ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Gangamma Jathara: తాతయ్యగుంట గంగమ్మ జాతరకు సర్వం సిద్ధం.. 900 ఏళ్లనాటి ఆనవాయితీలో ప్రత్యేకతలివే..

Gangamma Jathara: తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన తర్వాత జరుగుతున్న తొలి జాతర కావడంతో.. మరింత వైభవంగా నిర్వహించేలా గంగమ్మ ఆలయ బోర్డు, టీటీడీ సంయుక్తంగా ఏర్పాట్లుచేశాయి. పాలెగాళ్ల అరాచకలను అంతం చేసేందుకు ఉద్భవించిన గంగమ్మకు.. రోజుకో వేషధారణలో భక్తులు మొక్కులు తీర్చుకోనున్నారు.

By

Published : May 10, 2023, 7:53 AM IST

tirupati gangamma jatara
తాతయ్యగుంట గంగమ్మ జాతరకు సర్వం సిద్ధం

తాతయ్యగుంట గంగమ్మ జాతరకు సర్వం సిద్ధం

Gangamma Jathara: పాలెగాళ్ల అరాచకాలను అంతమొందిచేందుకు ఉద్భవించిన దేవతగా.. కలియుగ దైవం తిరుమల శ్రీవారి సహోదరిగా పూజలందుకుంటున్న తిరుపతి గంగమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. తిరుపతి నగరంలోని తాతయ్యగుంటలో వెలసిన గంగమ్మకు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జాతర నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఏడు కొండల వెంకన్నకు ఆడపడుచుగా భావిస్తూ గంగమ్మకు భక్తి శ్రద్ధలతో భక్తులు పూజలు నిర్వహిస్తారు. మంగళవారం విశ్వరూప స్తూపానికి అభిషేకాలు నిర్వహించి.. వడిబాలు కట్టడంతో.. జాతరకు అంకురార్పణ జరిగింది. అవిలాల నుంచి పసుపు కుంకుమలతో సారె తీసుకొచ్చి.. చాటింపు వేయడంతో.. జాతర ప్రారంభమైంది.

స్థల పురాణం:తిరుపతి గంగమ్మ జాతరకు ఇంత పేరు ప్రఖ్యాతలు రావటానికి ప్రధాన కారణం జాతరలో భక్తులు ప్రదర్శించే వేషధారణలు. పూర్వం చిత్తూరు జిల్లా ప్రాంతంలో పాలెగాళ్ల అరాచకాలు ఎక్కువగా ఉండేవని.. నానాటికీ దురాగతాలు ఎక్కువ అవటంతో అమ్మవారు గంగమ్మ తల్లిగా ఉద్భవించిందని స్థల పురాణం. అమ్మవారికి భయపడిన అప్పటి పాలెగాడు గంగమ్మకు కనపడకుండా దాక్కొని జీవించేవాడట. పాలెగాడిని బయటకి రప్పించేందుకు గంగమ్మ తల్లి రోజుకో వేషంతో బూతులు తిడుతూ సంచరించేదని ఆలయ ప్రశస్తి. చివరికి దొరవేషములో పాలెగాడిని సంహరించి భక్తుల కష్టాలను తీర్చిందని నమ్మకం. నాటి నుంచి అమ్మవారికి ఏటా చైత్రమాసం చివరి వారంలో 7 రోజుల పాటు భక్తులు రోజుకో వేషంతో గంగమ్మకు వైభవోపేతంగా జాతర నిర్వహిస్తారు.

900 ఏళ్లనాటి చరిత్ర:దాదాపు 900 వంద సంవత్సరాల చరిత్ర కలిగిన గంగమ్మ జాతరను ప్రభుత్వం.. రాష్ట్ర పండుగగా ప్రకటించింది. దీంతో ఈ ఏడాది జాతర ప్రత్యేకత సంతరించుకొంది. పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహా కుంభాభిషేకం ఈ ఏడాది జరగడం.. రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో జాతరను ఘనంగా నిర్వహించడానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. చలువ పందిళ్లు, పూలమాలలతో ఆలయాన్ని అలంకరించారు. విద్యుద్దీప కాంతులతో దేవాలయం తళుకులీనుతోంది. కేవలం చిత్తూరు జిల్లా నుంచే కాక రాయలసీమ జిల్లాల నుంచి కులదేవతను కొలిచేందుకు భక్తులు తరలిరానుండటంతో అధికారులు, దేవస్థాన పాలకమండలి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జాతరను పురస్కరించుకుని 9 రోజులూ.. ఆలయ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. చివరి రోజు అమ్మవారి విశ్వరూప దర్శనంతో.. జాతర ముగుస్తుంది.

"మన దేశంలో ఏ జాతర అయినా రెండు మూడు రోజులు జరుగుతుంది. కానీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర మాత్రం ఏడు రోజులపాటు జరుగుతుంది. మొట్టమొదట జాతర అనేది మొదలయ్యింది ఈ అమ్మవారి జాతరతోనే." - మునిశేఖర్, ఈవో

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details