సిక్కోలు ఆదివాసీలు తమ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ఎన్నో పండగలను ఈనాటికీ కొనసాగిస్తున్నారు. సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస గిరిజన గ్రామంలో తాజాగా గ్రామదేవత పూజలు జరిగాయి. వీరికి ఎన్నో పండుగలు ఉన్నా.. ఐదేళ్లకోసారి చేసే ఈ గ్రామ దేవత పూజలు మాత్రం ప్రత్యేకం. ఈ మూడు రోజులు గ్రామాన్ని వారు లాక్డౌన్ చేసేస్తారు. ఊళ్లో వారు బయటకు వెళ్లరు. బయటవారిని ఊళ్లోకి రానివ్వరు. ఈ నిబంధనకు అధికారులు కూడా అతీతులు కారు. అందుకే గ్రామంలోకి ఇతరులు ప్రవేశించకుండా ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. పాఠశాల, అంగన్వాడీ కేంద్రానికి మూడు రోజులు సెలవు ప్రకటించారు. సచివాలయ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు, వాలంటీర్లు కూడా ఈ మూడు రోజులు రావద్దని సూచించారు. గ్రామంలోకి ఎవరూ రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
అయితే వెన్నెలవలస గిరిజన గ్రామంలో జరిగిన గ్రామదేవత పూజలపై స్థానికంగా వదంతులు వచ్చాయి. ఒడిశాకు చెందిన మాంత్రికులతో గ్రామంలో క్షుద్రపూజలు నిర్వహించారని ప్రచారం జరిగింది. జిల్లాలో ఈ ఘటన సంచలనం సృష్టించటంతో... రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్యశాఖల అధికారులు గ్రామాన్ని సందర్శించారు. గిరిజనలు రహదారికి ఏర్పాటు చేసిన ముళ్ల కంచెలు తొలగించారు. గిరిజనులు మాత్రం ఆచారం ప్రకారం గ్రామదేవత పండగ జరుపుకున్నామని చెబుతున్నారు. ఐదేళ్లకు ఒక్కసారి వచ్చే గ్రామదేవత పండగకు నిర్వహించుకుంటున్నామని చెబుతున్నారు.