ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా సుడిగుండంలో గంగపుత్రుల జీవన నావ! - Srikakulam district latest news

గంగపుత్రుల జీవితమే ఆటుపోట్ల ప్రయాణం. ఉపాధి వేటలో సముద్రాన్నే చుట్టేసే మత్స్యకారులు.. కరోనా సుడిగుండంలో చిక్కి విలవిల్లాడుతున్నారు. వలస జీవుల పరిస్థితి నడి సంద్రంలో నావలా తయారైంది. కరోనా భయంతో ఊళ్లకు చేరిన గంగపుత్రులు మళ్లీ తిరిగి వెళ్లలేక, సొంతూరులో వేట సరిగ్గా జరగక అష్టకష్టాలు పడుతున్నారు. స్థానికంగా జెట్టీలు, హార్బర్‌లు ఉంటే తమ ఉపాధికి ఢోకా ఉండదంటున్నారు.

Fisherman Problems
Fisherman Problems

By

Published : Oct 29, 2020, 4:43 PM IST

కరోనా సుడిగుండంలో గంగపుత్రుల జీవన నావ!

శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకారులపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. వైరస్ విజృంభణతో ఇంటికి చేరుకున్న వలస గంగపుత్రులు మళ్లీ తిరిగి వెళ్లడానికి సాహసించడం లేదు. మరోవైపు సొంత ఊరిలో ఉపాధి లభించకపోవటంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లాలోని 193 కిలోమీటర్ల సముద్రతీరంలో 172 మత్స్యకార గ్రామాలున్నాయి. అందులో సుమారు 30 వేల మంది వరకు వలస జీవులే. కరోనా దెబ్బకు దాదాపుగా 23 వేల మంది ఆర్నెల్లుగా ఇళ్లకే పరిమితం అయ్యారు. గతంలో తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, కేరళ, పుదుచ్చేరి, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, అండమాన్‌ నికోబార్ దీవులకు వెళ్తుంటారు. లాక్‌డౌన్‌ సడలించినా పూర్తిగా రవాణా సదుపాయాల్లేక, లాక్‌డౌన్‌ సమయంలో ఊరిగానిఊరులో పడిన ఇబ్బందులను తలుచుకుని ఇక్కడే ఉండిపోయారు. స్థానికంగా కుటుంబ పోషణ జరగక, అలాగని బయటి రాష్ట్రాలకు వెళ్లలేక బతుకు భారంగా వెళ్లదీస్తున్నారు.

ఊరు దాటితేనే ఉపాధి

సోంపేట మండలం చేపల గొల్లగండి గ్రామంలో 257 మత్స్యకార కుటుంబాలుంటే 150 కుటుంబాలు గోవా, పారాదీప్, చెన్నై, అండమాన్‌ దీవులకు వెళ్లేవారు. కరోనాతో అతికష్టం మీద అంతా సొంతూళ్లకు వచ్చేశారు. ఇక్కడ చేతి నిండా పని లేక ఇబ్బంది పడుతున్నారు. బయటి రాష్ట్రాలకు వెళ్తే ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయంటున్నారు స్థానికులు. వారం, పది రోజులు సముద్రంలో వేట సాగించినా మూడు, నాలుగు రోజులు హార్బర్‌లో విశ్రాంతి తీసుకోవచ్చని చెప్పారు. స్టీమర్, మరపడవల యాజమానులే భోజనాలు, ఇతర సదుపాయాలు కల్పిస్తారని వివరించారు.

ఐదేళ్లలో మార్పు: మంత్రి సీదిరి

వలసలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇసుక నేలలు కావటంతో ఉపాధి హామీ పథకం అమలుకు ఆటంకంగా మారింది. గ్రామాల్లో పురుషులు వేటకు వెళ్లడం, మహిళలకు విక్రయించడం తప్ప ఇతర పనులు రావు. ఇప్పుడు వేట సరిగ్గా జరగక కుటుంబాలు గడవడం కష్టమైపోతోంది. తీరంలో జెట్టీలు, ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేస్తే వలసలు నివారించవచ్చునని అంటున్నారు. ఐతే ఆ దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తోందంటున్నారు మంత్రి సీదిరి అప్పలరాజు. రానున్న ఐదేళ్లలో మత్స్యకారుల బతుకులు మారబోతున్నాయన్నారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు చూపితే తమ బతుకు తాము బతుకుతామని మత్స్యకారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి:

నవంబర్‌ 2 నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం షెడ్యూల్​ విడుదల

ABOUT THE AUTHOR

...view details