ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 28, 2020, 8:44 PM IST

ETV Bharat / state

మైనర్​పై రెండేళ్లుగా అత్యాచారం..శీలానికి వెల..కేసు నమోదు

ప్రేమిస్తున్నానంటూ అభం శుభం తెలియని బాలిక వెంట పడ్డాడు ఆ కామాంధుడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబర్చుకున్నాడు. పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి.. గర్భస్రావం సైతం చేయించాడు. చివరకు పెద్దలకు విషయం తెలియటంతో గ్రామ పెద్దలు శీలానికి వెల కట్టి పోలీసుల సమక్షంలో రాజీకి యత్నించారు. దీనికి బాధిత కుటుంబం ససేమిరా అనటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిందితునిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన దారుణ ఘటన వివరాలివి..!

మైనర్​పై రెండేళ్లుగా అత్యాచారం.. శీలానికి వెల.. కేసు నమోదు
మైనర్​పై రెండేళ్లుగా అత్యాచారం.. శీలానికి వెల.. కేసు నమోదు

మైనర్​పై రెండేళ్లుగా అత్యాచారం.. వివరాలు వెల్లడిస్తోన్న బాధితురాలి తండ్రి

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని ఓ తీరప్రాంత గ్రామంలో మైనర్​పై ఓ వివాహితుడు పలుమార్లు అత్యాచారం చేసి మోసగించిన ఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన లక్ష్మణరావు.. ప్రేమించానంటూ అదే గ్రామానికి చెందిన ఓ బాలిక వెంట పడ్డాడు. బాలిక సోదరుడికి ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఇంటికి రాకపోకలు సాగించి.. వలపు వలకు తెరలేపాడు. ఆమెకు 15 ఏళ్ల వయసున్నప్పటి నుంచే బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. గర్భవతిని చేసి పలుమార్లు బలవంతంగా గర్భస్రావం కూడా చేయించాడు. నిందితుని మోసాన్ని కుటుంబ సభ్యులు ఆలస్యంగా గుర్తించారు.

గ్రామ పెద్దల వద్ద పంచాయితీ

బాలికను మోసగించిన ఘటనపై.. కుటుంబ సభ్యులు గ్రామ పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయతీ నిర్వహించారు. ఎటూ తేలకపోవడం వల్ల చివరకు పోలీసులను ఆశ్రయించారు. అక్కడా తమకు న్యాయం జరగలేదని బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. బాలిక శీలానికి వెలకట్టి రూ.18 లక్షలు, ఓ ఇంటి స్థలం.. బాధితురాలికి ఇచ్చేలా ఒప్పంద పత్రాలపై సంతకాలు పెట్టించినట్లు చెబుతున్నారు.

ఎస్పీ ఆదేశాలతోకదలిక

బాధిత కుటుంబీకులు తమకు న్యాయం చేయాలని ఈనెల 4వ తేదీన జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. కేసు నమోదు చేయాలని ఆదేశించినా.. ఆయన బదిలీ కావడం విషయం మళ్లీ మొదటికొచ్చింది. ఈ క్రమంలో ఈనెల 27న హ్యూమన్ రైట్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో కలసి బాధితులు మళ్లీ పోలీసులను ఆశ్రయించారు.

శనివారం అర్ధరాత్రి వరకూ తమను పోలీస్​ స్టేషన్​లో ఉంచి.. చివరకు కొత్త ఎస్పీ ఆదేశాలతో కేసు నమోదు చేశారని బాధితులు వాపోయారు. నౌపడా ఎస్సై, టెక్కలి సీఐ తమకు న్యాయం చేయకుండా వేధించారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

బాలిక తండ్రి ఆవేదన

తమ బిడ్డకు నిందితుడు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడని బాలిక తండ్రి ఆరోపించాడు.

మా బిడ్డ ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది. ఈమెకు 15 ఏళ్ల వయసున్నప్పటి నుంచి నిందితుడు .. నా కుమారునికి సీమెన్​ ఉద్యోగం ఇప్పిస్తానని తరచూ మా ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఉద్యోగం కోసం రూ.8 లక్షలు తీసుకుని ఏళ్లు గడుస్తున్నా.. ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఇదే సమయంలో నా కుమార్తెపై కన్నేశాడు. ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. గర్భవతి అయిన ఆమెను పలాసలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బలవంతంగా గర్భస్రావం చేయించేందుకు ప్రయత్నించడం మాకు తెలిసింది. పెళ్లి చేసుకుంటానని నా బిడ్డ నుంచి 18 తులాల బంగారం, రూ.2 లక్షల నగదు తీసుకున్నాడు. పోలీసులు మాకు న్యాయం చేయాలి. -బాలిక తండ్రి

బాధితురాలికి వైద్య పరీక్షలు..

బాధితురాలికి టెక్కలి జిల్లా ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి, ట్రైనీ డీఎస్పీ శ్రీలత బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. అనంతరం బాలిక గ్రామానికి వెళ్లి విచారించారు. నిందితుడు బాలికపై లైంగిక దాడికి పాల్పడిన జీడితోటను పరిశీలించారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితునిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని.. మరో 10 మందిపై కూడా కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో విచారణ కొనసాగిస్తామని అన్నారు.

ఇదీ చూడండి..

విద్యార్థినిపై లైంగికదాడిలో కొత్తకోణం.. వీడియోలు సోదరుడికి పంపిన నిందితురాలు?

ABOUT THE AUTHOR

...view details