జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రణస్థలం వద్ద చేపట్టాల్సిన బైపాస్ నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. సేకరించిన భూములకు ధర చెల్లింపు విషయంలో అటు హైవే అధికారులకు, ఇటు రైతులకు మధ్య అంగీకారం కుదరడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లించి మా భూముల్లో బైపాస్ నిర్మించుకోవచ్చని రైతులు చెప్పినప్పటికీ భూమి ధర అధికంగా ఉందని, దేశంలో ఎక్కడా లేని ధర ఇక్కడ నిర్ణయించారని ధరలో 30 శాతం తగ్గిస్తే తప్ప బైపాస్ నిర్మించలేమని వారు భీష్మించుకు కూర్చోవడంతో ఈ నిర్మాణం ఊగిసలాటలో పడింది. ఆకాశ వంతెన నిర్మిస్తే ఎలా ఉంటుందని అధికారులు ఆలోచన చేస్తుండటంతో అటు రైతుల్లోనూ, ఇటు వ్యాపారుల్లోనూ గుబులురేగుతోంది.
ఉన్నతాధికారులకు నివేదించినా.. :గతంలో అవార్డు పాస్ చేసిన ధరలే చెల్లించాలని జిల్లా ఉన్నతాధికార్లు హైవే అధికారులకు పలు దఫాలు లేఖలు రాశారు. అయినా ఫలితం లేకుండా పోయింది.
ఇబ్బందే...: ఇలాంటి పరిస్థితుల్లో ఆకాశ వంతెన నిర్మిస్తే మండల కేంద్రమైన జేఆర్పురం కూడలి పూర్తిగా ధ్వంసమయ్యే ఆస్కారముంది. ఆ రహదారిపై వెయ్యి కుటుంబాలు వివిధ రకాల వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరు ఇబ్బందుల్లో పడతారు.
బైపాస్ ఎక్కడ : రణస్థలం వద్ద
ఎన్ని కిలోమీటర్లు : 3.5
అవసరమైన భూమి : 60 ఎకరాలు
రెవెన్యూ పరిధి : గరికిపాలెం, రణస్థలం, లావేరు మండలం రావివలస
మూడేళ్ల కిందట నిర్ణయించిన ధరలు : గరికిపాలెం రెవెన్యూ పరిధిలో పల్లం భూమికి సెంటుకు రూ.2,63,000లు, మెట్ట భూమికి సెంటుకు రూ.2,62,000, జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న గరికిపాలెం రెవెన్యూలో సెంటుకు రూ.3,06000లు, రణస్థలం రెవెన్యూలో జాతీయ రహదారికి ఆనుకొని సెంటుకు రూ.2,59,000లు
● చెల్లించాల్సింది : రూ.87,27,57,845