Smart Meters For Agricultural Motors: "అగ్రికల్చర్కు కనెక్షన్కు మీటర్ల పెట్టాలని చెప్పి..ఆ రకంగా మన రాష్ట్రంలో దాదాపు 18లక్షల మంది రైతుల మోటార్లకు మీటార్లు పెట్టాలని ఆలోచన చేసి..ఓ పైలేట్ ప్రాజెక్ట్ మాదిరిగా శ్రీకాకుళం జిల్లాలో 28000 మీటర్లను పెట్టడం జరిగింది..అక్కడ చూస్తే దాదాపు 33.15శాతం ప్రభుత్వం చెల్లించే సబ్సిడీలో సేవింగ్స్ వస్తావున్నాయి.. ఈ విధంగా అన్ని జిల్లాల్లో చేస్తే ..10000కోట్లు రైతుల సబ్సిడీ కింద చెల్లిస్తున్నాము..దాదాపు మూడున్నర వెయ్యి కోట్లు ప్రభుత్వానికి ఆదా అవుతుంది.." మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
స్మార్ట్మీటర్ల గురించి విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెబుతున్న గొప్పలు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కూడా ఇవే మాటలు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా పైలట్ ప్రాజెక్టు విజయవంతమైందని.. 30 శాతం విద్యుత్ ఆదా అయిందని అన్నారు. దీనివల్ల రైతులకు మెరుగైన విద్యుత్ అందుతుందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పెద్దలు ఎందుకిలా ఆహా, ఓహో అంటున్నారా అని ఆరా తీస్తే.. ఇదంతా ఒక పథకం ప్రకారం చేస్తున్న ప్రచారంగా తేలింది. స్మార్ట్మీటర్లు గొప్పగా పనిచేస్తాయని, వాటివల్ల అద్భుత ఫలితాలు వస్తాయని ప్రచారం చేస్తూ.. సంబంధిత కాంట్రాక్టులో సింహభాగాన్ని అస్మదీయుడికి చెందిన షిర్డీసాయి ఎలక్ట్రికల్స్కు కట్టబెట్టేందుకు పన్నిన పన్నాగమని అర్థమైపోయింది.
వ్యవసాయ మోటార్లకు మీటర్ల ఏర్పాటుపై ముఖ్యమంత్రి, మంత్రి చెబుతున్న మాటలన్నీ అబద్ధాలని.. ప్రఖ్యాత ఇంధన పరిశోధన సంస్థ ప్రయాస్ ఎనర్జీ గ్రూప్-పీ.ఈ.జీ తో శ్రీకాకుళం జిల్లాలో ఆర్థికశాఖ చేయించిన అధ్యయనంతో తేటతెల్లమైంది. అక్కడ కొద్దిసంఖ్యలో ఐ.ఆర్.డీ మీటర్లు ఏర్పాటుచేసి, ఏడాది కాలంలో అనుభవంలోకి వచ్చిన అంశాల ఆధారంగా గాల్లో లెక్కలు వేసి.. రాష్ట్రమంతా 18.58 లక్షల స్మార్ట్మీటర్లు ఏర్పాటు చేస్తామనడం ఎంత తెలివి తక్కువతనమో పీ.ఈ.జీ అధ్యయనం స్పష్టంచేసింది. వాస్తవంగా శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టు వల్ల తగ్గిన విద్యుత్ వినియోగం 15 నుంచి 20 శాతమేనని పేర్కొంది. ఎంత తగ్గినా... దాన్ని సబ్సిడీ లెక్కల్లోకి మార్చి రాయితీ ఇంత తగ్గిందని చెప్పలేమని స్పష్టంచేసింది. డిస్కంలు అంత తక్కువ వ్యవధిలో పంపిణీ నష్టాల్ని తగ్గించుకోవడం కష్టమని తేల్చిచెప్పింది. 36 శాతం నష్టాల్ని తగ్గించామనుకుని, దాని ఆధారంగా ఇంత పెట్టుబడి వెనక్కి తిరిగి వస్తుందని లెక్కలు వేసుకోవడం సరికాదని కూడా.. పీ.ఈ.జీ నివేదిక విస్పష్టంగా తెలిపింది.
పీ.ఈ.జీ అధ్యయన నివేదిక ఆధారంగా.. ఈ ఏడాది సెప్టెంబరులో ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డిస్కంలకు లేఖలు రాశారు. శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా 28 వేల మోటార్లకు ఐ.ఆర్.డీ మీటర్లు అమర్చి.. ఏడాదిలో రైతుల కోసం ప్రభుత్వం చెల్లించే రాయితీ మొత్తంలో 23 నుంచి 36శాతం ఆదా చేయగలిగామని లెక్కలు వేసి.. ఆ ప్రాతిపదికన రాష్ట్రవ్యాప్తంగా 18.58 లక్షల స్మార్ట్మీటర్ల ఏర్పాటు నిర్ణయాన్ని సమర్థించుకోవాలనుకోవడం, వాటిపై పెట్టే సుమారు 6వేల 500 కోట్ల పెట్టుబడిని ఐదేళ్లలో వెనక్కి రాబట్టుకోగలమని చెప్పడం అసంబద్ధమని కుండబద్దలు కొట్టారు.
శ్రీకాకుళం పైలట్ ప్రాజెక్టు సమాచార నాణ్యతపై సందేహాలున్నట్లు తేల్చిచెప్పారు. అక్కడ 37శాతం మీటర్లలో విద్యుత్ వినియోగం సున్నాగా నమోదైందని.. అత్యధికశాతం విద్యుత్తును కొద్దిమందే వినియోగించారని గుర్తుచేశారు. దీన్నిబట్టి చూస్తే శ్రీకాకుళంలో మీటర్ల ఏర్పాటుతో విద్యుత్ రాయితీ ఆదా అయిందని చెప్పడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నట్లు పేర్కొన్నారు. పోనీ అన్ని మోటార్లకూ ఐ.ఆర్.డీ మీటర్లే పెడితే మొత్తం 870.40 కోట్లతో అయిపోతుందని, స్మార్ట్మీటర్లకు ప్రభుత్వం చేయాలనుకున్న ఖర్చు దీనికంటే ఏడెనిమిది రెట్లు ఎక్కువని స్పష్టంచేశారు.