంలో 450 సిటీబస్సులు ఉండగా నేటి నుంచి 100 సిటీ బస్సులను రోడ్డెక్కిస్తున్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షలు కోసం ఆదివారం 300 బస్సులను.. సోమవారం నుంచి రద్దీని బట్టి బస్సులను నడపనున్నారు. విశాఖలో సుమారు వెయ్యి సిటీ సర్వీసులు ఉండగా..వాటిలో అవసరాన్ని బట్టి బస్సులను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. రెండు నగరాల్లోనూ దాదాపు అన్ని రూట్లలో సిటీ బస్సులు నడపాలని నిర్ణయించారు. కొవిడ్ వ్యాప్తి చెందకుండా బస్సుల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోనున్నారు.

బస్సుల్లో సగం సీట్లలో మాత్రమే ప్రయాణికులను అనుమతిస్తారు. సిటీ బస్సుల్లో ఒకవైపు రెండు సీట్లు, మరో వైపు రెండు సీట్లు చొప్పున ఉంటాయి. వీటిలో ఒక్కొక్కరు మాత్రమే కూర్చోవాలి. నిల్చొని ప్రయాణించేందుకు అనుమతించరు. మాస్కులు లేని వారిని బస్సు ఎక్కనివ్వరు. బస్సెక్కాక శానిటైజర్ తో ప్రయాణికుల చేతులను శుద్ధి చేసుకోవాలి. బస్సుల్లో కండక్టర్లు టికెట్లు జారీ చేస్తారు. డ్రైవర్లు , కండక్టర్లూ తప్పని సరిగా మాస్కు ధరించాల్సి ఉంటుంది. నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేసేలా ఆర్టీసీ ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించనున్నారు.

ఇదీ చదవండి:శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నిరాడంబరంగా అంకురార్పణ

ABOUT THE AUTHOR

...view details