ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 22, 2019, 9:19 PM IST

Updated : Oct 22, 2019, 10:00 PM IST

ETV Bharat / state

ప్రతిపక్షంపై ప్రభుత్వం కక్షసాధిస్తోంది : చంద్రబాబు

తెదేపాపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారు. మీడియా, సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు పెడుతూ, ప్రజలకు సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నారని విమర్శించారు.  రివర్స్ టెండరింగ్ వల్ల మిగులు కన్నా నష్టమే ఎక్కువ జరిగిందన్నారు చంద్రబాబు.

ప్రతిపక్షంపై ప్రభుత్వం కక్షసాధిస్తోంది : చంద్రబాబు

శ్రీకాకుళంలో మీడియతో మాట్లాడుతున్న చంద్రబాబు

శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.. నియోజకవర్గాల వారీగా విస్తృతస్థాయి సమీక్షలు నిర్వహించారు. వైకాపా బాధితులతోనూ చర్చించారు. అనంతరం శ్రీకాకుళంలో మాట్లాడిన ఆయన ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని... ప్రతిపక్ష నేతలను ఆర్థికంగా, భౌతికంగా ఇబ్బంది పెడుతోందన్నారు. సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధిస్తున్నారని విమర్శనాస్త్రాలు సంధించారు. పోలవరంలో జరిగింది రివర్స్ టెండరింగ్ కాదని... అస్మదీయులకు కోసం జరిగిన రిజర్వు టెండరింగ్ అని ఎద్దేవా చేశారు. ఈ ప్రక్రియలో రూ.750 కోట్లు మిగులు కంటే... రూ.7,500 కోట్ల నష్టం వస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రపంచమంతా అమరావతి గురించి చర్చించుకునేలా చేశామన్న చంద్రబాబు.. హార్వర్డ్‌వర్సిటీలో రాష్ట్ర రాజధానిపై కేస్ స్టడీ చేశారన్నారు. బంగారు గుడ్లు పెట్టే బాతును అప్పగిస్తే చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిని ధ్వంసం చేసి చంద్రబాబు జ్ఞాపకాల్ని తుడిచేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టారని ... పోలీసు శాఖనూ భ్రష్టుపట్టించారని చంద్రబాబు నిప్పులు చెరిగారు.

Last Updated : Oct 22, 2019, 10:00 PM IST

ABOUT THE AUTHOR

...view details