శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం పొన్నాడ పంచాయతీలోని 25.40 ఎకరాల పేదల భూములను.. ఇళ్ల స్థలాల కోసం అధికారులు సేకరించారు. పొన్నాడలోని ఎస్సీలు, బీసీల పేరుతో ఉన్న మొత్తం భూమిని తీసుకున్న అధికారులు... ఎకరాకు 23 లక్షల 50 వేల రూపాయల చొప్పున పరిహారం చెల్లించారు. మొత్తం 29 మంది బ్యాంకు ఖాతాల్లో 5 కోట్ల 88 లక్షలు జమచేశారు. ఇక్కడే సరిగ్గా బాధితులకు సంబంధించిన కొందరు సామాజికవర్గ పెద్దలు, దళారులు రంగంలోకి దిగారు.
ప్రభుత్వం సేకరించిన భూమిలో... కొంత భూమి చెరువు గర్భంలో పోయిందని, కొందరికి పట్టాలు దస్త్రాల్లో లేవని వారిని నమ్మించారు. కేవలం 18.5 ఎకరాలకు 18 మందికి మాత్రమే పరిహారం అందిందని చెప్పి... వచ్చిన సొమ్మును సమానంగా పంచుకోవాలని తీర్మానించారు. అధికారులకు, ఇతర పనులకు ముట్టజెప్పిన సొమ్ము పోను మిగిలింది పంచితే.... ఒక్కొక్కరికీ 14 లక్షల 50 వేలు వస్తుందని నమ్మబలికారు. అలా ఒక్కో బాధితుడి నుంచి 9 లక్షల చొప్పున కోటి రూపాయలకు పైగా పక్కదారి పట్టించారు.