శ్రీకాకుళం జిల్లా టెక్కలి ‘న్యూస్టుడే’ కంట్రిబ్యూటర్ వట్టికూళ్ల కీర్తికుమార్పై పోలీసులు పెట్టిన కేసును ఎత్తివేయాలని సంతబొమ్మాళి ప్రెస్క్లబ్ గౌరవాధ్యక్షుడు కర్రి శంకర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టారని అయన మండిపడ్డారు. సంతబొమ్మాళి పాలేశ్వరస్వామి ఆలయంలో నందివిగ్రహం తొలగింపు ఘటనతో గానీ, ఆ ప్రాంతంతో గానీ సంబంధం లేని కీర్తికుమార్పై కేసు నమోదు చేయడాన్ని ఖండించారు.
ఇది పత్రికా స్వేచ్ఛపై దాడేనని.... ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి ధోరణి సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సంతబొమ్మాళి తహసీల్దార్ ఎస్.రాంబాబు, డీఎస్పీ శివరామిరెడ్డి, ఎస్సై గోవింద్లకు శుక్రవారం వినతిపత్రాలు అందజేశారు. పోలీసు వ్యవస్థ, ప్రభుత్వం ఆలోచించి, కేసును వెనక్కి తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి సంతోష్, పాత్రికేయులు పాల్గొన్నారు.