ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వంశధార - నాగవళి ప్రాజెక్టు పనులు నత్తతో పోటీ పడుతున్నాయి!

శ్రీకాకుళం జిల్లాలో ఏడాది పొడవునా జల సవ్వడులతో దర్శనమిచ్చే వంశధార నదిని.. నాగావళితో అనుసంధానించేందుకు తలపెట్టిన... ప్రాజెక్టు నిర్మాణంలో అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. త్వరితగతిన పనులు పూర్తిచేసి డిసెంబరు నాటికి నీరందిస్తామని అధికారులు, పాలకులు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. మరోవైపు రైతులు పరిహారం, కాల్వల నిర్మాణాల విషయంలో పలు డిమాండ్లను ప్రజాప్రతినిధులతో పాటు అధికారుల ముందుకు తీసుకువస్తున్నారు.

By

Published : Nov 30, 2020, 7:11 PM IST

వంశధార-నాగవళి ప్రాజెక్టు పనులు నత్తతో పోటీ పడుతున్నాయి!
వంశధార-నాగవళి ప్రాజెక్టు పనులు నత్తతో పోటీ పడుతున్నాయి!

వంశధార-నాగవళి ప్రాజెక్టు పనులు ఆలస్యం

శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన సాగునీటి వనరులైన వంశధార, నాగావళి నదులను అనుసంధానించేందుకు.. 2017లో నాటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అప్పట్లో ప్రాజెక్టు నిర్మాణ పనులు చకాచకా జరిగినా.. ప్రస్తుతం నత్తతో పోటీపడుతున్నాయి. వర్షాకాలం మినహా నాగావళి నదిలో ఎప్పుడూ నీళ్లు ఉండవు. ఆ నదికి ఎగువన తోటపల్లి, మడ్డువలస రిజర్వాయర్లు ఉన్నా అక్కడి అవసరాలు తీరితే గానీ, దిగువకు నీళ్లు రావు. ఫలితంగా నాగావళి నది జిల్లాలో ఎప్పుడూ నిండుగా పారింది లేదు. దీనిపై ఆధారపడిన ఆయకట్టు ఎప్పుడూ ఇబ్బందుల్లో పడుతూనే ఉంది. వంశధారతో నాగావళి అనుసంధానం ఓ కొలిక్కి వస్తే.. నారాయణపురం ఆనకట్ట కింద 7 మండలాల పరిధిలోని 37 వేల 5 వందల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతో పాటు అనుసంధాన కాల్వ, డిస్ట్రిబ్యూటరీల వల్ల కొత్తగా మరో 5 వేల ఎకరాలకు సాగునీరందుతుంది. అయితే ఈ అనుసంధానం వల్ల తమ ప్రాంతం ముంపునకు గురవుతుందని బూర్జ మండలం రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

భూ వివాదాలు

నిర్మాణ పనులు కొంతవరకూ సజావుగానే సాగినా, అక్కడక్కడా అడ్డంకులు పడుతూనే ఉన్నాయి. పరిహారం చెల్లిస్తేనే గాని తమ పొలంలో కాల్వ పనులు ప్రారంభించడానికి వీల్లేదంటూ కొందరు రైతులు అడ్డుకోవడంతో కొంత వరకూ పనులు నిలిచిపోయాయి. మరోచోట భూవివాదం కోర్టు పరిధిలో ఉన్నందున పనులు ఆగాయి. ఏటా కురిసే భారీ వర్షాలతో తమ పంటలు ముంపునకు గురవుతున్నాయని లాభం, లంకాం సహా నదీ పరీవాహక ప్రాంతాల రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీనికి పరిష్కారంగా వయోడెక్ట్ నిర్మించాలని కోరుతున్నారు.

డిసెంబరు చివరి నాటికి పూర్తి!

వయోడెక్ట్ నిర్మాణానికి స్థలం అనువుగా లేదనేది అధికారుల వాదన. దీనిని ప్రత్యామ్నాయంగా అవసరమైన చోట్ల అండర్ టన్నెళ్ల నిర్మాణాల్ని ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. కొన్ని సమస్యలతో అక్కడక్కడా కాల్వ నిర్మాణ పనులు నిలిచిపోయాయని.. రైతుల అభ్యంతరాలతో మరింత ఆలస్యమవుతోందని అధికారులు తెలియజేశారు. నదుల అనుసంధానం ప్రభుత్వ ప్రాధాన్యత క్రమంలో ఉన్నందున డిసెంబరు చివరి నాటికి పనులు పూర్తి చేసి ఆయకట్టుకు నీరందిస్తామని స్పష్టంచేశారు.

డిసెంబరు నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి కొత్త ఆయకట్టుకు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. పూర్తవుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. అడ్డంకులన్నీ తొలగి పనులు ముందుకు సాగడానికి అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులు మరింత చొరవ చూపాల్సి ఉంది.

ఇదీ చదవండి:ఇదో ఫ్రాడ్ ప్రభుత్వం.. ఆయనో ఫేక్ సీఎం: చంద్రబాబు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details