ఉత్తరాంధ్ర జిల్లాల్లోని సాగునీటి, తాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ప్రత్యేక వాహక సంస్థ(ఎస్పీవీ)ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 'ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్' పేరిట ప్రత్యేక వాహక సంస్థను ఏర్పాటు చేస్తూ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. 2013 కంపెనీల చట్టం కింద వంద శాతం ప్రభుత్వ నిధులతో ప్రత్యేక వాహక సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రాథమికంగా ఐదు కోట్ల రూపాయల పెట్టుబడితో దీనిని ఏర్పాటు చేశారు. విజయవాడలోని రైతు శిక్షణా కేంద్రం నుంచి ఈ కార్పొరేషన్ కార్యాలయం పని చేస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
బాబూ జగజ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుల కింద విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని 8 లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీటి సరఫరాతో పాటు 1037 గ్రామాల్లోని 30 లక్షల జనాభాకు తాగునీరు, పరిశ్రమలకు నీటిని సరఫరా చేసేందుకు ఈ కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులతో పాటు తాండవ ఎత్తిపోతల పథకంలోని రెండు దశలకూ 8,400 కోట్ల రూపాయల మేర ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.