ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 27, 2023, 11:01 PM IST

ETV Bharat / state

MLA Cheating: భూపరిహారం 4 రెట్లు ఇప్పిస్తానని హామీ.. కానీ ఆ తర్వాత

MLA Cheating: తెలుగుదేశం ప్రభుత్వం మంజూరు చేసిన భూ పరిహారానికి 4 రెట్లు అధికంగా ఇప్పిస్తామన్నారు... ఎన్నికల్లో తన గెలుపు కోసం కృషి చేస్తే ఐదు సెంట్ల ఇంటి స్థలం మీ సొంతమవుతుందని నమ్మబలికారు. ఇదంతా నిజమేననుకున్న రైతులు...కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పక్షాన నిలిచారు. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత అసలు తత్వం బోధపడింది. పరిహారం కోసం వెళ్లిన రైతులను చూసి ఎమ్మెల్యే మీరెవరని అనడంతో కర్షకులు ఖంగుతిన్నారు. ఎమ్మెల్యే చేసిన మోసాన్ని సీఎంకైనా చెప్పుకుందామని నిన్న ఆయన వాహన శ్రేణిని అడ్డగించే ప్రయత్నం చేశారు. కానీ వారి గోడు అరణ్యరోదనే అయ్యింది..

Etv Bharat
Etv Bharat

రైతులను మోసం చేస్తున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి

MLA Cheating Farmers : గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ సామాజిక మాధ్యమాల్లో తెగ హల్‌చల్‌ చేసే ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి... తమను మోసం చేశారని రెండు గ్రామాల రైతులు వాపోతున్నారు. నాలుగేళ్లుగా తమ ఊళ్లకు రాకుండా ముఖం చాటేస్తున్నారని తుంపర్తి, మోటుమర్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ప్రచారానికి వాడుకొని.. గెలిచాక ఇచ్చిన మాట గాలికొదిలేశారని వాపోతున్నారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన భూ పరిహారానికి నాలుగు రెట్లు అధికంగా ఇప్పిస్తామన్న ఎమ్మెల్యే... ఇప్పుడు కుదరదంటున్నారని కన్నీటి పర్యంతమవుతున్నారు.

2017లో టీడీపీ హయాంలో శ్రీ సత్యసాయి జిల్లా తుంపర్తి, మోటుమర్ల గ్రామాల పరిధిలోని భూమిలో... ధర్మవరంలోని నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ మేరకు 91 మంది రైతుల నుంచి 210 ఎకరాల భూమిని సేకరించారు. అప్పట్లో అక్కడ రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం ఎకరాకు 5 లక్షల రూపాయల పరిహారం నిర్ణయించారు. దీనికితోడు ప్రతి రైతులకు 5 లక్షల రూపాయలతో పాటు.. అక్కడే 5సెంట్ల స్థలం కూడా ఇస్తామని అప్పటి ప్రభుత్వం చెప్పింది. దీనికి సమ్మతించిన 27 మంది రైతులు పరిహారం అందుకున్నారు. అదనంగా మరికొంత పరిహారం కోరాలని ఆలోచిస్తున్న రైతుల వద్దకు అప్పటి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెళ్లారు. వచ్చేది వైసీపీ ప్రభుత్వమని.. పరిహారం ఎవరూ తీసుకోవద్దని..తాను ఎమ్మెల్యే కాగానే ఎకరాకు 20 లక్షలు ఇప్పిస్తానని నమ్మబలికారు. పరిహారం కోసం రైతులంతా హైకోర్టును ఆశ్రయించాలని వారికి సూచించారు. ఇదంతా నమ్మిన రైతులు 2019లో కేతిరెడ్డి గెలుపు కోసం పని చేశారు. కోర్టుల చుట్టూ తిరిగారు. కానీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే పట్టించుకోలేదని రైతులు నెత్తినోరు బాదుకుంటున్నారు.

భూములు పరిహారం కోసం ఎమ్మెల్యే కేతిరెడ్డి వద్దకు ఎన్నోసార్లు వెళ్లిన రైతులు.. తమ పరిహారం విషయాన్ని జగన్ తో మాట్లాడాలని కోరారు. ఇపుడే కాదు కొద్ది రోజులు ఆగండి అని ఎమ్మెల్యే వారికి చెప్పి పంపారు. కానీ సమస్య పరిష్కారం కాలేదు. కేతిరెడ్డి చెప్పినట్లుగా కొద్ది నెలలు ఆగి... ఆయనను కలవటానికి రైతులు ఇంటికి వెళ్లారు. అప్పుడే వారికి అసలు తత్వం బోధపడింది. మీరెవరు, ఎందుకు వచ్చారని ఎమ్మెల్యే ప్రశ్నించగానే.. బాధిత రైతులకు నోట మాటరాలేదు. పరిహారం గురించి రైతులు అడగ్గా.. గత ప్రభుత్వం 5 లక్షలు నిర్ణయించినందున ఏమీ చేయలేమని... అదే తీసుకోవాలని చెప్పారని రైతులు లబోదిబోమంటున్నారు.

మరో వైపు గత ప్రభుత్వం బాధిత రైతులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు పుట్టపర్తి హైవేకు ఇరువైపులా పదిన్నర ఎకరాల భూమిని పక్కకు పెట్టింది. దాన్ని కూడా తమకు చెందకుండా వైసీపీ కార్యకర్తలకు ఇంటి స్థలాలుగా ఇచ్చారని బాధిత రైతులు వాపోతున్నారు. ఇటు పరిహారం రాక, ఐదు లక్షల రూపాయలు, ఐదు సెంట్ల భూమి దక్కక తాము పూర్తిగా మోసపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎమ్మెల్యేతో పాటు జిల్లా యంత్రాంగం తమ గోడు పట్టించుకోకపోవడంతోనే నిన్న సీఎం జగన్ కాన్వాయ్‌ను అడ్డగించే యత్నం చేశామని రైతులు చెబుతున్నారు. అయినా అధికారులు ఎవరూ ఇంత వరకు తమను సంప్రదించలేదని వాపోతున్నారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details