ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 25, 2023, 11:11 AM IST

ETV Bharat / state

కనుగులవలస గ్రామం..! ఇక్కడ ఇంటికో డాక్టరు..! ఎందుకో తెలుసా!

Kanugula valasa village : ఆ గ్రామంలో ఉద్యోగిత అధికం. సగటున ఇంటికో ప్రభుత్వ ఉద్యోగి ఉండగా.. సింహభాగం ఎంబీబీఎస్ వైద్యులే అంటే.. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకు మూడు తరాల ముందే పునాది వేశారంటే నమ్మక తప్పదు. వ్యవసాయం చేసుకునే వారంతా తమ పిల్లలు గొప్ప స్థాయిలో ఉండాలని కన్న కలలు వృథా కాలేదు. మొట్ట మొదటిగా గ్రామం నుంచి ఎంబీబీఎస్ చదివిన ఇద్దరు వైద్యులే ఆ గ్రామ యువతకు ఆదర్శమయ్యారు... ఫలితంగా నేడు 150 మంది వరకు వైద్యులుగా వివిధ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నారు. వందలాది మంది వివిధ హోదాల్లో కేంద్ర, రాష్ట్ర సర్వీసుల్లో పనిచేస్తున్నారు.

ఆముదాలవలస మండలం కనుగులవలస
Kanugula valasa village

Kanugula valasa village : ఆ గ్రామంలో ప్రతి ఇంట్లోనూ ఓ ఉద్యోగి, అందునా అత్యధికంగా డాక్టర్లు ఉన్నారు. జనాభాపరంగా చిన్న గ్రామమైనా... వ్యవసాయం చేసుకునే గ్రామస్తులు విద్యకు ప్రాధాన్యమిచ్చారు. తమ పిల్లలను బాగా చదివించారు. తొలి తరం వ్యవసాయంలో చెమటోడ్చగా.. రెండో తరం చదువులో రాణించి ఉద్యోగాలు దక్కించుకుంది. ఆ తర్వాత తరం వైద్యవృత్తిని ఎంచుకుంది. తల్లిదండ్రుల ఆశయంతో పాటు వైద్య విద్యపై పిల్లల ఆసక్తి.. ఫలితంగా డాక్టర్ల గ్రామంగా మారిపోయింది.

నాడు వ్యవసాయమే జీవనాధారం.. ఆ గ్రామంలో ప్రస్తుతం 2,800 వందల మంది జనాభా ఉంటే 900 మందికి పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడ్డారు, ప్రతి కుటుంబంలోనూ ఒక డాక్టరు, ఇంజినీరు, పోలీసు, రైల్వే ఉద్యోగిగా కచ్చితంగా ఉంటారు, అలా.. గ్రామంలో 150 మందికి పైగా ప్రముఖ వైద్యులు ఉన్నారు. ఢిల్లీ నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ హాస్పిటల్ లో ఇక్కడ వైద్యులు కచ్చితంగా ఉంటారు. ఈ గ్రామ పొలిమేరలో ఒక డాక్టర్ విగ్రహం కూడా దర్శనమిస్తోంది, వ్యవసాయమే జీవనాధారంగా జీవించే ప్రజలు తమ పిల్లలను డాక్టర్లు చేయాలని కలగన్నారు. ఆ కలలను నెరవేర్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం కనుగులవలస గ్రామస్తులు తమ పిల్లలను వైద్యులుగా తీర్చిదిద్ది సమాజానికి అందిస్తున్నారు.

పూర్వం మా ఊళ్లో ఎక్కవ మంది వ్యవసాయం చేసేవారు. తమ తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూసి వారి పిల్లలు చాలా కష్టపడి చదివారు. ఆ తర్వాత ఎక్కుమ మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించారు. వారి పిల్లలు కూడా ఎంతో క్రమ శిక్షణతో చదివి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఎయిమ్స్ మొదలుకుని జిల్లా కేంద్ర ఆస్పత్రిలో కూడా మా గ్రామానికి చెందిన డాక్టర్లే ఉన్నారు. - నూకరాజు, సర్పంచ్ కనుగులవలస

మా ఉళ్లో పిల్లలు ఎంతో క్రమశిక్షణతో చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. రైల్వే, పోలీస్, ఆర్మీ తో పాటు అనేక రంగాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం 120 మందికి పైగా ఎంబీబీఎస్ చదివిన డాక్టర్లు ఉన్నారు. - బొడ్డేపల్లి నారాయణ రావు, రిటైర్డ్ ఉద్యోగి

ఉపాధ్యాయులు, వైద్యులు, ఇంజినీర్లు.. ఇలా అన్ని రంగాల్లో సగటున ఇంటికో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. విద్యకు ప్రముఖ ప్రాధాన్యత ఇవ్వడమే ఇందుకు ప్రధాన కారణం. అందరూ కూడా వ్యవసాయ, మధ్య తరగతి కుటుంబాల వారే. - బొడ్డేపల్లి జనార్దన్ రావు, రిటైర్డ్ టీచర్

పిల్లలను బాగా చదివించాలనే ఉద్దేశంతో మా పూర్వీకుల నుంచి ఎంతో కష్టపడ్డారు. వారి కష్టం వృథా కాలేదు. విద్యకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఏ క్యాటగిరీలో చూసినా మా గ్రామ యువతే కనిపిస్తున్నారు. - శ్రీరామూర్తి, రిటైర్డ్ టీచర్

కనుగులవలస గ్రామంలో 1970లో మొట్ట మొదటిగా చంద్రరావు, భాస్కరరావు ఎంబీబీఎస్ చదివారు. ఈ ఇద్దరు వైద్యులే ఆ గ్రామ యువతకు ఆదర్శమయ్యారు, అప్పట్నుంచి కనుగులవలస డాక్టర్ల గ్రామంగా మారిపోయింది.

శ్రీకాకుళం పట్టణంలో ఉన్న ప్రధాన ఆసుపత్రిలన్నిటిలోనూ కనుగుల వలస గ్రామ డాక్టర్లే కనిపిస్తారు. సుమారు 25 మంది జిల్లా కేంద్రంలోని వైద్య సేవలు అందిస్తున్నారు. న్యూరో ఫిజీషియన్లు గైనకాలజిస్ట్లు, చెవి గొంతు ముక్కు నిపుణులు, డెంటిస్టులు బోన్ స్పెషలిస్టులు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రకాల జబ్బులకు కనుగులవలస ఊరిలో డాక్టర్లు ఉంటారు. - డా.బొడ్డేపల్లి సురేష్, సన్ రైజ్ హాస్పిటల్, శ్రీకాకుళం

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details