ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమలలో గంజాయి అమ్మకాలు సీఎంకే సిగ్గుచేటు: టీడీపీ నేతలు - finding ganja in Tirumala

TDP LEADERS ON GANJA : ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో గంజాయి దొరికిన ఘటనపై టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పవిత్ర తిరుమల క్షేత్రంలో గంజాయి అమ్మకాలు జరగటం ముఖ్యమంత్రికే సిగ్గుచేటని మండిపడ్డారు. రైతుల పంట‌కి మ‌ద్దతు ధ‌ర ఇవ్వలేని జ‌గ‌న్​రెడ్డి.. వైసీపీ వాళ్లు పండించే గంజాయికి మాత్రం బాగానే మ‌ద్దతు ధ‌ర కల్పిస్తున్నారని విమర్శించారు.

TDP LEADERS ON GANJA
TDP LEADERS ON GANJA

By

Published : Mar 27, 2023, 10:05 AM IST

Updated : Mar 27, 2023, 12:12 PM IST

TDP LEADERS ON GANJA : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో గంజాయి అమ్మకాలు ముఖ్యమంత్రి జగన్​కే సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. వైవీ సుబ్బారెడ్డిని తక్షణమే టీటీడీ ఛైర్మన్ నుంచి తొలగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా జరిగే గంజాయి, మాదకద్రవ్యాల అమ్మకాలపై ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారని వర్ల నిలదీశారు.

గంజాయికి అడ్డగా టీటీడీని మార్చారు: రాష్ట్రంలో గంజాయి, మాదక ద్రవ్యాల వ్యాపారం, అక్రమ రవాణా అంతా ముఖ్యమంత్రి జగన్, వైసీపీ వాళ్లే చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి ఆరోపించారు. రాష్ట్ర యువత గంజాయి, మాదక ద్రవ్యాలకు బానిసలు అయ్యారని.. వాటి వినియోగం బాగా పెరిగిందని విమర్శించారు. గంజాయి ఎగుమతుల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్​ మొదటి స్థానంలో ఉందన్నారు. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో నివేదిక ప్రకారం 2018లో 6,600 కిలోల గంజాయి పట్టుబడితే, నేడు 2లక్షల 600 కిలోల గంజాయిని ఏపీ పోలీసులు పట్టుకున్నారని గుర్తు చేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా గంజాయికి అడ్డాగా మార్చారని మండిపడ్డారు. తిరుమల కొండ పైకి గంజాయి ఎలా వెళ్లిందని ప్రశ్నించారు. సెక్యూరిటీ అధికారులు ఎలాంటి తనిఖీలు లేకుండా కొండ పైకి వాహనాల్ని అనుమతి ఇస్తున్నారని విమర్శించారు. తిరుమలలో గంజాయి దొరకడంతో హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని.. దీనికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థలను నాశనం చేస్తున్న జగన్, అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.

పవ్రిత కొండ మీద గంజాయి అమ్ముతుంటే ఏం చేస్తున్నారు: సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి సాగును ప్రోత్సహిస్తున్నారని తెలుగుదేశం సీనియర్​ నాయకులు, మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వార్షిక నివేదిక ప్రకారం గంజాయి రవాణాలో ఏపీ అగ్రస్థానంలో ఉందని విమర్శించారు. 2021లో దేశంలో పట్టుబడిన 7.5 లక్షల కిలోల గంజాయిలో ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 26% ఉన్నట్లు ఏసీసీబీ నివేదికలో పేర్కొందన్నారు. రాష్ట్రం నుంచి రోజుకు టన్నుల కొద్దీ గంజాయి రవాణా అవుతుందని.. దీని బట్టి గంజాయి మాఫియాకు వైసీపీ నేతలు ఏ విధంగా సహకరిస్తున్నారో స్పష్టమవుతోందని దేవినేని ధ్వజమెత్తారు.

పవిత్ర తిరుమల కొండ మీద మద్యం, గంజాయి అమ్ముతుంటే సిగ్గు లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఏ పట్టణాల్లో ఎంత మందికి బటన్ నొక్కి.. డబ్బులు వేశారో బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఫైనాన్సు సెక్రటరీ, ఆర్థిక మంత్రి బుగ్గన, సజ్జల, జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు కూడా రక్షణ లేకుండా పోయిందని దుయ్యబట్టారు.

గంజాయి అక్రమ వ్యాపారంపై టీడీపీ పెద్ద ఎత్తున ఉద్యమం: వైసీపీ పాలనతో రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా పెరిగిపోయిందని, ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో సైతం గంజాయి దొరికిందని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో గంజాయి సాగు ఎగుమతి విచ్చలవిడిగా పెరిగిందని విమర్శించారు. స్వయంగా వైసీపీ నాయకులే గంజాయి వ్యాపారానికి వెన్నుదన్నుగా ఉండి నడిపిస్తున్నారని ఆరోపించారు.

15 మంది అంతర్జాతీయ గంజాయి స్మగ్లర్లు ఏపీలోనే ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అన్నారు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడిన ఆ మూలాలు ఆంధ్రప్రదేశ్​లోనే ఉండటం జరుగుతుందన్నారు. గడచిన నాలుగేళ్లలో యువతకు ఉద్యోగాలు లేక గంజాయికి అలవాటు పడి వారి జీవితాలు నాశనం అవుతున్నాయని తెలిపారు. గంజాయి అక్రమ వ్యాపారం పై తెలుగుదేశం పార్టీ రాబోవు రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ప్రభుత్వం చేస్తున్న అసమర్థ పాలనను ప్రజల్లో ఎండగడతామన్నారు.

తిరుమలలో గంజాయి అమ్మకాలు సీఎంకే సిగ్గుచేటు: టీడీపీ నేతలు

ఇవీ చదవండి:

Last Updated : Mar 27, 2023, 12:12 PM IST

ABOUT THE AUTHOR

...view details