శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహించి... లాక్డౌన్ కారణంగా ఎలాంటి ఆధారాలు లేకుండా ఇబ్బందులు పడుతున్న వలసదారులకు గుడారాలు ఏర్పాటు చేసి వారిని అందులో ఉంచారు. ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలతోపాటు జిల్లాలోని పలు మండలాలకు చెందిన వారిని ఇక్కడ ఉంచారు.
వలసదారులు నిరీక్షణ... సొంతూళ్లకు పంపాలని వేడుకోలు - శ్రీకాకుళం జిల్లా తాజా వార్తలు
లాక్ డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాలు, జిల్లాల్లో చిక్కుకున్న వలసదారులు, కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి వారి స్వగ్రామాలకు పంపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటు మరికొంతమంది కాలినడకనే తమ ఊళ్లకు నడుచుకుంటూ చేరుకుంటున్నారు. ఇంకొందరు అధికారుల పరిశీలనలో ఉన్నారు. ఈ క్రమంలో వారంతా అవస్థలు పడుతున్నారు.
రాత్రి నుంచి తనిఖీ కేంద్రం వద్ద నిరీక్షిస్తున్నామని, కనీసం త్రాగునీరు, ఆహార సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వలసకార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండతీవ్రతకు తట్టుకోలేక పలువురు చిన్నారులు, గర్భిణిలు అవస్థలు పడుతున్నారు. తమను తమ రాష్ట్రాలకు పంపాలని వలసదారులు పోలీసులను వేడుకుంటున్నారు. విశాఖపట్టణం నుంచి వచ్చిన వారిని తప్ప మిగిలిన అందరినీ బస్సుల్లో వారివారి గ్రామాలకు పంపించి పునరావాస కేంద్రాల్లో ఉండే విధంగా చర్యలు చేపడుతామని సీఐ మల్లేశ్వరరావు తెలిపారు.
ఇవీ చదవండి