Tirupati Gangamma Jatara: రాయలసీమలో సుప్రసిద్ధ జాతరగా పేరొందిన తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరకు అరుదైన గౌరవం దక్కింది. దుష్టులను అంతమొందిచేందుకు ఉద్భవించిన దేవతగా.. కలియుగదైవం తిరుమల శ్రీవారి సహోదరిగా పూజలందుకుంటున్న తిరుపతి గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీచేసింది. సంస్కృతి, సంప్రదాయాలను అనుసరిస్తూ భక్తి, శ్రద్ధలతో నిర్వహించుకొనే జాతరకు రాష్ట్ర పండగగా గుర్తింపు రావడం అనందంగా ఉందంటున్నారు తిరుపతి వాసులు.
గంగమ్మ తల్లి జాతరకు దాదాపు తొమ్మిది శతాబ్దాల గొప్ప చరిత్ర ఉంది. శ్రీవారికి స్వయాన చెల్లెలుగా తితిదే నుంచి తాతయ్యగుంట గంగమ్మ సారె అందుకుంటోంది. తొమ్మిది వందల ఏళ్ల చరిత్రను పొందిన గంగమ్మ తల్లికి ఈ అరుదైన ఘనత దక్కటంతో తిరుపతి వాస్తవ్యులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సనాతన సంప్రదాయాలు, సంస్కృతిని అనుసరిస్తూ గంగమ్మ జాతరలో రోజుకో వేషం ధరిస్తూ ఏడు రోజుల పాటు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. దుష్టుల నుంచి స్త్రీలను కాపాడటానికి స్వయానా అమ్మవారు వివిధ వేషాలతో సాక్షాత్కరించిందన్న విశ్వాసంతో భక్తులు ఆ వేషాలు నేటికీ ధరిస్తూ మొక్కులు చెల్లించుకొంటున్నారు. సనాతన ఆచార వ్యవహారాలను నేటికీ భక్తులు సంప్రదాయంగా కొనసాగిస్తున్నారు.