ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు మృతి

By

Published : Jan 2, 2021, 10:38 PM IST

ఒకరు కుటుంబానికి పెద్ద దిక్కు అయిన భర్త.. మరొకరు కుటుంబాన్ని ఆదుకోవలసిన కుమారుడు.. ఒకరినొకరు కాపాడుకునే క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. ఒక్కగానొక్క కుమారుడిని కోల్పోయిన ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. భర్తను కోల్పోయిన భార్య, ఇద్దరు పిల్లలు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం, తెప్పలవలస గ్రామంలో జరిగింది.

Two died after falling into a pond at Ranasthalam Zone in Srikakulam District
ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు మృతి.. శోకసంద్రంలో కుటుంబం

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం, తెప్పలవలస గ్రామానికి చెందిన మేడూరి శశిధర్ (22), మేడూరి శ్రీనివాసరావు (42).. ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. ఉదయం ఇంటి నుంచి చెరువుకెళ్లిన వీరిద్దరూ ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం మృతదేహలను వెలికితీశారు.

శశిధర్ ఇటీవలే ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. మరో రెండు రోజుల్లో స్థానిక పరిశ్రమలో ఉద్యోగంలో చేరేందుకు ఇంటర్వ్యూకు సిద్ధమవుతున్న తరుణంలో.. అతన్ని చెరువు రూపంలో మృత్యువు కబళించింది. దీంతో అందివచ్చిన కుమారుడిని కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అలాగే శ్రీనివాసరావు మృతితో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. అతని భార్య, ఇద్దరు పిల్లలు గుండెలు పగిలేలా రోదించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.

పూజల కోసం వెళ్లి అనంతలోకాలకు..

శని, ఆదిత్య నవ గ్రహ దోష నివారణ పూజలు నిర్వహించేందుకు గ్రామంలోని విజయ రామసాగరం చెరువు వద్దకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. పూజ అనంతరం సామగ్రిని చెరువులో కలిపేందుకు దిగిన సమయంలో ఈత రాక.. ఒకరు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. అతన్ని కాపాడేందుకు దిగిన మరో వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై వాసు నారాయణ తెలిపారు.

ఇదీ చదవండి:

శ్రీకాకుళంలో విజయవంతంగా కొవిడ్ వ్యాక్సిన్ డ్రైరన్

ABOUT THE AUTHOR

...view details