CROP DAMAGE DUE TO UNTIMELY RAIN: రాష్ట్రం వ్యాప్తంగా భానుడి భగభగలతో ప్రజలు ఉక్కపోతకు గురవుతుంటే.. శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఈదురుగాలతో కూడిన వడగళ్ల వర్షాలు ఈ వారంలో రైతుల్ని దెబ్బతీశాయి. లావేరు, జి.సగడం, ఎచ్చెర్ల, రణస్థలం, గార మండలాల్లో.. సుమారు 1,600 ఎకరాల్లో అరటి, మామిడి, చెరకు, మినుము, పెసర పంటలు దెబ్బతిన్నాయి. పంట చేతికి వచ్చే సమయంలో తీవ్ర నష్టం రావడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు అధికారులు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరొక నెలలో మామిడి పంట చేతికి వచ్చే దశలో వడగళ్ల వానతో కాయలు నేల రాలిపోయాయి. మామిడికాయలకు మచ్చలు ఏర్పడి కిందకి రాలిపోవటంతో కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడంలేదని రైతులు వాపోతున్నారు. అంతా బాగుంటే ఒక్కో మామిడికాయ లోడుకు 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఆదాయం వచ్చేదని, ప్రస్తుతం మామిడి కాయలుకు మచ్చలు రావడంతో ఒక మామిడి లోడును నాలుగు వేల రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేల రూపాయలు అప్పులు చేసి పంట కోసం పెట్టుబడి పెడితే.. అకాల వర్షం కారణంగా తాము తీవ్రంగా నష్టపోయామని వాపోతున్నారు. పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని.. లేకపోతే తాము వచ్చే ఏడాది పంటలు పండించే పరిస్థితిలో లేమని అంటున్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు ఎలా కట్టాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నామని, ప్రభుత్వమే తమకు దారి చూపాలని రైతులు వాపోతున్నారు.