ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 27, 2023, 10:39 AM IST

ETV Bharat / state

TTD Sanitation Workers: 'కొత్త వాళ్లకి రోజుకు రూ. 800 ఇస్తున్నారు.. అదే జీతం మాకు ఇవ్వచ్చు కదా?'

TTD Sanitation Workers Strike: జీతాలు పెంచాలని తిరుమలలో సులభ్‌ కార్మికులు చేపట్టిన సమ్మె మూడో రోజు కూడా కొనసాగింది. దాదాపు 1600 మంది సిబ్బంది సమ్మె బాట పట్టారు. ఫలితంగా.. తిరుమల రహదారులపై చెత్త పేరుకుపోతోంది. కార్మికులు విధులను బహిష్కరించడంతో టీటీడీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. నగరపాలక సంస్థలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న కార్మికులను తిరుమల తరలించి పారిశుద్ధ్య నిర్వహణ చేస్తున్నారు.

Etv Bharat
Etv Bharat

తిరుమలలో సులభ్‌ కార్మికులు చేపట్టిన సమ్మె

TTD Sanitation Workers Strike : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీటీడీలో పనిచేస్తున్న సులబ్‌ కార్మికులు చేపట్టిన సమ్మె మూడో రోజుకు చేరింది. దాదాపు రెండు వేల మంది కార్మికులు విధులను బహిష్కరించి సమ్మెబాటపట్టడంతో తిరుమలలో పారిశుద్ధ్య సమస్యలు ఎదురవుతున్నాయి. సులబ్‌ కార్మికులు విధులను బహిష్కరించడంతో టీటీడీ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని వివిధ నగరపాలక సంస్థల నుంచి కార్మికులను తిరుమలకు తరలించి పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతి నగరపాలక సంస్థలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న కార్మికులను తిరుమలలో వినియోగిస్తున్నారు. సులబ్‌ కార్మికులు సమ్మెతో తిరుమలలో కొన్ని ప్రాంతాల్లో చెత్త పేరుకుపోతోంది.

తిరుమలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించే సులబ్‌ కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. విధులను బహిష్కరించిన కార్మికులు తిరుపతి హరేరామహరేకృష్ణ మైదానంలో నిరసన చేపట్టారు. సులబ్‌ కార్మికులు తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న మరుగుదొడ్ల నిర్వహణతో పాటు అన్నదాన సత్రం, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌, అలిపిరి, శ్రీవారిమెట్టు కాలినడక మార్గాల్లో పారిశుద్ద్య కార్యక్రమాలు చేపట్టేవారు. సులబ్‌ కార్మికులు విధులు బహిష్కరించడంతో అన్నదాన సత్రంలో సిబ్బంది కొరత ఏర్పడుతోంది. రెండు రోజులుగా అన్నదాన సత్రంలో సాంబార్‌ అన్నం, పెరుగు అన్నం మాత్రమే వడ్డిస్తున్నారు. కూరలు చేయడానికి అవసరమైన కాయకూరలు తరగడం, పచ్చడికి అవసరమైన కొబ్బరి తీయడం వంటి పనులు ఆగిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. మరో వైపు అన్నదానసత్రం, ప్రధాన కూడళ్లలో చెత్త పేరుకుపోయింది.

సంవత్సరాల తరబడి తిరుమలలో విధులు నిర్వహిస్తున్నా కనీస వేతనం చెల్లించడం లేదని సమ్మె చేస్తున్న సులబ్‌ కార్మికులు వాపోయారు. మరుగుదొడ్లు తాము శుభ్రం చేస్తామని టీటీడీ నిర్వహణలో ఉన్న శ్రీలక్ష్మిశ్రీనివాస మాన్‌పవర్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న కార్మికులతో సమానంగా తమకు వేతనం చెల్లించడం లేదని సులబ్‌ కార్మికులు తెలిపారు. తిరుమలలో ఇతర సంస్థల పరిధిలో విధులు నిర్వహిస్తున్న కార్మికులను అందుతున్న జీతాలు తమకు రావడం లేదని, పీఎఫ్‌, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.

సులబ్‌ కార్మికుల సమ్మె నేపథ్యంలో వివిధ శాఖల అధిపతులు, జిల్లా అధికారులతో టీటీడీ ఈఓ ధర్మారెడ్డి సమావేశం నిర్వహించారు. సులబ్‌ కార్మికులు తమ సమస్యలను సులబ్‌ సంస్థతో చర్చించి పరిష్కరించుకోవాలని, నేరుగా కార్మికులతో తమకు ఎలాంటి సబంధాలు ఉండవని ఈఓ తెలిపారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సమ్మె చేస్తున్న కార్మికులను విధుల్లోకి తీసుకొనే ఆలోచన లేదని, మరికొన్ని రోజుల్లో కొత్త సంస్థలతో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు.

దాదాపు రెండు వేల మంది కార్మికులు విధులను బహిష్కరించడంతో ఆ ప్రభావం తిరుమలలో పారిశుద్ధ్యంపై పడింది. ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసినప్పటికీ తగినంత స్థాయిలో కార్మికులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పారిశుద్ధ్య కార్మికులపై టీటీడీ కక్షసాధించేలా వ్యవహరిస్తోందని, చర్చలకు పిలిచి సమస్య పరిష్కరించేలా కాకుండా కార్మికుల పొట్టకొట్టేలా చేస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.

" ఎండకి, గాలికి తిండి, నీళ్లు లేకుండా పస్తులు పడి ఉన్నాం. మాకు ఉద్యోగ భద్రత చేయండి. మాకు పీఎఫ్, ఈఎస్‌ఐ కల్పించండి. ఇచ్చే జీతం కూడా తగ్గిస్తున్నారు. కొత్త వాళ్లకి రోజుకు 8 వందలు ఇస్తున్నారు. ఆ జీతం మాకు ఇవ్వచ్చు కదా? " - కార్మికురాలు

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details